తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఎన్ రాంచంద్రరావు

సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రాంచంద్రరావు తెలంగాణ బీజేపీ కొత్త రథసారధి కానున్నారు.;

Update: 2025-06-30 06:09 GMT
ఎన్ రాంచంద్రరావు

ఏడాది కాలంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరనే ఉత్కంఠకు సోమవారం తెరపడింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా సోమవారం మధ్యాహ్నం నామినేషన్ వేయాలని బీజేపీ అధిష్ఠానవర్గం రామచంద్రరావును ఆదేశించింది. ఈ విషయాన్ని బీజేపీ నాయకులు ప్రకటించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నామినేషన్ దాఖలు చేసే ఏకైక వ్యక్తి ఎన్.రాంచందర్ రావు పార్టీవర్గాలు వెల్లడించడంతో అతన్ని బీజేపీ నేతలు అభినందనలతో ముంచెత్తారు. నామినేషన్ అనంతరం అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉంది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పలువురు పోటీ పడినా ఎన్ రామచంద్రరావుకు ఉన్న ఆర్ఎస్ఎస్ నేపథ్యం, విద్యార్థి దశ నుంచి ఏబీవీపీలో పనిచేసిన అనుభవం వల్లనే ఆయన కాషాయ పార్టీ పగ్గాలు దక్కాయని కమలనాథులు చెబుతున్నారు.




 ఎన్.రాంచందర్ రావు ప్రస్థానం

66 ఏళ్ల నరపరాజు రాంచంద్రరావు 1959 ఏప్రిల్ 27వతేదీన జన్మించారు. ఈయన ఉస్మానియా యూనివర్శిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎల్ఎల్ బీ చేసి న్యాయవాదిగా వృత్తి చేపట్టినా పూర్తి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఈయన 2015 నుంచి 2021 వ సంవత్సరం వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గానికి తెలంగాణ శాసన మండలి (MLC) సభ్యుడిగా పనిచేశారు.అనంతరం భారతీయ జనతా పార్టీ తెలంగాణ సభ్యత్వ డ్రైవ్ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నారు.1985 వ సంవత్సరంలో న్యాయవాద వృత్తి స్వీకరించినా 2014లో బార్ కౌన్సిల్ సభ్యుడయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు.

కుటుంబం
రాంచందర్ రావు తండ్రి ప్రొఫెసర్ ఎన్ వి ఆర్ఎల్ ఎన్ రావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ డీన్‌గా పనిచేశారు. రాం చందర్ రావు కుమార్తె అముక్త నరపరాజు ఆస్ట్రేలియాలో ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు అవనీష్ నరపరాజు తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అతని భార్య సావిత్రి 2017వ సంవత్సరంలో దీర్ఘకాలిక అనారోగ్యంతో మరణించారు.



 విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి...

ఎన్ రామచంద్రరావు విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. ఎమర్జెన్సీ కాలంలో పికెట్ కేంద్రీయ విద్యాలయ పాఠశాలలో చదువుకున్నపుడు రాజకీయాల్లో క్రీయాశీలకంగా వ్యహరించారు. రైల్వే డిగ్రీ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చదువుతున్నప్పుడు ఆయన స్టూడెంట్స్ యూనియన్ (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)కి అనుబంధంగా) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రెండు పర్యాయాలు ఆయన ఉస్మానియా లా కాలేజీ స్టూడెంట్ యూనియన్ కార్యదర్శి (ABVP)గా ఎన్నికయ్యారు. ఆయన విద్యార్థి రాజకీయాల్లో 14 సార్లు జైలు శిక్ష అనుభవించారు.

పత్రికలకు లీగల్ వ్యాసాలు
రామచంద్రరావు ఆంధ్రజ్యోతికి లీగల్ కార్నర్, ఆంధ్ర లీగల్ డైజెస్ట్,ఆంధ్రప్రదేశ్ లీగల్ జర్నల్, జనసందేశ్ వంటి లా జర్నల్స్‌కు లీగల్ వ్యాసాలు రాశారు.తెలంగాణ శాసన మండలిలో ఆయన చర్చలపై పుస్తకం రాశారు. 2014లో రాం చంద్రరావు మల్కాజ్‌గిరి నుంచి శాసనసభ సభ్యుడిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు.2015లో, ఆయన తెలంగాణలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా గెలిచారు. 2021లో మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ ఎన్నికల్లో రావు సురభి వాణి దేవి చేతిలో ఓడిపోయారు.రామచంద్రరావు ఆల్కపూరిలోని శ్రీ ఆదిపరాశక్తి ప్రత్యంగిరా పరమేశ్వరి ఆలయంలో రెండు రోజుల క్రితం అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం తల్లి ఆశీస్సులు కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశానని రామచంద్రరావు ప్రకటించారు.


Tags:    

Similar News