‘‘కాంచన్‌జంగా’’ రైలు ప్రమాద ఘటనకు కారణాలను బయటపెట్టిన సీఆర్‌ఎస్

పశ్చిమ బెంగాల్‌లో ప్యాసెంజర్ రైలును గూడ్స్ రైలు ఢీ కొట్టిన ఘటనపై విచారణ చేపట్టిన రైల్వే సేఫ్టీ కమిషనర్ (CRS) విచారణ జరిపింది.

Update: 2024-07-16 10:36 GMT

పశ్చిమ బెంగాల్‌లో ప్యాసెంజర్ రైలును గూడ్స్ రైలు ఢీ కొట్టిన ఘటనపై విచారణ చేపట్టిన రైల్వే సేఫ్టీ కమిషనర్ (CRS) విచారణ జరిపింది. జూన్ 17న జరిగిన ఈ ఘటనలో గూడ్స్ రైలు లోకో పైలట్‌తో సహా 10 మంది ప్రయాణికులు మరణించిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు రైల్వే సేఫ్టీ కమిషనర్ కొన్ని సూచనలు చేసింది. ఆటోమేటిక్ రైలు-రక్షణ వ్యవస్థ (KAVACH) అమలుకు సిఫార్సు చేసింది. ఆటోమేటిక్ సిగ్నల్ జోన్‌లలో విధులు నిర్వహిస్తున్న లోకో పైలట్లు, స్టేషన్ మాస్టర్‌లకు కౌన్సెలింగ్ అవసరమని పేర్కొంది. గూడ్స్ రైలు లోకో పైలట్‌కు సరైన సిగ్నల్ ఇవ్వలేదని, సిగ్నల్‌ వద్ద ఎంత వేగంతో వెళ్లాలన్నది కూడా సూచించలేదని రైల్వే సేఫ్టీ కమిషనర్ తన నివేదికలో పేర్కొంది.

కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ మాత్రమే గరిష్టంగా15 కిమీ వేగంతో వెళ్తూ.. ప్రతి సిగ్నల్ వద్ద ఒక నిమిషం పాటు ఆగిందని, గూడ్స్ రైలుతో సహా అదే మార్గంలో వెళ్లిన మిగిలిన ఆరు రైళ్లు నిబంధనలు పాటించలేదని పేర్కొంది.

సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయనపుడు..

సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా పనిచేయనపుడు పాటించాల్సిన పద్ధతులను ఈ సందర్భంగా రైల్వే సేఫ్టీ కమిషనర్ వెల్లడించింది. సాధారణంగా సిగ్నల్ సరిగా పనిచేయని చోట లోకో పైలట్ రైలును ఒక నిమిషం పాటు ఆపి, తరువాత స్టాప్ సిగ్నల్ వరకు జాగ్రత్తగా నడపాలి. సిగ్నల్ పనిచేయనపుడు డ్రైవర్‌కు రైలును ఎంత వేగంతో నడపాలన్న విషయం తెలియపర్చాలి. ఈ విషయాన్ని గూడ్స్ లోకో పైలట్‌కు అంశాన్ని ప్రస్తావించలేదు. మూడోది.. ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్‌. రెండు స్టేషన్ల మధ్య ఒక రైలు మాత్రమే ప్రవేశించడానికి అనుమతిస్తారు. ఇలా ప్రతి స్టేషన్ దాటుకుంటూ వెళ్లుంది. మొదటి స్టేషన్ నుంచి మరో రైలు వెళ్లేందుకు అనుమతించరు.

8 గంటల షిఫ్ట్..

‘‘రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం.. డివిజనల్ స్థాయిలోని కంట్రోల్ ఆఫీస్‌లో ప్రతి 8 గంటల షిఫ్ట్‌లో ఒక సీనియర్ సెక్షన్ ఇంజనీర్, ఒక జూనియర్ ఇంజనీర్, ఒక హెల్పర్ విధుల్లో ఉంటారు. అయితే..జూన్ 16,17 రాత్రి కంట్రోలింగ్ ఆఫీసులో ఒక టెక్నికల్ అసిస్టెంట్ మాత్రమే డ్యూటీలో ఉన్నాడు. ఒక టెక్నీషియన్ ఇంత పెద్ద సిగ్నలింగ్ వ్యవస్థను నిర్వహించడం సాధ్యం కాదు. కతిహార్‌ డివిజన్ సిగ్నలింగ్ డిపార్టుమెంట్ ఉన్నతాధికారులకు ఈ తరహా వైఫల్యాలపై సమాచారం ఉన్నా.. వారు సిగ్నలింగ్ కంట్రోలింగ్ ఆఫీసులకు వెళ్లి ఇతర శాఖల వారితో సమాచారాన్ని పంచుకోవడం లేదు. ప్రమాదం జరిగిన ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే (ఎన్‌ఎఫ్‌ఆర్) జోన్‌లో వాకీ-టాకీల కొరత కూడా ఉంది’’ అని సీఆర్‌ఎస్ పేర్కొంది.

జనవరి 2023లో ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ తీసుకొచ్చారు. క్షేత్ర స్థాయిలో ఆటోమేటిక్ సిగ్నలింగ్‌కు వ్యవస్థ సరిగ్గా అమలయ్యేలా చూసుకోవడం అవసరం. అయితే ప్రధాన కార్యాలయ స్థాయిలో తనిఖీలు చేయడం లేదని నివేదిక సూచిస్తుంది.

Tags:    

Similar News