కేరళ: ఉన్నికృష్ణన్ను బెంగళూరుకు తీసుకెళ్లిన సిట్..
శబరిమల ఆలయం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బి మురారి బాబును కూడా ఇటీవల అరెస్టు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం..
శబరిమల(Sabarimala) బంగారం దొంగతనం కేసు(gold theft case)ను విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) వేగం పెంచింది. కోర్టు అనుమతితో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టిని (Unnikrishnan Potty) తమ కస్టడీలోని తీసుకుని శుక్రవారం (అక్టోబర్ 24) బెంగళూరుకు తీసుకెళ్లింది. తర్వాత హైదరాబాద్కు కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది.
ఉన్నికృష్ణన్ అరెస్టు తర్వాత శబరిమల ఆలయం (Sabirimala Ayyappa Temple) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బి మురారి బాబును గురువారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్టు చేసింది. ఆలయంలో విగ్రహాలకు బంగారు తాపడం బరువు వ్యత్యాసం కేసులో ఆయనను ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (TDB) ఇప్పటికే సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి (అక్టోబర్ 22) చంగనస్సేరిలోని ఆయన నివాసం నుంచి మురారి బాబును సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని, తిరువనంతపురంలోని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో మురారి బాబును అరెస్టు చేసినట్లు బాబు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.
ఇంతకు ఏం జరిగింది?
శబరిమలలో గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించారు. వాటిని సరిచేయించి కొత్త బంగారు పూత తాపడాలను అందిస్తానని ఉన్నికృష్ణన్ అనే దాత తీసుకెళ్లారు. ఈ పనిని చెన్నైలోని ఓ సంస్థకు అప్పగించారు. 2019లో వాటిని తొలగించే సమయంలో తాపడాల బరువు 42.8 కిలోలుగా ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. అయితే, ఆ తాపడాలను తమ వద్దకు తెచ్చినప్పుడు బరువు 38.28 కిలోలు మాత్రమే ఉందని సదరు కంపెనీ పేర్కొంది. అంతేగాక ఆలయం నుంచి తాపడాలను తొలగించిన దాదాపు 40 రోజుల తర్వాత వాటిని చెన్నైలోని కంపెనీకి అందించినట్లు సమాచారం. ఈ పరిణామాలపై ఇప్పటికే హైకోర్టు పలు అనుమానాలు వ్యక్తంచేసింది. ఉన్నట్లుండి తాపడాల బరువు 4.524 కేజీలు తగ్గడాన్ని తీవ్రంగా పరిగణించింది. వీటిని తిరిగి అమర్చినప్పుడు ఎందుకు బరువును సరిచూడలేదని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై క్రిమినల్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది.