ఏమయ్యా చంద్రబాబు.. కమ్మవాళ్లు వైసీపీలో ఉంటే నీకేమైనా అభ్యంతరమా? కమ్మవాళ్లు తెలుగుదేశం పార్టీలోనే ఉండాలా? కమ్మవాళ్లు పుట్టింది సీఎం చంద్రబాబుకు ఊడిగం చేయడానికేనా? అంటూ సీఎం చంద్రబాబును మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. బుధవారం ఆయన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన చేశారు. 2024 ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బలవన్మరణానికి పాల్పడిన వైసీపీ నాయకుడు, రెంటపాళ్ల ఉప సర్పించ్ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి పాలనను, సీఎం చంద్రబాబు పాలనను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు.
సీఎం చంద్రబాబు పాలనలో కొంత మంది పోలీసులు కులోన్మాదంతో పని చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక డిఎస్పీగా పని చేస్తున్న హనుమంతరావు అనే పోలీసు అధికారి కుల ఉన్మాది అని, కమ్మ పుట్టక ఎందుకు పుట్టావంటూ లక్ష్మీనారాయణ అనే వైసీపీ కార్యకర్తను మానసిక వేధింపులకు గురి చేశారని, దానిని భరించలేని లక్ష్మీనారాయణ పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడని, కేవలం పోలీసుల వల్లే లక్ష్మీనారాయణ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ప్రస్తుతం ఆయన చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మీనారాయణ తాను ఎందుకు ఆత్మహత్యకు పాల్పడాల్సి వస్తుందో, సీఎం చంద్రబాబు, నారా లోకేష్ పాలన ఎలా ఉందో, పోలీసుల వేధింపులు ఎలా ఉన్నాయో అనే విషయాలను చాలా స్పష్టం వీడియో రికార్డు చేశాడని జగన్ చెప్పారు. ఒక మనిషి తనకు తాను ఆత్మహత్యకు పాల్పడే విధంగా సీఎం చంద్రబాబు పాలన, లోకేష్ తీరు, పోలీసుల చర్యలు ఉన్నాయని జగన్ ధ్వజమెత్తారు.
కమ్మ వాళ్లు వైసీపీలో ఉండొద్దా? టీడీపీ కేవలం కమ్మ వాళ్లకేనా? అంటూ జగన్ సీఎం చంద్రబాబును నిలదీశారు. వైసీపీలో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందని నాయకులు, కార్యకర్తలను సీఎం చంద్రబాబు, లోకేష్లు టార్గెట్గా చేసుకొని వేధిస్తున్నారని, చంద్రబాబు, లోకేష్లను ఎవరైనా ప్రశ్నిస్తే వారిని వేటాడి, వెంటాడి తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని, ఇదెక్కడి న్యాయమని జగన్ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, లోకేష్ మీకు ఏం పాపం చేశాడని రెంటపాళ్ల ఉప సర్పించ్ నాగమల్లేశ్వరరావును పొట్టన పెట్టుకున్నారని ప్రశ్నించారు. మీకు ఊడిగం చేయడానికి సిద్ధంగా లేడని ఇప్పుడు దేవినేని అవినాష్ను వేధింపులుకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏం పాపం చేశారని వల్లభనేని వంశీని జైల్లో పెట్టారు? చంద్రబాబు, లోకేష్ శాడిజానికి అనారోగ్యంతో జైల్లో వంశీ బాధపడుతున్నారని జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కొడాలి నాని ఏం పాపం చేశాడని ఆయనపై కేసులు పెట్టారు? ఏం పాపం చేశారని ఎమ్మెల్సీ తలశిల రఘురాంపై మూడు కేసులు పెట్టారు. ఏం పాపం చేశాడని మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని వేధిస్తున్నారు? ఏం పాపం చేశారని దగ్గుబాటి సురేష్ వైజాగ్ ల్యాండ్ క్యాన్సిల్ చేశారని చంద్రబాబు, లోకేష్ల మీద జగన్ ధ్వజమెత్తారు.
నంబూరి శంకరరావును వేధిస్తున్నారు, తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను వేధిస్తున్నారు. మంగళగిరికి చెందిన రాజ్కుమార్–కృష్ణవేణిలను వేధిస్తున్నారు. రాజ్కుమార్ను రోడ్డుపై మోకాళ్ల మీద కూర్చోబెట్టారు. మహిళ అని చూడకుండా కృష్ణవేణిని వేధించారు. ఇంటూరి రవిపై 19 కేసులు పెట్టారు. బ్రహ్మనాయుడుని వేధిస్తున్నారు. పోసానిపై 9 కేసులు పెట్టి వేధించారు. వీరంతా ఏం పాపం చేశారని ఇలా చేశారని చంద్రబాబు, లోకేష్ల మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబును, లోకేష్ను వ్యతిరేకించిన కమ్మ వారిని దారుణంగా హింసిస్తున్నారంటూ జగన్ ధ్వజమెతారు. నాలుగుళ్ల తర్వాత తమ ప్రభుత్వం వస్తుందని, అప్పుడు మీకు సినిమా చూపిస్తామంటూ చంద్రబాబు, లోకేష్లకు జగన్ హెచ్చరికలు చేశారు.