చంద్రబాబు పర్యవేక్షనలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లు
రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల రైతులను ప్రధాని సభకు రావాలని సీఎం స్వయంగా ఆహ్వానించారని మంత్రి నారాయణ చెప్పారు.;
By : The Federal
Update: 2025-04-29 06:37 GMT
మే2న ప్రధాని మోదీ అమరావతి పర్యటన సందర్భంగా కూటమి ప్రభుత్వం అత్యంత ఆర్భాటంగా ఏర్పాట్లు చేపట్టింది. గతంలో ఎన్నడు లేని విధంగా అరేంజ్మెంట్స్ను చేస్తోంది. గత నెల రోజులుగా కూటమి ప్రభుత్వం ఇదే పని మీద ఉంది. ఏర్పాట్ల కోసం ఏకంగా మంత్రులను ఒక కమిటీగా కూడా ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ రాక సమీపిస్తున్న నేపథ్యంలో ఆగమేఘాల మీద వీటిని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. మంగళవారం ఉదయం మంత్రి పొంగూరు నారాయణ అధికారులతో కలిసి ఈ ఏర్పాట్లను పరిశీలించారు.
సభా వేదిక,పార్కింగ్ ప్రాంతాలు,వేదిక వద్దకు చేరుకునే మార్గాలు పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ..మే 2 న సాయంత్రం 3.25 కి ప్రధాని మోదీ అమరావతి వస్తారు. ప్రధాని పర్యటనకు సంబంధించి 90 శాతం పనులు పూర్తయ్యాయి. బుధవారానికల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. రాజధాని కోసం కేవలం 50 రోజుల్లో ఒక్క సమస్య కూడా లేకుండా రైతులు భూములు ఇచ్చారు. అమరావతిలో అంతర్జాతీయ రాజధాని కట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. దీని కోసం సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించాం. 365 కిమీ ట్రంక్ రోడ్లు, లే ఔట్ రోడ్లు 1500 కిమీ మేర నిర్మించేలా ప్లాన్ ఉంది. గతంలోనే రూ. 41 వేల కోట్లకు పనులు ప్రారంభం అయ్యాయి. 2019 నాటికి ముందు రూ. 5 వేల కోట్ల బిల్లులు కూడా చెల్లించాం. గత ప్రభుత్వం రాజధానిపై మూడు ముక్కలాట ఆడింది. మళ్ళీ మా ప్రభుత్వం రాగానే అమరావతి పనులు ప్రారంభించాం. గత ప్రభుత్వం కాంట్రాక్టర్ల అగ్రిమెంట్లు క్లోజ్ చేయలేదు. రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ ప్రివ్యూ తీసుకొచ్చింది.
న్యాయపరమైన సమస్యలు లేకుండా ముందుకెళ్లేందుకు ఇంత సమయం పట్టింది. 43 వేల కోట్ల పనులను ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తారు. అమరావతి రాజధాని పునఃప్రారంభం ప్రధాని చేస్తారు. మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తాం. నిన్న సోమవారం రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు రెండుగంటల పాటు మాట్లాడారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల రైతులను ప్రధాని సభకు రావాలని సీఎం స్వయంగా ఆహ్వానించారు. అమరావతిపై పార్లమెంట్లో చట్టం చేయాలని రైతులు అడిగారు. చట్టబద్ధత అంశాన్ని పరిశీలించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారని మంత్రి నారాయణ తెలిపారు.