లోకేష్పై మోదీకి ఎందుకు అంత ప్రేమ?
మోదీకి లోకేష్ కొత్త దత్త పుత్రుడా?;
By : Dr Fazalullah Khan
Update: 2025-06-21 12:18 GMT
సాధారణంగా ముఖ్యమంత్రులకూ, ముఖ్య నేతలకూ కూడా ప్రధాని అప్పాయింట్ మెంట్ అంత తేలిగ్గా లభించదు. రోజులు, వారాల తరబడి ఎదురు చూసినా ప్రధాని అప్పాయింట్ మెంట్ అనుమానమే. అయితే లోకేష్ విషయంలో అలా కాదు.. ప్రధానే స్వయంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు నా అప్పాయింట్ మెంట్ ఉంటుందన్నారు. కుటుంబ సమేతంగా ఢిల్లీ వచ్చి తనను కలవాలని ఆహ్వానించారు. ఈ ఆహ్వానం ఒక సారి కాదు రెండు సార్లు లోకేష్ కు దక్కింది.
యోగా డే సందర్భంగా ప్రధాని వైజాగ్లో మాట్లాడుతూ.. లోకేష్ పనితీరు, సమర్థత, వ్యవహారశైలీని ప్రశంసించారు. ఓ ఈవెంట్ను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలో వినూత్నంగా యోగా డే నిర్వహించి దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచారంటూ ప్రధాని ప్రసంగించారు.
గతంలో విశాఖకు వచ్చిన సందర్భంగా లోకేశ్ ను తన దగ్గరకు పిలుచుకున్న మోదీ… లోకేశ్ చేతులు పట్టుకుని.. ఏదో ఓ స్నేహితుడితో సరదా గడుపుతున్నట్లుగా… లోకేశ్ చేతులను మెలి తిప్పుతూ, ఆ చేతులతో విన్యాసాలను చేయిస్తూ మోదీ సాగారు. ఫ్యామిలీతో కలిసి ఢిల్లీ వచ్చి తన ఆతిథ్యం స్వీకరించాలంటూ నాడు లోకేశ్ కు మోదీ స్వాగతం పలికారు. స్వయంగా ప్రధాని తనను అంత దగ్గరగా తీసుకుని…తనతో సరదాసరదాగా గడుపుతూ ఆహ్వానిస్తే లోకేశ్ కూడా కాదనలేదు. సరే సార్ త్వరలోనే వస్తానంటూ మోదీకి చెప్పారు. కొన్ని నెలలు అలా గడిచి పోయాయి. మోదీ తన పనిలో పడిపోయారు. లోకేశ్ తన షెడ్యూల్ తో బిజీ అయిపోయారు. మోదీ ఆహ్వానానన్నే మరిచిపోయారు.
ఆ తరువాత అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం కోసం ప్రధాని అమరావతికే వచ్చారు. ఈ సందర్భంగా మోదీని వేదిక మీదకు ఆహ్వానించే క్రమంలో తన తండ్రి, సీఎం చంద్రబాబుతో కలిసి లోకేశ్ మోదీ వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా లోకేశ్ తన ఆహ్వానం మేరకు ఢిల్లీ రాలేదన్న విషయం మోదీకి గుర్తుకు వచ్చినట్టుంది. వెంటనే లోకేశ్ చేతులను ఇదివరకటి మాదిరిరే దొరకబుచ్చుకున్న మోదీ..మరోమారు లోకేశ్ తో సరదాగా గడిపారు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు… ఫ్యామిలీతో కలిసి ఢిల్లీ రావాలని, తనను కలవాలని అని మరోమారు లోకేశ్ తో మోదీ అన్నారు.
మోదీకి మళ్తీ దొరికిపోయాయనన్న భావనతో ఈ సారి తప్పకుండా వస్తానంటూ లోకేశ్ చెప్పినా…మోదీ ఆయన చేతులను అలాగే పట్టుకుని చాలా సేపు అలా సరదాగా ఉండిపోయారు. ఈ దృశ్యాలు అప్పట్లో వైరల్ అయ్యాయి. లోకేష్ కూడా మోదీ తో తన కుటుంబ సమావేశాన్ని, మోడీ చెప్పిన మంచిమాటలను తన్మయత్వంతో మీడియా పాన్చుకున్నరు. అంతేకాదు మోదీతో జరిగిన సమావేశం తన జీవిత గమనం మార్చిందని చెప్పారు.
మోదీతో లోకేశ్ భేటీ.. అసలు కారణం ఏమై ఉండచ్చు!
రాజకీయాల్లో ప్రధాని స్థాయి వ్యక్తులతో మంత్రులు భేటీ కావడం ప్రత్యేకంగా చూడాల్సి వుంటుంది. ప్రధానితో లోకేశ్ భేటీ ద్వారా ఆంధ్రప్రదేశ్ సమాజానికి, అలాగే కూటమి శ్రేణులకు సీఎం చంద్రబాబు తన కుమారుడి స్థాయి ఏంటో తెలియజేయాలని అనుకున్నారు. ప్రస్తుతం అదే జరుగుతోంది. తన కుమారుడు నారా లోకేశ్ ఇమేజ్ పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మార్క్ రాజకీయాన్ని చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీలోనూ, ప్రభుత్వంలోనూ లోకేశే అన్నీ తానే నడిపిస్తున్నారు. ప్రధానితో భేటీ ద్వారా లోకేశ్ ప్రాధాన్యత మరింత పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భావి సారథి లోకేశ్ అని ఇలా చంద్రబాబు సంకేతాలు పంపాలని అనుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. బాబు మార్క్ రాజకీయానికి ఇదే ఉదాహరణ. గతంలో దత్తపుత్రుడనే బిరుదు జగన్కు వుండేది. ఇప్పుడా ఆస్థానం లోకేష్ కు దక్కిందంటూ తెలుగు ప్రజలు మాట్లాడుకుంటున్నారు.