‘సిట్’ కస్టడీకి వైసిపి నేత చెవిరెడ్డి
లిక్కర్ స్కాం విచారణ వేగం పెరిగింది;
ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హాయంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరో నిందితుడు వెంకటేశ్ నాయుడులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ఈ ఉదయం తమ కస్టడీలోకి తీసుకుంది.
మూడు రోజుల పాటు వీరిని విచారించేందుకు ఏసీబీ కోర్టు నిన్న సిట్ కు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనితో సిట్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
విజయవాడ సబ్ జైలులో రిమాండ్లో ఉన్న వీరిద్దరినీ సిట్ అధికారులు ముందుగా వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారిని సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ ప్రారంభించారు. కోర్టు ఆదేశాల ప్రకారం, ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ జరపాల్సి ఉంది. ఈ మూడు రోజుల విచారణలో లిక్కర్ స్కామ్కు సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తారు.