పార్టీలు అల్లూరి వెంటపడ్డాయెందుకు ?

తెలుగురాష్ట్రాల్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు పోటీలుపడి అల్లూరి సీతారామరాజు జయంతిని జరపటమే ఆశ్చర్యంగా ఉంది.

Update: 2024-07-05 06:48 GMT

లాభంలేనిదే వ్యాపారి వరదన పోడన్న పద్దతిలో రాజకీయ పార్టీలు ఏమిచేసినా ఏదో పరమార్ధం తప్పక ఉంటుందనటంలో సందేహంలేదు. తమకు లాభం ఉంటుందని అనుకుంటేనే ఏ పార్టీ అయినా ఏ నేతైనా కొన్ని కార్యక్రమాలు చేస్తారు లేకపోతే అటువైపు కూడా కన్నెత్తిచూడరు. అలాంటిది తెలుగురాష్ట్రాల్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు పోటీలుపడి అల్లూరి సీతారామరాజు జయంతిని జరపటమే ఆశ్చర్యంగా ఉంది.

అల్లూరి సీతారామరాజు అంటేనే స్వాతంత్ర్య సమరం నాటి ఘటనలు గుర్తుకొస్తాయి. చింతపల్లి అడవులను కేంద్రస్ధానంగా చేసుకుని బ్రిటీష్ దళాలపై అల్లూరి ఏ విధంగా విరుచుకుపడ్డారో చరిత్రలో స్పష్టంగా ఉంది. స్ధానిక గిరిజనులనే తన సైన్యంగా చేసుకుని అల్లూరి మోగించిన సమరభేరి దెబ్బకు బ్రిటీషు పాలకులు గడగడలాడిపోయారు. చరిత్రను చదివినా, డాక్యుమెంటరీలు, సినిమాలు చూసినా ఈ విషయాలు అర్ధమవుతాయి. అలాంటి అల్లూరి జయంతి, వర్ధంతులను రాజకీయపార్టీలు అందిపుచ్చుకోవటమే విచిత్రంగా ఉంది. పోటా పోటీగా గురువారం నాడు అల్లూరి 127వ జయంతిని టీడీపీ, కాంగ్రెస్ జరిపాయి. పార్టీ కార్యాలయాల్లో ఎక్కడికక్కడ పార్టీ నేతలు అల్లూరి ఫొటోలను పెట్టి నివాళులర్పించటమే కాకుండా విగ్రహాలకు పూలమాలలు వేసి అల్లూరి వీరత్వాన్ని స్మరించుకున్నారు.

127వ జయంతి సందర్భంగా పార్టీలు చేసిన హడావుడి చూసిన తర్వాత చాలామందికి ఆశ్చర్యమేసింది. ఎందుకని పార్టీలు పోటాపోటీగా అల్లూరి జయంతిని జరుపుతున్నాయని. అల్లూరి పుట్టుకపై రెండు ప్రచారాలున్నాయి. అదేమిటంటే పుట్టుకతోనే క్షత్రియ సామాజికవర్గానికి చెందిన అల్లూరి సీతారామరాజు తన మేనమామ ఉండే చింతపల్లి ప్రాంతానికి వెళ్ళి చదువుకున్నారు. ఆ ప్రాంతంలోని గిరిజనుల జీవనగతులను గమనించి, బ్రిటీషర్ల దోపిడిని ప్రత్యక్షంగా చూశారు కాబట్టే వాళ్ళ తరపున బ్రిటీషర్లతో పోరాడారన్నది ఒక ప్రచారం. ఇదే సమయంలో అల్లూరి సీతారామరాజు క్షత్రియుడు కాదు గిరిజనుడనే ప్రచారం కూడా ఉంది. ప్రచారాలు, వివాదాలు ఎలాగున్నా బ్రిటీషర్లను అల్లూరి గడగడలాడించింది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. ఈ నేపధ్యంలోనే పార్టీలు అల్లూరి జయంతిని ఎందుకు జరుపాయన్నదే అర్ధంకావటంలేదు. ఎందుకంటే ఇప్పుడేమీ ఎన్నికలు లేవు. ఈమధ్యనే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి.

స్ధానికసంస్ధల ఎన్నికలు కూడా ఇప్పట్లో లేవు. ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరపటానికి ఇంకా 18 మాసాల సమయముంది. షెడ్యూల్ ప్రకారమైతే 2026 ఫిబ్రవరి-ఏప్రిల్ మాసాల మధ్య ఎన్నికలు జరగాల్సుంది. తెలంగాణాలో స్ధానికసంస్ధల కాలపరిమితి ముగిసి సుమారు ఆరుమాసాలైపోయాయి. కొత్త ఎలక్టోరల్ జాబితాల కోసం ప్రభుత్వం ఎదురుచూస్తున్నది. కేంద్ర ఎన్నికల కమీషన్ నుండి ఆదేశాలు రాగానే రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఓటర్లజాబితాను సిద్ధంచేసిన తర్వాత స్ధానిక సంస్ధల ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అంచనా వేస్తున్నారు. అంటే ఇప్పటికిప్పుడు ఎలాంటి ఎన్నికలు జరగటంలేదని అర్ధమవుతోంది. ఒకపుడు అల్లూరి వర్ధంతి, జయంతిని రాజకీయపార్టీలు పెద్దగా పట్టించుకునేవికావు. అలాంటిది ఈమధ్య కాలంలోనే క్రమం తప్పకుండా పార్టీలు పోటీలుపడి మరీ అల్లూరి వర్ధంతి, జయంతిని జరుపుతున్నాయి.

తెలంగాణాలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అల్లూరి విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. విగ్రహం ఏర్పాటును ప్రస్తావిస్తు మంత్రి పార్లమెంటు స్పీకర్ ఓంబిర్లాకు లేఖ కూడా రాశారు. అల్లూరి జయంతి సందర్భంగా విగ్రహం దగ్గర నివాళులు అర్పించిన సీతక్క అల్లూరి సీతారామరాజు త్యాగాన్ని, వీరత్వాన్ని గుర్తుచేశారు. మొత్తంమీద అల్లూరి జయంతిని పోటీలుపడి రాజకీయపార్టీలు నిర్వహించటంలోని మర్మం ఏమిటో అర్ధంకావటంలేదు.

Tags:    

Similar News