‘ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నేతల వ్యాఖ్యలపై నిరసన చేపడతాం’

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తమ పార్టీ ఆందోళన చేపడుతుందని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తెలిపారు.

Update: 2024-09-21 12:58 GMT

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తమ పార్టీ ఆందోళన చేపడుతుందని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌పై కించపరిచే వ్యాఖ్యలు చేసిన తమ పార్టీ నేతలపై చర్యలు తీసుకోవడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని విమర్శించారు. ఖర్గే జమ్ములో విలేఖరులతో మాట్లాడుతూ..‘‘ఎమ్మెల్యేలు, ఎంపీలతో సహా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు మా నేతల నాలుకలు కోయడం గురించి మాట్లాడుతున్నారు. రాహుల్‌ నిజం మాట్లాడినందుకు ఆయనపై మాటల దాడికి దిగుతున్నారు. తమ పార్టీ నాయకులను భయపడి మోదీ వారిపై చర్య తీసుకోడానికి వెనకాడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎవరికీ భయపడదు. మనల్ని భయపెట్టిన వాళ్లు స్వాతంత్య్ర పోరాటంలో ఇంట్లో కూర్చున్నారు. గాంధీ కుటుంబానికి త్యాగాల చరిత్ర ఉంది. మరి మీ త్యాగాలేమిటో జనం ముందు పెట్టండి" అని ఖర్గే బీజేపీ నేతలను ప్రశ్నించారు.

అధికారంలోకి రాగానే లక్ష ఉద్యోగాలు..

మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రకటించినట్లుగా.. తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర పునరుద్ధరణ, మంచి ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, వెనుకబడిన తరగతులు (OBCలు), కాశ్మీరీ పండిట్‌లకు పునరావాసం కల్పిస్తామని ఖర్గే హామీ ఇచ్చారు. ‘‘జమ్మూకశ్మీర్‌లో నిరుద్యోగ యువతకు ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ చెబుతోంది. కాషాయ పార్టీ పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఏం చేయలేకపోయిందని, ఇప్పుడు తప్పుడు వాగ్దానాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఖర్గే ఆరోపించారు.

"జమ్మూ కాశ్మీర్‌లో నిరుద్యోగ రేటు 35 శాతం. గత 10 ఏళ్లలో మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్‌కు చాలా అధికారాలు ఇచ్చారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పని ఎప్పుడో పూర్తి చేసి ఉండేవారు" అని కౌంటర్ ఇచ్చారు ఖర్గే.

నేషనల్‌ కాన్ఫరెన్స్‌తో కూడిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని యువతకు హామీ ఇచ్చారు.కాంగ్రెస్ ఎప్పుడూ పేదల సంక్షేమం కోసం ఆలోచిస్తుందని, వారి అభ్యున్నతికి పాటుపడుతుందని అన్నారు.

Tags:    

Similar News