Chittoor Courts |నేతల ఇళ్ల వద్ద భద్రత. ఇన్ని జాగ్రత్తలు ఎందుకంటే..?
మేయర్ దంపతుల హత్య కేసు. పదేళ్ల తరువాత నేడు తీర్పు
Byline : SSV Bhaskar Rao
Update: 2025-10-24 01:00 GMT
చిత్తూరు నగరంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. నగరంలో రాజకీయ నేతల ఇళ్ల వద్ద భద్రత పటిష్టం చేశారు. జిల్లా కోర్టులోకి న్యాయవాదులు మినహా ఇతరులపై ఆంక్షలు విధించారు. అనేక ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు.
పదేళ్ల కిందట మేయర్ కటారి అనూరాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసులో కొన్ని గంటల్లో తీర్పు వెలువడనున్నది. చిత్తూరులోని ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు అప్రమత్తం అయ్యారు. నగరంలో శాంతిభద్రతలు, ఎక్కడా పరిస్థితి అదుపు తప్పకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే వ్యవహారం చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మేయర్ దంపతుల హత్య కేసులో మొదటిసారి ఈ స్థాయిలో పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకోవడం వెనుక పరిస్థితిని అదుపులో ఉంచడమే ప్రధానంగా భావించినట్లు కనిపిస్తోంది.
పదేళ్ల నాటి కేసులో తీర్పు..
చిత్తూరు మేయర్ కఠారి అనూరాధ, ఆమె భర్త కటారి మోహన్ పది సంవత్సరాల కిందట నగర పాలక సంస్థ కార్యాలయంలో హత్యకు గురైన సంఘటన రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. ఈ జంట హత్యల కేసులో కొన్ని గంటల్లో (శుక్రవారం) చిత్తూరు తొమ్మిదవ అదనపు జిల్లా న్యాయస్థానంలో జడ్జి తీర్పు వెలువరించనున్నారు. రాజకీయంగా ప్రాధాన్యత, సంచలనం రేకెత్తించిన కేసు కావడం వల్ల పోలీసులు అలెర్ట్ అయ్యారు. న్యాయమేర్తితో పాటు, ఏపీపీ, మాజీ ఎమ్మెల్యే, నేతలు, హత్య కేసులో నిందితులుగా ఉంటూ మరణించిన వారి నివాసాల వద్ద కూడా భద్రత ఏర్పాట్లు చేశారు.
చిత్తూరులో హత్యకు గురైన మేయర్ దంపతులు కఠారి అనూరాధ, మోహన్ హత్య నేపథ్యంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పది సంవత్సరాల తరువాత తీర్పు వెలువడనున్న నేపథ్యంలో న్యాయమూర్తి, ఏపీపీ తోపాటు టీడీపీ నేత, చిత్తూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్ పర్సన్ కే. హేమలత, మాజీ ఎమ్మెల్యే సీకే. బాబు (సీకే. జయచంద్రారెడ్డి) ఇళ్ల వద్ద భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాలు జారి చేసినట్లు పోలీస్ కార్యాలయం స్పష్టం చేసింది.
కేసు ఏమిటి?
2015 నవంబర్ 17 : చిత్తూరు నగర మేయర్ కటారి అనూరాధ ఛాంబర్ లోని సీటులో కూర్చుని ఉన్నారు ఆమె భర్త మోహన్ కూడా అక్కడే ఉన్నారు. వారితో పాటు కొందరు టీడీపీ నేతలు కూడా ఉన్నారు. అదే సమయంలో ముసుగు ధరించిన కొందరు తొపాకులు, కత్తులతో మేయర్ చాంబర్ లోకి దూసుకుని వచ్చారు. మేయర్ అనూరాధను తుపాకీతో కాల్చడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. ఆమె భర్తను కత్తులతో వేటాడి చంపారు. దీంతో నగర పాలక సంస్థ కార్యాలయం రక్తంతో తడిసింది. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ప్రధాన నిందితుడిగా మేయర్ కటారి అనూరాధ, మోహన్ మేనల్లుడు చింటూ అలియాస్ చంద్రశేఖర్ తోపాటు ఈ కుట్ర వెనుక 23 మందిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈయన ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్ మెంట్ తీసుకున్నారు.
కేసు నమోదు.. చార్జిషీట్
చిత్తూరు నగరంలో మేయర్ కటారి అనూరాధ, మోహన్ దంపతుల హత్య నేపథ్యంలో చిత్తూరు-1 పోలీస్ స్టేషన్ లో Cr.No.130/2015 కేసు నమోదు చేశారు. 2016 ఫిబ్రవరి 18వ తేదీ చార్జిషీట్ దాఖలు చేశారు. ఇందులో ఏమని పేర్కొన్నారంటే..
"2015 నవంబర్ 17వ తేదీ ఉదయం 11.45 గంటలకు నిందితులు S. చంద్రశేఖర్ (చింటూ) (A1), వెంకటచలపతి (మూలబగల్ వెంకటేష్) (A2) తుపాకులు, ప్రాణాంతకమైన ఆయుధాలతో బుర్కాలు ధరించి, మరో ముగ్గురు సహ నిందితులతో కలిసి వచ్చారు. మేయర్ కార్యాలయంలోనే అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ పై దాడి చేసి హత్య చేశారు. ఈ దాడి ఆస్తి, ఆర్థిక వివాదాల కారణంగా జరిగింది. ఈ కేసులో మొత్తం A1 నుంచి A23 వరకు నిందితులు వివిధ పాత్రలతో నేరానికి కుట్ర పన్నడం, నేరంలో పాల్గొనడం, ప్రధాన నిందితుడికి ఆశ్రయం ఇవ్వడం, ఆయుధాలు సరఫరా చేయడం వంటి కుట్రలో భాగస్వాములయ్యారు." అని చార్జ్ షీట్లో ఆరోపించారు.
శుక్రవారం తీర్పు..
చిత్తూరులో జరిగిన మేయర్ కటారి అనూరాధ, మోహన్ దంపతుల హత్య ఘటన సంచలనం రేకెత్తింది. పోలీసుల దర్యాప్తు, చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో దీర్ఘకాలం విచారణ సాగింది. ఈ కేసుపై శుక్రవారం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. హత్య జరగడం వెనుక కుటుంబ, ఆర్థిక వ్యవహారాలు ఉన్నా, రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన అంశం కావడం వల్ల పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. తీర్పు వెలువడనున్న నేపథ్యంలో, పోలీసులు విస్తృత భద్రతా పరమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
చిత్తూరులో ఆంక్షలు.
చిత్తూరులో పరిస్థితి అదుపు తప్పకుండా, గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినట్టు చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ టి. సాయినాథ్ తెలిపారు. పోలీసు శాఖ తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలపై ఆయన ఏమి చెప్పారంటే..
"చిత్తూరు జిల్లా కోర్టు పరిసరాల్లో సిబ్బంది మినహా ఇంకోవరనీ అనుమతించం. నగరంలో 30 పోలీస్ యాక్టు అమలులో ఉంటుంది" అని చిత్తూరు డీఎస్పీ టి. సాయినాథ్ తెలిపారు. ప్రజలు పోలీసులతో సహకరించాలని ఆయన కోరారు.
జంటహత్యల కేసు స్థితి..
చిత్తూరు నగరంలో పదేళ్ల కిందట జరిగిన మేయర్ అనూరాధ, మోహన్ దంపతలు హత్య కేసు దర్యాప్తు సుదీర్ఘకాలం సాగింది. అందులో కొందరు జైలులో ఉన్నారు. ఇంకొందరు మరణించారు. ఈ వివరాలు ఇవి.
చిత్తూరు-1 పోలీస్ స్టేషన్ లో Cr.No.130/2015 కేసులో నిందితిడిగా ఉన్న A22 కసారం రమేష్ కేసు నుంచి విడుదలయ్యాడు. A21 (ఆయుధాలు సరఫరా చేసిన వ్యక్తి) మరణించాడు. A3, A4గా ఉన్న నిందితులు చిత్తూరు జిల్లా జైలులో ఉన్నారు. హత్య కేసులో ప్రధాన నిందితులు చంద్రశేఖర్ (చింటూ) (A1), వెంకటచలపతి (మూలబగల్ వెంకటేష్) (A2), A5, A20, A23 నిందితులు బెయిల్ పై బయట ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
నగరంలో బందోబస్తు
చిత్తూరు నగర మేయర్ అనూరాథ, మోహన్ దంపతుల హత్య కేసులో శుక్రవారం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా పరిస్థితి అదుపు తప్పకుండా నిఘా కూడా ఏర్పాటు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరణించిన వారి ఇళ్లతో పాటు K. హేమలత చైర్పర్సన్ (CHUDA), మాజీ ఎమ్మెల్యే C.K. బాబు ఇళ్ల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈ కేసులో తీర్పు వెలువరించనున్న జడ్జీ నివాసంతో పాటు ప్రభుత్వ న్యాయవాది, ఫిర్యాదుదారిడి ఇంటి వద్ద కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ సాయినాథ్ కథనం మేరకు
"నేరపూర్వ చరిత్ర కలిగిన, జైలు నుంచి విడుదలైన లేదా సమస్యాత్మక ప్రవర్తన కలిగిన నిందితులపై నిఘా. అనుమానాస్పద వ్యక్తులపై నిరంతర పర్యవేక్షణ" ఉంటుందని డీఎస్పీ సాయినాథ్ స్పష్టం చేశారు. పట్టణంలో కూడా నియంత్రణ చర్యలకు సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని, కోర్టు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించామని ఆయన వివరించారు.