ఆప్ నేతలపై తప్పుడు కేసులు: అతిశీ

బీజేపీపై ధ్వజమెత్తిన ఢిల్లీ మాజీ సీఎం..;

Update: 2025-06-20 10:36 GMT

ఢిల్లీ(Delhi)లోని బీజేపీ(BJP) ప్రభుత్వం రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిశీ ఆరోపించారు. తమ నాయకులపై 200లకు పైగా తప్పుడు కేసులు నమోదు చేయడమే అందుకు నిదర్శనమని చెప్పారు. గత పదేళ్లలో కేంద్ర దర్యాప్తు సంస్థలయిన ఈడీ(ED), సీబీఐ(CBI), ఐటీ తమపై దాడులు చేసినా.. ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేకపోయారని ధ్వజమెత్తారు.

సిసోడియా కేసు..

ఆప్(AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ విచారణ సందర్భంగా గతంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను అతిశీ మరోసారి గుర్తు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను “పంజరంలో చిలుకలు”గా అభివర్ణించిన అత్యున్నత న్యాయస్థానం..వాటిని రాజకీయ దుర్వినియోగానికి వాడుతున్నారన్న విషయాన్ని చెప్పకనే చెప్పిందన్నారు.

ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదుల నిర్మాణానికి సంబంధించిన అవినీతి కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఏసీబీ ముందు విచారణకు హాజరైన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే కేసుకు సంబంధించి ఆప్ నాయకుడు సత్యేంద్ర జైన్ కూడా జూన్ 6న ఏసీబీ ముందు హాజరయిన విషయం తెలిసిందే.

ప్రజల దృష్టికి మళ్లించడం కోసమే..

పాలనా వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని అతిశీ ఆరోపించారు. "ఢిల్లీ అంతటా చాలా కాలంగా విద్యుత్ కోతలు ఉన్నాయి. ఇళ్లలో నీటి కొరత ఉంది. రోడ్లు జలమయమవుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి బదులు.. బీజేపీ తప్పుడు కేసులను నమోదు చేయిస్తూ ప్రజల దృష్టి మరల్చడంతో బిజీగా ఉంది" అని ఆరోపించారు.

'విద్యా మాఫియాతో కుమ్మక్కై'

వివిధ సాకులతో ప్రభుత్వ స్కూళ్లను మూసివేసి, ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలను ప్రోత్సహించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. నిరూపించలేని ఆరోపణలతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని బీజేపీ నేతులు కోరుకుంటున్నారని ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై కూడా అతిశీ విమర్శలు గుప్పించారు, మొహల్లా క్లినిక్‌లకు రంగులు వేయడం, వాటిని పేర్లు మార్చడం తప్ప ఢిల్లీ ప్రజలకు ఆమె ఇంకా ఏమి చేశారని ప్రశ్నించారు.

Tags:    

Similar News