జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డులు..
ప్రతి నెల రూ. 2 లక్షల కోట్లుగా వసూళ్లు,;
By : Praveen Chepyala
Update: 2025-06-30 14:28 GMT
జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో స్థూల జీఎస్టీ వసూళ్లు ఐదు సంవత్సరాల క్రితంతో పోలిస్తే రెట్టింపు అయ్యి ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ మొత్తం 22.08 లక్షలుగా ఉంది. 2021 ఆర్థిక సంవత్సరం గణాంకాల ప్రకారం చూస్తే 11.37 లక్షల కోట్లుగా ఉందని ప్రభుత్వం తెలిపింది.
స్థూల వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గత ఆర్థిక సంవత్సరం కంటే 9.4 శాతం వృద్దిని నమోదు చేశాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ నెలవారి వసూళ్లు 1.84 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇది గత ఏడాది 1.68 లక్షల కోట్లుగా, అంతకుముందు ఏడాది 1.51 లక్షల కోట్లుగా ఉంది.
ఎనిమిదేళ్లలో పెరుగుదల..
ఎనిమిది సంవత్సరాలలో జీఎస్టీ కింద నమోదైన పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2017 లో 65 లక్షల నుంచి 1.51 కోట్లకు పెరిగింది. ‘‘జీఎస్టీ అమల్లోకి వచ్చిన తేదీ నుంచి వస్తువులు, సేవల పన్ను ఆదాయ సేకరణ, పన్ను బేస్ విస్తరణలో బలమైన వృద్దిని నమోదు చేసింది.
ఇది దేశ ఆర్థిక స్థితిని క్రమంగా బలోపేతం చేసింది. పరోక్ష పన్నులను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా చేసింది’’ అని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
2024-25 లో జీఎస్టీ లో ఇప్పటి వరకూ ఎన్నడూ లేనంతగా రూ. 22.08 లక్షల కోట్ల స్థూల వసూళ్లను నమోదు చేసింది. ఇది వార్షికంగా 9.4 శాతం వృద్దిని నమోదు చేసింది.
2023-24, 2022-23లో జీఎస్టీ వసూళ్లు రూ. 20.18 లక్షల కోట్లు, 2022-23 లో 18.08 లక్షల కోట్లు, 2021- 22 లో మొత్తం స్థూల జీఎస్టీ వసూళ్లు రూ. 11.37 లక్షల కోట్లు ఈ కాలంలో సగటు నెలవారీ వసూళ్లు 95 వేల కోట్లుగా ఉంది.
జూలై 1, 2017 న ప్రారంభించబడిన జీఎస్టీ సోమవారంతో ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. జీఎస్టీలో దాదాపు 17 స్థానిక పన్నులు, 13 సెస్సులు ఐదు అంచెల పన్ను స్లాబులో కలిపివేశారు.
పన్ను విధానం సరళీకృతం చేయడంతో అనేక మంది పన్ను పరిధిలోకి చేరారు. నెలవారీ జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. 2025 లో ఏకంగా రికార్డు స్థాయిలో 2.37 లక్షల కోట్లుగా నమోదైంది. మే 2025 లో ఇది రూ. 2.01 లక్షల కోట్లుగా ఉంది. జూన్ నెలకు సంబంధించిన గణాంకాలు మంగళవారం విడుదల కానున్నాయి.