తమిళనాడు డ్రగ్స్ కేసులో దూకుడు పెంచిన పోలీసులు
పరారీలో ఉన్న మరో నటుడు కృష్ణ గాలింపు కోసం ప్రత్యేక బృందాలు..;
డ్రగ్స్ తీసుకున్నాడన్న ఆరోపణలతో తమిళ నటుడు శ్రీరామ్ను పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ డ్రగ్స్ శ్రీరామ్కు ఎవరు సప్లై చేశారు? ఇంకా సినీ ప్రముఖలెవరైనా తెప్పించుకుంటున్నారా? అని చెన్నై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇప్పటికే అరెస్టు చేసిన నిందితుల నుంచి వివరాలు తెలుసుకున్న పోలీసులు.. మరో నటుడు కృష్ణకోసం గాలిస్తున్నారు. సినిమా షూటింగ్ కోసం కేరళ వెళ్లిన కృష్ణ.. ఇప్పటికే ఈ విషయం తెలిపి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసుల సాయం తీసుకుని కృష్ణను కనిపెడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకూ ముగ్గురి అరెస్టు..
ఈ కేసులో మొదటగా ప్రదీప్ కుమార్ ఆ తర్వాత జాన్ అనే వ్యక్తులను అరెస్టు చేశారు. విచారణలో వీరు చెప్పిన వివరాల ఆధారంగా నటుడు శ్రీరామ్ను నుంగంబాక్కం పోలీసులు అరెస్టు చేశారు. మాజీ AIADMK కార్యకర్త ప్రసాద్ ద్వారా తనకు కొకైన్ అందిందని, అతనే శ్రీరామ్, కృష్ణకు డ్రగ్స్ సరఫరా చేశాడని ప్రదీప్ కుమార్ చెబుతున్నాడు.
చిత్రపరిశ్రమలో అలజడి..
నటుడు శ్రీరామ్ అరెస్టుతో తమిళ చిత్ర పరిశ్రమలో అలజడి మొదలైంది. నిందితులు చెప్పిన దాన్ని బట్టి త్వరలో మరికొంతమంది సినీ ప్రముఖులను విచారించే అవకాశం ఉంది. ఒక ప్రముఖ నటి కూడా డ్రగ్స్ వాడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఆమె ఎవరన్నది పోలీసులు బయటకు చెప్పడం లేదు. ప్రసాద్ లాంటి వ్యక్తుల ద్వారా ఇండస్ట్రీలో ఇంకా ఎంతమంది సినీ ప్రముఖులు డ్రగ్స్ తెప్పించుకుంటున్నారు? డ్రగ్స్ నెట్వర్క్ కేవలం తమిళనాడుకే పరిమితమైందా? లేక ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆలస్యం చేస్తే అవశేషాలు కనిపించవు..
‘‘డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి రక్తంలో డ్రగ్స్ అవశేషాలు 48 గంటలలోపు అదృశ్యమవుతాయి. అయితే అవిశ్రాంతి, నిద్రలేమి లక్షణాలు కొన్ని రోజుల పాటు బయటకు కనిపిస్తాయి. మూడు, నాలుగు రోజుల పాటు డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి అజ్ఞాతంలోకి వెళితే.. శరీరంలో డ్రగ్స్ అవశేషాలు ఉన్నాయని నిరూపించడం కష్టంగా మారుతుంది.’’ అని సవీత విశ్వవిద్యాలయంలోని ఫోరెన్సిక్ మెడిసిన్ టాక్సికాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సంపత్ కుమార్ చెప్పారు.