యుద్ధం వేళ ఏపీ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఏపీ ప్రజల సమాచారం కోసం, సహాయం అందించడం కోసం 24 గంటల పాటు ఇది పని చేస్తుందని సీఎం చంద్రబాబు చెప్పారు.;
By : The Federal
Update: 2025-05-09 08:55 GMT
ఇండియా–పాకిస్తాన్ యుద్ధం నెలకొన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు ఏపీ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఉత్తరాది రాష్ట్రాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఈ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు.
ఇండియా–పాకిస్తాన్ దేశాల సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు, లేదా ఆయా రాష్ట్రాలకు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల సౌకర్యం కోసం దీనిని ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. జమ్మూ కశ్మీర్, లడక్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఉన్న లేదా ఆ రాష్ట్రాలకు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రజల సమాచారం కోసం, వారికి సహాయం అందించడం కోసం ఈ కంట్రోల్ రూమ్ 24 గంటల పాటు పని చేస్తుందని, ఆ రాష్ట్రాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ కంట్రోల్ రూమ్ను సంప్రదించొచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు.