దేవి నవరాత్రులు: ఆరో రోజు శ్రీమహాలక్ష్మీ అవతారంలో అమ్మ వారు

ఐదో రోజు 80వేల మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఐదు రోజుల్లో రూ. 2.50 కోట్ల ఆదాయం వచ్చింది.

Update: 2024-10-08 03:04 GMT

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దరస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దేవి నవరాత్రుల మహోత్సవాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. గత గురువారం ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆరో రోజు ఆశ్వయుజ మాస శుక్ల పక్ష షష్టి రోజు. ఈ పవిత్రమైన రోజున దుర్గమ్మ వారు శ్రీమహాలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజు అమ్మవారికి గులాబీ రంగు వస్త్రంతో అలంకరిస్తారు. బెల్లంతో చేసిన క్షీరాన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.

ఈ రోజు అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, లక్ష్మీ అష్టకంతో భక్తులు పూజిస్తే విశేష ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. ఇప్పటికే గత ఐదు రోజులు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఆరో రోజు ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అని మంత్రం చదివినా చాలు అమ్మవారు అనుగ్రహిస్తారని భక్తులు విశ్వసిస్తారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు.

సోమవారం శ్రీ మహాచండీదేవి రూపంలో ఉన్న అమ్మవారిని 80వేల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. ఐదు రోజుల ఉత్సవాల్లో ఇప్పటి వరకు 3.60లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. రూ. 2.50 కోట్లకుపైగా ఆదాయం వచ్చింది.
సీఎం చంద్రబాబు రేపు అమ్మవారిని దర్శించుకోనున్నారు. బుధవారం మధ్యాహ్నం దుర్గమ్మ గుడికి రానున్నారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. సీఎం రానున్న నేనపథ్యంలో పోలీసులు, దుర్గగుడి అధికారులు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
Tags:    

Similar News