ఆంధ్రా-తెలంగాణ మధ్య కొత్త చిచ్చు..బనకచర్ల కథేంటి?

తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటానికి సై అంటున్న బనకచర్ల ప్రాజెక్టు అసలు కథ తెలుసుకుందాం..;

Update: 2025-06-07 13:21 GMT

రెండు తెలుగు రాష్ట్రాలమధ్య మరో జల యుద్ధం మొదలవుతోంది.ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం -బనకచర్ల ప్రాజెక్టు ఇందుకు వేదికైంది.సముద్రం లోకి వృధాగా పోయే గోదావరి జలాలను సద్వినియోగ చేసుకోవడానికే బనకచర్ల ప్రాజెక్టంటూ ఏపీ ప్రభుత్వం సమర్ధించుకుంటుంటే ,మోసపూరిత మాటలు వద్దంటూ తెలంగాణ ప్రభుత్వం బనకచర్లను అడ్డుకొని తీరుతామంటోంది..అసలు బనకచర్ల ప్రాజెక్టు ఏంటి..? తెలంగాణవాదులతో పాటు ఏపీలో ప్రతిపక్షాలు సైతం బనకచర్లను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి..?బనకచర్లపై వస్తున్న అభ్యంతరాలు ఏంటి ?

రెండు రాష్ట్రాల మధ్య నీటి వనరుల హక్కులపై తీవ్ర చర్చకు దారితీసిన బనకచర్ల ప్రాజెక్టు గోదావరి నీటి వివాదాల ట్రైబ్యునల్ (GWDT) అవార్డు 1980, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లను ఉల్లంఘిస్తోందని తెలంగాణ ఆరోపిస్తోంది.తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటానికి సై అంటున్న బనకచర్ల ప్రాజెక్టు అసలు కథ తెలుసుకుందాం..బనకచర్ల పూర్తయితే తెలంగాణలోని కృష్టాబేసిన్ రైతులకు శాశ్విత నష్టం వాటిల్లుతుందా..?మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీ చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు దూకుడుగా వ్యవహరిస్తోంది.?

అసలు బనకచర్ల ప్రాజెక్టు ఏంటి?

బనకచర్ల (Banaka charla) ప్రాజెక్ట్ అనేది గోదావరి నది నీటిని కృష్ణా నదికి అనుసంధానం చేసే లక్ష్యంతో రూపొందించిన జల వనరుల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ పోలవరం జలాశయం నుంచి బనకచర్ల రెగ్యులేటర్ వరకు 200 టీఎంసీఎఫ్‌టీ నీటిని తరలించే ఉద్దేశ్యంతో నిర్మిస్తున్నారు.దీని అంచనా వ్యయం రూ.81,000 కోట్లుగా నిర్ణయించారు. 200 టిఎంసిల గోదావరి జలాలను పోలవరం కుడి కాల్వ ద్వారా కృష్ణా బేసిన్ కు తరలించి అక్కడ నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కాంప్లెక్స్ ద్వారా పెన్నా బేసిన్లో ఉన్న రాయలసీమ ప్రాజెక్టులకు తరలించే ప్రాజెక్టు ఇది.ఈ మార్గంలో 150 టిఎంసిల నిల్వ సామర్థ్యంతో బొల్లపల్లి వద్ద ఒక భారీ కృత్రిమ జలాశయాన్ని నిర్మించడానికి ప్రతిపాదించారు.బొల్లపల్లి జలాశయం, శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్‌ల ద్వారా గోదావరి నీటిని బనకచర్లకు తీసుకెళ్లేలా ప్లాన్ చేశారు.చంద్రబాబు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తరువాత దీనిపై దృష్టిపెట్టారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వరద నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చని, సముద్రంలోకి వృథాగా పోయే నీటిని ఆదా చేయవచ్చని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ఈ పథకం వల్ల రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని ,వ్యవసాయం, ఉద్యానవన రంగాలు అభివృద్ధి చెందుతాయని తద్వారా ఆర్థికాభివృద్ధి సాధ్యమంటున్నారు.

నిధుల సమీకరణకు జల హారతి కార్పొరేషన్

బనకచర్ల ప్రాజెక్ట్ కోసం ఏపీ ప్రభుత్వం జల హారతి కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారా నిధుల సమీకరణ, ప్రాజెక్ట్ అమలును వేగవంతం చేయాలని భావిస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో ఇటీవల జరిగిన చర్చల్లో ఈ ప్రాజెక్ట్ డీపీఆర్‌పై సమీక్ష జరిగింది.ఆర్ధిక వనరుల సమీకరణ కోసం కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఏపీ ప్రతిపాదనలు పంపించింది. మొత్తం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.81,900 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసి,. అందులో 50 శాతం అంటే రూ.40,950 ఈఏపీ (External Aid Projects) రుణంగా పొందాలని నిర్ణయించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ గ్రాంట్‌గా 20 శాతం నిధులు రూ.16,380 కోట్లు సమకూర్చుకోవాలని.. రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీగా 10 శాతం నిధులు రూ.8,190 కోట్లు.. హ్యామ్ (Hybrid Annuity Model)విధానంలో మరో 20 శాతం నిధులు రూ.16,380 కోట్లు సమకూర్చుకుంటున్నారు.ఈ ప్రాజెక్ట్‌ని 2027 నాటికి పూర్తి చేయాలని ఏపీ లక్ష్యంగా పెట్టుకుంది.

బనకచర్లను తీవ్రంగా తప్పుపడుతున్న తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ గోదావరి నీటి వివాదాల ట్రైబ్యునల్ (GWDT) అవార్డు 1980, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లను ఉల్లంఘిస్తోందని తెలంగాణ ఆరోపిస్తోంది.తెలంగాణ నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించారు. సెంట్రల్ వాటర్ కమిషన్, గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు నుండి అనుమతులు లేకుండానే బనకచర్ల కోసం ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోందని ఆరోపించారు.. ఈ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణలోని కృష్ణా బేసిన్‌లోని రైతులకు శాశ్వత నష్టం వాటిల్లవచ్చని ఆయన హెచ్చరించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా నీటిలో తెలంగాణ హక్కును 299 టీఎంసీఎఫ్‌టీగా నిర్ణయించి, ఏపీకి 512 టీఎంసీఎఫ్‌టీ ఇచ్చిందని కూడా ఆయన విమర్శించారు.బనకచర్ల ను అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం పై విపక్షాలు వత్తిడి తెస్తున్నాయి.ఈ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా అఖిలపక్ష సమావేశం, ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని బీఆర్ఎస్ సీనియర్ నేత , మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండా 200 టీఎంసీఎఫ్‌టీ నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

బనకచర్లను తెలంగాణ ఎందుకు వ్యతిరేకించాలి?

నీటిపారుదల నిపుణులు శ్రీధర్ రావు దేశ్పాండే మాటల్లో..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం–2014 ప్రకారం రెండు రాష్ట్రాలు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు గోదావరి/కృష్ణా బోర్డుల అనుమతి, ఆ తర్వాత అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరిగా పొందాలి. చట్టంలోని ఈ నిబంధనని ఉటంకిస్తూ గతంలో చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, ఆర్ విద్యాసాగర్ రావు డిండి, సీతమ్మసాగర్, తుమ్మిళ్ళ, భక్త రామదాసు, తదితర ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదులు చేసిన సంగతి ఆయన మరచిపోయినా తెలంగాణ సమాజం మరచిపోదు. ఇవి ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వాలు రూపొందించిన ప్రాజెక్టులే అయినా వీటికి చంద్రబాబు అభ్యంతరం చెప్పారు.

ఆనాడు రూప కల్పన చేసిన గోదావరి-పెన్నాలింకు పథకం ఇప్పుడు గోదావరి- బనకచర్ల లింకు పథకంగా కొత్త రూపం సంతరించుకున్నది కాబట్టి ఆయనే చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం చంద్రబాబు గోదావరి-బనకచర్ల లింకు పథకం డిపిఆర్ ను గోదావరి బోర్డుకు సమర్పించాలి. డిపిఆర్ ప్రతిని పరిశీలన కోసం తెలంగాణ ప్రభుత్వానికి పంపించాలి. గోదావరి బోర్డులో చర్చ జరిగిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ లో చర్చకు పెట్టాలి. అపెక్స్ కాన్సిల్ అనుమతి పొందిన తర్వాతనే ప్రాజెక్టు పనులు చేపట్టాలి. ఇవేవీ చేయకుండా నేరుగా ప్రాజెక్టు పనులు చేపట్టడం, అందుకు కేంద్రం నిధులు సమకూర్చడం చట్ట విరుద్దం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే గోదావరి జలాల పున:పంపిణీ కోసం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం, 1956 సెక్షన్ 3 కింద గోదావరి ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయమని కేంద్రాన్నికోరింది.. తెలంగాణ సహా గోదావరి బేసిన్ రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం సేకరిస్తున్నది. గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటుకు ముందే ఎపి 200 టిఎంసిల నీటిని వినియోగించే గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు పనులను ప్రారంభించి వేల కోట్లు ఖర్చు చేసి గోదావరి ట్రిబ్యునల్ ముందు 200 టిఎంసిల నీటిని జి బి లింకు ప్రాజెక్టుకు కేటాయించమని వాదించే అవకాశం ఉన్నది. ఇప్పుడు అమలులో గోదావరి ట్రిబ్యునల్ లో పొందుపరచిన 10 అంతర్రాష్ట్ర ఒప్పందాల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లెక్క గట్టిన 1486 టిఎంసిలలో తెలంగాణ ప్రాజెక్టులకు 969 టిఎంసిలను కేటాయించారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో వాస్తవ వినియోగం 200 టిఎంసిలకు మించలేదు. కేటాయింపులు కాగితాల మీదనే ఉన్నాయి. కొన్ని ప్రాజెక్టులు అసంపూర్ణంగా ఉండి పోవడంతో తెలంగాణ తన వాటాను సంపూర్ణంగా వినియోగించు కోలేకపోయింది.గోదావరి ట్రిబ్యునల్ వద్ద జి బి లింకు ప్రాజెక్టుకు 200 టిఎంసిలు కేటాయించమని ఏపీ అడిగితే అప్పుడు ఏపి క్లెయిమ్ చేసే వాటా 975 టిఎంసిలకు పెరుగుతుంది. తెలంగాణ వాటాకు 969 టిఎంసిలకు ఎసరు పెట్టె ఎత్తుగడ.

రాష్ట్ర విభజన తర్వాత నాగార్జునసాగర్ ఎగువన తెలంగాణ రాష్ట్రమే ఉన్నది కనుక ఉమ్మడి ఏపీకి కేటాయించిన 45 టిఎంసిలు తెలంగాణకే చెందుతాయి. అందుకే ఈ నికర జలాలను పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించడం జరిగింది. గోదావరి అవార్డు Annexure C Clause 7 (f) ప్రకారం పోలవరం నుంచి 80 టిఎంసిలకు మించి గోదావరి జలాలను కృష్ణా బేసిన్ కు తరలించినట్టయితే ఆ నీటిలో కూడా అదే నిష్పత్తిలో.. అంటే 45:21:14 నిష్పత్తిలోనే కృష్ణా జల్లాల్లో వాటాను ఎగువ రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాలు డిమాండ్ చేయవచ్చు. ఇప్పుడు ఎపి 200 టిఎంసిల గోదావరి జలాలను పోలవరం నుంచి కృష్ణా బేసిన్ కు, అటునుంచి పెన్నా బేసిన్ కు తరలించుకుపోతున్నది కనుక గోదావరి అవార్డు ప్రకారం కృష్ణా జలాల్లో అదనంగా 112.5 టిఎంసిల వాటాను తెలంగాణ డిమాండ్ చేయవచ్చన్నది నీటిపారుదల నిపుణులు శ్రీధర్ రావు దేశ్పాండే చెబుతున్న మాట. అలా జరిగితేనే బనకచర్లకు అడ్డంకి వుండదు.తెలంగాణ ఎల్లప్పుడూ గివింగ్ ఎండ్ లో, ఎపి రిసీవింగ్ ఎండ్ లో ఉండడానికి వీలు లేదన్నది తెలంగాణ నీటిపారుదల నిపుణుల అభిప్రాయం.

చంద్రబాబు బనకచర్ల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న ఏపీ విపక్షాలు

తాజాగా బనకచర్ల అంటూ చంద్రబాబు కొత్త పాటపాడుతున్నారని ఏపీలో విపక్షాలు కూడా మండిపడుతున్నారు. చిత్తశుద్ది ఉంటే ముందుగా పోలవరం ప్రాజెక్టుతో పాటు , రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి. అలాగే గాలేరు-నగరి నుంచి హంద్రీనీవాకు అనుసంధానం చేసే కాలువ పనులను పూర్తి చేయాలి. పోతిరెడ్డిపాడు వంటి ప్రాజెక్ట్ లేకపోతే రాయలసీమ పరిస్తితి ఏమిటని ఆలోచిస్తేనే భయం వేస్తోంది. పోలవరం-బనకచర్ల అంటూ చంద్రబాబు ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ విమర్శిస్తోంది. నిర్మాణంలో వున్న ప్రాజెక్టులను పట్టించుకోకుండా , అసలే అప్పులలో రాష్ట్రం వుందంటూ వేల కోట్లతో బనకచర్ల ఎందుకని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ప్రశ్నించారు.రాష్ట్రానికి కావాల్సింది ఆయకట్టు రైతులందరికీ నీరందించే పధకాలా? వేల కోట్ల గోదావరి- బనకచర్ల పథకమా?అంటూ రైతు సంఘాల నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లుంది సాగు నీటి ప్రాజెక్టుల విషయం లో టిడిపి కూటమి ప్రభుత్వం వైఖరి అని రాజ్య సభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసి రెడ్డి విరుచుకు పడ్డారు. శ్రీశైలం ప్లంజ్ పూల్ మరమ్మత్తులకు రూ 300 కోట్లు విడుదల చేయని కారణంగా శ్రీశైలం డ్యాం ప్రమాదపు అంచుల్లో వుందని, రెండు సంవత్సరాలలో రూ 15,000 కోట్లు ఖర్చు పెడితే పెండింగ్ లో ఉన్న వెలిగొండ,తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీ నీవా,అన్నమయ్య,ఫించా, ఝరికోన లాంటి ప్రాజెక్టులన్నీ పూర్తి అయి రాష్ట్రం సస్య శ్యామల మవుతుందన్నారు.ఈ నేపథ్యంలో రూ 81900 కోట్లతో పోలవరం - బనక చర్ల ప్రాజెక్టు కోసం టెండర్లు పిలవాలని చంద్ర బాబు ప్రభుత్వం తహ తహ లాడడం విడ్డూరంగా వుందని , ఇదంతా కమిషన్ల కోసమేనని కాంగ్రెస్ ఎద్దేవా చేస్తోంది..

రెండు రాష్టాల వివాదంగా మారిన బనకచర్లపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం సహకారంతో ముందుకు దూసుకు వెళుతుండగా , తెలంగాణ మాత్రం ఎలా నిర్మిస్తారో చూస్తానంటోంది. ఈ వివాదంలో కోర్టులు చుట్టూ తిరిగే అవకాశం వుందని నీటిపారుదల నిపుణులు అంటున్నారు. మరి నదీ జలాల పంపిణీ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదురుతుందా, పట్టుబట్టి బనకచర్లను చంద్రబాబు ముందుకు తీసుకు వెళతారో చూడాలి.

Tags:    

Similar News