టీవీకే పార్టీకి సుప్రీంకోర్టులో ఊరట

కరూర్ విషాదంపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం

Update: 2025-10-13 07:06 GMT

తమిళనాడులోని కరూర్ లో జరిగిన తొక్కిసలాటపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోలీవుడ్ నటుడు, విజయ్ స్థాపించిన టీవీకే రాజకీయ పార్టీ సెప్టెంబర్ 27న నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

ఈ దుర్ఘటనలో 41 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై తమిళనాడు వ్యాప్తంగా దుమారం రేగింది. ఈ రోజు విచారణ ప్రారంభం కాగానే జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్వీ అంజరియా నేతృత్వంలోని బెంచ్ తీర్పును వెలువరించింది.

కేసును పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అజయ్ రస్తోగిని నియమిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. కరూర్ విషాదంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ టీవీకే తో పాటు పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై అక్టోబర్ పదో తేదీనే తీర్పును రిజర్వ్ చేసిన న్యాయ స్థానం ఈ రోజు ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది.

గత మంగళవారం బీజేపీ నాయకుడు ఉమా ఆనందన్ మద్రాస్ హైకోర్టు సీబీఐ విచారణ అవసరం లేదని ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో కేసు దాఖలు చేశాడు. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు ఈ కేసు విచారణకు వచ్చింది. అలాగే మరో తమిళనాడు బీజేపీ నాయకుడు జీఎస్ మణి సైతం సుప్రీంకోర్టులో సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు.

రెండు ఉత్తర్వులు ఏంటీ?
కరూర్ తొక్కిసలాట విషయంలో మద్రాస్ హైకోర్టు రెండు విరుద్దమైన ఉత్తర్వులు జారీ చేయాడాన్ని సుప్రీంకోర్టు గతంలోనే ప్రశ్నించింది. ఇందులో మధురై బెంచ్ సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన అభ్యర్థనను తిరస్కరించగా, చెన్నైలోని ప్రధాన బెంచ్ మాత్రం సిట్ దర్యాప్తును ఆమోదించింది.
టీవీకే వాదనలు..
తొక్కిసలాట ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తును ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై టీవీకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమిళనాడు పోలీసులు విచారణ చేస్తే నిష్పాక్షికమైన దర్యాప్తు సాధ్యం కాదని వాదించింది. సుప్రీంకోర్టు నేతృత్వంలోనే స్వతంత్య్ర దర్యాప్తు ను కోరింది. కొంతమంది దుండగులు ముందస్తు కుట్రతోనే తొక్కిసలాట జరిగిందని తెలిపింది.
సంఘటన జరిగిన తరువాత నటుడు, రాజకీయ నాయకుడు అయిన విజయ్ కనీసం పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడనే హైకోర్టు చేసిన వ్యాఖ్యలను కూడా పిటిషన్ లో పేర్కొంది.
కరూర్ తొక్కిసలాటకు విజయ్ కారణమని తమిళనాడు పోలీసులు తెలిపారు. ప్రకటించని షెడ్యూల్ కంటే ఏడు గంటలు ఆలస్యంగా వచ్చారని, ఇక్కడికి పదివేల మందికి ఏర్పాట్లు ఉన్నాయని కానీ అనూహ్యంగా 27 వేల మంది వచ్చారని తెలిపారు.


Tags:    

Similar News