పొగాకు కొనుగోళ్లకు 150 కోట్లు కేటాయించండి

సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ భేటీ అయ్యారు.;

Update: 2025-06-15 11:55 GMT

టొబాకో బోర్డు ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రూ.150 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ను కోరారు. ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబుతో ఆదివారం కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలోని వివిధ అంశాలపై ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి మధ్య చర్చ జరిగింది. మరి ముఖ్యంగా బ్లాక్‌ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్‌పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్‌ పై జీఎస్టీ తగ్గింపు వంటి పలు అంశాల మీద ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా పొగాకు ధరలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే రూ.300 కోట్లతో 20 మిలియన్‌ కేజీలు కొనుగోలు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రికి వివరించారు. అయితే ఇందులో రూ. 150 కోట్లు టొబాకో బోర్డు భరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఏడు చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రికి వివరించారు. పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్‌ వంటి అంశాలను టొబాకో బోర్డు ద్వారా నియంత్రించేలా చట్టసవరణ చేయాలని కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ను సీఎం చంద్రబాబు కోరారు. పామాయిల్‌ దిగుమతి సుంకాన్ని 10 శాతానికి తగ్గించడంపై పునరాలోచన చేయాలని కోరారు. దిగుమతి సుంకం తగ్గించడం వల్ల రాష్ట్రంలోని పామాయిల్‌ రైతులకు సరైన ధర రావడం లేదని.. దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయం, కేంద్రం నిర్దేశించిన నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌ లక్ష్యాలకు కూడా ఇబ్బందికరంగా ఉంటుందనే విషయాన్ని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి గుర్తు చేశారు.
ఆక్వా ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాల విషయంలో ఆ దేశంతో చర్చలు జరపాలని సీఎం చంద్రబాబు సూచించారు. సీఫుడ్‌ పై అమెరికా విధించిన 27 శాతం సుంకాలు ఏపీలోని 8 లక్షల మంది ఆక్వా రైతులపై ప్రభావితం చూపుతోందని పేర్కొన్నారు. ఏపీ ఆక్వా రైతులపై ఈ భారాన్ని తగ్గించేలా చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. మ్యాంగో పల్ప్‌ పై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించాలని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ను కోరారు. ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్టు చంద్రబాబు వివరించారు.


Tags:    

Similar News