కమల్ హాసన్కు రాజ్యసభ సీటు..
డీఎంకే తరుపున రాజ్యసభకు MDMK నేత వైకోను పక్కనపెట్టి సినీనటుడు కమల్ హాసన్ను పంపడానికి కారణమేంటి?;
దక్షిణాదిన సినీనటుడు కమల్ హాసన్ గురించి తెలియని వారుండరు. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇక తమిళనాట ఆయనకున్న ఫాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే. సరిగ్గా ఇదే కారణంతో 2026 అసెంబ్లీ ఎన్నికలలో కమల్ను రంగంలోకి దించే ఆలోచనలో ఉంది డీఎంకే. ఈ మధ్యే మరో సినీనటుడు విజయ్ టీవీకే స్థాపించి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. విజయ్ను ఢీ కొట్టాలంటే సినీ రంగ ప్రముఖుడయిన కమల్ హాసనే కరెక్టని భావించిన డీఎంకే ఆయనకు పార్టీలో ప్రాధాన్యం ఇస్తుంది. రాజ్యసభకు కూడా నామినేట్ చేశారు.
తమిళనాడు అధికార పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) జూలై 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు తన అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. ఖాళీగా ఉన్న ఆరు స్థానాల్లో నాలుగు స్థానాలను DMK గెలుచుకోగా, మిగిలిన రెండింటిని ప్రతిపక్ష AIADMK గెలుచుకుంటుంది.
డీఎంకే జాబితాలో సీనియర్ న్యాయవాది పి. విల్సన్, మాజీ ఎమ్మెల్యే ఎస్.ఆర్. శివలింగం, ప్రముఖ తమిళ కవి కవింగర్ సల్మా, సినీనటుడు కమల్ హాసన్ ఉన్నారు.
హామీ నిలబెట్టుకున్న డీఎంకే..
2024 లోక్సభ ఎన్నికల్లో డీఎంకే అద్భుతమైన విజయం సాధించింది. భారత కూటమిలో భాగమైన డీఎంకే నేతృత్వంలోని కూటమి తమిళనాడులోని మొత్తం 39 స్థానాలను, పుదుచ్చేరిలోని ఏకైక స్థానాన్ని క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఎన్నికలో మక్కల్ నీది మలమ్ (MNM) పోటీచేయకపోగా డీఎంకే కూటమి తరుపున విస్తృత ప్రచారం చేసింది. అందుకు ప్రతిఫలంగా 2025లో ఎంఎన్ఎమ్కు రాజ్యసభ సీటు ఇస్తామని కమల్కు డీఎంకే హామీ ఇచ్చింది.
డీఎంకే రాజ్యసభ అభ్యర్థుల గురించి..
1) పి. విల్సన్: ఈయన సీనియర్ న్యాయవాది. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఈయనను మళ్లీ నామినేట్ చేసి పార్టీ ప్రాతినిధ్యాన్ని కొనసాగించింది డీఎంకే.
2) ఎస్.ఆర్. శివలింగం: మాజీ ఎమ్మెల్యే అయిన సేలం తూర్పు జిల్లా కార్యదర్శి కూడా. సేలం ప్రాంతంలో బలమైన వ్యక్తిగా పేరున్న మాజీ మంత్రి వీరపాండియన్ అనుచరుడు. శివలింగం ఉదయార్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కావడంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సామాజికవర్గం ఓట్లు కలిసివస్తాయని డీఎంకే భావిస్తోంది.
3) రచయిత్రి కవింగర్ సల్మా: ఈమె ప్రఖ్యాత తమిళ కవయిత్రి. మేథావులు, కళాకారుల ఓట్లను రాబట్టుకునేందుకు ఈమెను ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది.
వైకోను ఎందుకు పక్కనపెట్టారు?
మారుమలర్చి ద్రవిడ మున్నేట్ర కజగం (MDMK) నాయకుడు వైకో రాజ్యసభ పదవీకాలం జూలై 2025తో ముగుస్తుంది. ఈ సారి ఈయనను పక్కన పెట్టడం వల్ల DMK కూటమిలో మళ్లీ చర్చలకు దారితీసే అవకాశం ఉంది. వాస్తవానికి ఈయన 2019 నుంచి ఎంపీగా ఉన్నారు. కూటమికి MDMK బాగానే సహకరించినా.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పట్టణ ఓటర్లను ఆకర్షించడం కోసం MNMకు ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. మరో వైపు టీవీకే చీఫ్ విజయ్ను ఎదుర్కోడానికి కమల్ను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. విజయ్ను ఎదుర్కోవడానికి పార్టీకి స్టార్ క్యాంపెయినర్ అవసరమని భావించి డీఎంకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తిరిగి నామినేట్ కావడానికి వైగో చేసిన లాబీయింగ్ సఫలం కాలేదన్న వార్తలొస్తున్నాయి.
పొత్తుకు కట్టుబడి ఉన్నాం..
వైకోను రాజ్యసభకు తిరిగి నామినేట్ చేయకపోవడంతో MDMK డీఎంకేతో గతంలోలాగా కలిసి ఉంటారా? లేక విడిపోతుందా? అన్న సందేహం తలెత్తింది.
ఈ విషయంపై ఆ పార్టీ ప్రిన్సిపల్ సెక్రటరీ, పార్టీ వ్యవస్థాపకుడు వైకో కుమారుడు దురై వైకో స్పష్టతనిచ్చారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలోనూ అధికార డీఎంకేతో తమ పొత్తు కొనసాతుతుందని ధృవీకరించారు.
2024 పార్లమెంటు ఎన్నికల చర్చల సమయంలో వైకో కుమారుడికి లోక్సభ సీటు ఇచ్చినందునే వైకోకు ఈ సారి రాజ్యసభలో స్థానం కల్పించలేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. MDMKకి తిరుచ్చిలో ఉన్న గణనీయమైన ఓటు బ్యాంకు కారణంగా 2024 ఎన్నికలలో ఆ పార్టీకి ఒక లోక్సభ స్థానం కేటాయించారు.దురై వైకో తిరుచిరాపల్లి నుంచి పోటీ చేసి 3.11 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.