తమిళులను విభజిస్తున్నది కేంద్రమే..
ఒంటరిగా గెలవలేకే పొత్తు పెట్టుకున్నారన్న సీఎం స్టాలిన్..;
తమిళనాడు(Tamil Nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(CM Stalin) రాష్ట్రంలోని బీజేపీ-ఏఐఏడీఎంకే (BJP-AIADMK) కూటమిపై ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు కులం, మతం పేరుతో ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం ఆయన తిరుపత్తూరు జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. తమిళనాడులో మతం ప్రమాదంలో ఉందని బీజేపీ ఆరోపణలను స్టాలిన్ ఖండించారు. బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమి వల్లే ప్రమాదకర పరిస్థితి ఉందని చెప్పారు. పొత్తు గురించి మాట్లాడుతూ.. ఒంటరిగా పోటీచేస్తే ఓడిపోతామని తెలిసే AIADMKతో BJP చేతులు కలిపిందన్నారు.
'సంస్కృతంపైనే కేంద్రానికి ప్రేమ'
భారతీయ శాస్త్రీయ భాషల కంటే సంస్కృతానికే కేంద్రం అధిక ప్రాధాన్యం ఇస్తోందని స్టాలిన్ ఆరోపిస్తున్నారు. "సంస్కృతానికి కోట్లు వస్తాయి. తమిళం, ఇతర దక్షిణ భారత భాషలకు మొసలి కన్నీళ్లు తప్ప మరేమీ రావు" అని స్టాలిన్ ఇటీవల ఎక్స్లో పోస్టు చేసిన విషయం తెలిసిందే. 2014 నుంచి 2025 వరకు సంస్కృత ప్రచారం కోసం కేంద్ర ప్రభుత్వం ₹2,532.59 కోట్లు కేటాయించగా.. తమిళం, మలయాళం, ఒడియా, కన్నడ తెలుగు భాషలకు కలిపి ₹147.56 కోట్లు మాత్రమే కేటాయించడాన్ని స్టాలిన్ తప్పుబట్టారు.