
నెల్లూరు తీరంలో టైగర్ ప్రాన్
నెల్లూరు తీరంలో ఆక్వా 'డాన్' హల్ చల్!
నెల్లూరు జిల్లాలో తిరిగి టైగర్ రొయ్య సాగు పుంజుకుంటోంది
నెల్లూరు రూటే సెపరేటు.. నిన్న మొన్నటి దాకా పురుష డాన్లు, స్త్రీ డాన్లు హల్ చల్ చేస్తే ఇప్పుడు డాన్ రొయ్య హవా సాగుతోంది. రొయ్యల సాగంటనే భయపడిపోయిన రైతులకు ఇప్పుడిది మళ్లీ వరంగా మారింది. నష్టాల్లో కూరుకుపోయిన రైతులకు ఇప్పుడిది ఆదాయవనరుగా మారింది. దానిపేరే మొనోడాన్ రొయ్య ఎలియాస్ వెనామీ రొయ్య.
పెరిగిన గిరాకీ...
నెల్లూరు జిల్లాలో తిరిగి టైగర్ రొయ్య సాగు పుంజుకుంటోంది. కొంతకాలంగా వెనామీ రొయ్య వల్ల నష్టాల బారినపడిన తీరప్రాంత రైతులు, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని టైగర్ రొయ్య వైపు అడుగులు వేస్తున్నారు. గతంలో నష్టాల బారిన పడిన ఈ రకం, ఇప్పుడు రైతులకు లక్షల రూపాయలు ఆర్జించిపెట్టే స్థితిలో ఉంది.
1990లలో నీలి విప్లవంతో టైగర్ రొయ్య సాగు ఉధృతి మీద ఉండగా, వైరస్లు, తెల్లమచ్చల రోగాలతో ఆక్వా రంగం సంక్షోభంలో పడిపోయింది. 2010లో వెనామీ రొయ్య పుట్టుకొచ్చింది. తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడితో తొలుత మంచి ఆదాయాన్ని ఇచ్చినా, కోవిడ్ ప్రభావం, ధరల పతనం, పెరిగిన ఖర్చులు వెనామీ సాగును కుంగదీశాయి.
ప్రస్తుతం కొందరు రైతులు మొనోడాన్ టైగర్ రొయ్య సాగు చేస్తూ నిలకడగా లాభాలు పొందుతున్నారు. ఎకరాకు సగటున 60 వేల సీడ్ (రొయ్యపిల్లలు) వేస్తే సుమారు 2 టన్నుల దిగుబడి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఈ తరహా రొయ్యలు టన్నుకి ప్రస్తుత మార్కెట్ ధర రూ. 10 లక్షల వరకు పలుకుతోంది. రూ. 4,5 లక్షలు ఖర్చులు పోయినా నికరంగా 4 లక్షలైనా మిగులు ఉంటుందని అంచనా. గతంలో ఈ రొయ్యల్ని సాగు చేసి చేతులు కాల్చుకున్న వారూ ఉన్నారు.
ఏరియాల వారీగా సాగు..
ప్రస్తుతం కావలి, ముత్తుకూరు, ఇందుకూరుపేట ప్రాంతాల్లో రైతులు టైగర్ రొయ్య సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మత్స్యశాఖ అధికారులు కూడా ఈ మార్పును గుర్తించి, సాగుదారులకు సూచనలు, సలహాలు అందిస్తున్నారు. దీంతో రైతులు కూడా తిరిగి ఆక్వారంగం వైపు మొగ్గు చూపుతున్నట్టు మత్స్యశాఖ అధికారులు చెప్పారు.
Next Story

