మీ ఏడుపులే మాకు దీవెనలు
వైసీపీపై లోకేష్ సెటైర్లు వేయడంలో ఆరితేరి పోయారు.;
By : The Federal
Update: 2025-06-30 12:36 GMT
సీఎం చంద్రబాబు కొడుకు, మంత్రి నారా లోకేష్ వైసీపీ మీద, ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి మీద తనదైశైలిలో సెటైర్లు వేస్తూ ఎద్దేవా చేయడంలోను, అర్థమైందా రాజా.. అంటూ విమర్శల వ్యంగ్యాస్త్రాలు విసరడంలోను ఆరితేరిపోయారు. తాజాగా విద్యా వ్యవస్థ మీద మాజీ సీఎం జగన్ వేసిన ప్రశ్నలపైన కూడా మంత్రి లోకేష్ అదే రీతిలో సోషల్ మీడియా వేదికగా ప్రతిస్పందించారు. విద్యా వ్యవస్థలో తాము తీసుకొస్తున్న సంస్కరణలు, మార్పులు, ఆ మార్పుల పట్ల ప్రజలు కూటమి వైపు ఆకర్షిస్తున్న విధానంపై చూసి వైసీపీ వాళ్లు, ఆ పార్టీ నాయకులు వైఎస్ జగన్ రెడ్డి ఓర్చుకోలేక పోతున్నారని, కడుపు మంట వస్తోందని, మీ ఏడుపులే మాకు దీవెనలు అంటూ సెటైర్లు వేశారు.
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీ ఈసెట్ ఆడ్మిషన్లే పెద్ద ఉదాహరణని, ఈసెట్ ఫలితాలు వెలువడి 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదంటూ వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. మీ ఏడుపులే మాకు దీవెనలు వైఎస్ జగన్ గారు. మీరు ఐదేళ్లు విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసి పోయారు. నేను ఏడాదిలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిన పెట్టడం చూసి మీకు కడుపు మంట రావడం సహజం. మీ హయాంలో ఎప్పుడూ కౌన్సిలింగ్ పెట్టారో కూడా మీకు స్పృహలేదు. కోవిడ్ తర్వాత మీరు 2022 సెప్టెంబరులో, 2023 జూలై చివరికి ఈసెట్ కౌన్సిలింగ్ పూర్తి చేసిన మీరు మమ్మల్ని విమర్శించడం మీ అజ్ఞానికి నిదర్శనం. మేము ప్రభుత్వంలోనికి రాగానే ఈసెట్ మొదటి కౌన్సిలింగ్ని జూలై మూడో వారం కల్లా పూర్తి చేస్తాము. ఈ సంవత్సరం కూడా మొదటి కౌన్సిలింగ్ జూలై మూడో వారానికి పూర్తి చేస్తాము అంటూ సోషల్ మీడియా వేదికగా లోకేష్ వెల్లడించారు.