'తోతాపురి' మామిడి అంతరాష్ట్ర సమస్యగా ఎందుకు మారింది..?!

చిత్తూరు జిల్లాలో మామిడికి గిట్టుబాటు ధర ప్రకటించారు. పొరుగు రాష్ట్రాల దిగుబడి కొనకూడదనే ఆంక్షలు పెద్ద సమస్యగా మారింది. అది ఎలాగంటే..;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-06-12 06:59 GMT
తోతాపురి మామిడి తోట

చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడికాయల కొనుగోలు అంతరాష్ట్ర సమస్యగా మారింది. ఈ పరిస్థితుల్లో కిలో రూ. 12కు కొనుగోలు చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మద్దతు ధర ప్రకటించారు. ఇందులో నాలుగు రూపాయలు ప్రభుత్వం, మామిడి కాయలు కొనుగోలు చేసే గుజ్జు పరిశ్రమలు రూ. 8 చెల్లించే విధంగా నిర్ణయించారు. బహిరంగ మార్కెట్ లొ కిలో రూ. నాలుగు నుంచి ఐదుగా ఉంటే, ఎనిమిది ఎలా చెల్లించగలమని ఫ్యాక్టరీల యజమానులు మొండికేస్తున్నారు.


చిత్తూరు జిల్లాలో ఈ సీజన్ లో ప్రారంభించిన 16 మామిడి గుజ్జు పరిశ్రమల వద్ద షిఫ్టుల పద్ధతిలో అధికారులను నియమించారు. పొరుగునే ఉన్న తమిళనాడు, కర్ణాటక ప్రాంత రైతుల నుంచి మామిడికాయలు కొనుగోలు చేయకూడదనే ఆంక్షలు కూడా తెరపైకి తీసుకుని వచ్చారు. దీని పర్యవసానం ఎలా ఉండబోతోంది.
"శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు మామిడి తోటలు విస్తారంగా ఉన్నాయి. చిత్తూరులో మాత్రమే ఈ తరహా ఆంక్షలు, యుద్ధ వాతావరణం ఎందుకు ఏర్పడింది" అనేది ఈ ప్రాంతంలో వినిపిస్తున్న ప్రశ్న.
ఉమ్మడి కృష్ణా జిల్లాకు ఏమాత్రం తీసిపోని విధంగా చిత్తూరు జిల్లాలో కూడా ఏటా సీజన్ లో ఎనిమిది లక్షల టన్నులు మామిడి కాయల దిగుబడి వస్తున్నట్లు అధికారి లెక్కలు చెబుతున్నాయి. ఈ రెండు జిల్లాల్లో ఐదు నుంచి ఆరు లక్షల టన్నులు అని చెబుతున్నవి పాత లెక్కలు. తోటల సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ ఏడాది తోటల్లో కాయల తక్కువగా కనిపిస్తున్నా, పరిమాణంలో రకాల మామిడికాయ కనీసంగా 400 గ్రాములకు పైగానే ఉన్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
మామిడి తోటల పరిస్థితి
2019- 20: 7.52 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. కాలక్రమంలో తోటల విస్తీర్ణం తగ్గుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
2020- 21: 6.౮౫
2021 -22 : 6.75
2022 -23: 6.55
2023 -24 :5.86
చిత్తూరు జిల్లాలో 88 వేల మంది రైతులు 87,500 ఎకరాల్లో అంటే దాదాపు 1.10 లక్షల హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి. కడప జిల్లాలో 75 వేల ఎకరాల్లో మామిడి తోటల సాగు ఉన్నట్లు ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదనరెడ్డి చెప్పారు. కృష్ణా జిల్లాలో కూడా 75 వేల హెక్టార్లలో తోటలు సాగులో ఉన్నాయి.
ఎన్టీఆర్ జిల్లాలో 30 వేల హెక్టార్లలో మామిడితోటలు సాగులో ఉన్నట్లు ఆ జిల్లా ఉద్యానవన శాఖాధికారి పీ. బాలాజీ తెలిపారు.
"మా ప్రాంతంలో బంగినపల్లె రకం తోటలు 75 శాతం ఉంటే, 15 శాతం తోతాపురి (కలెక్టర్ కాయ), 10 శాతం వివిధ రకాల మామిడి తోటలు ఉన్నాయి. నూజివీడు వద్ద నాలుగు గుజ్జు పరిశ్రమలు ఉన్నా, రసాలు, రకాల గుజ్జకు ఇవ్వరు. కలెక్టర్ కాయ మాత్రమే వెళుతుంది. దీంతో పరిశ్రమలు కూడా తెరుచుకోలేదు" అని బాలాజీ వివరించారు. ఇక్కడ పరిస్థితి ఇంత ప్రశాంతంగా సాగుతుంటే..
చిత్తూరు సమస్య ఏమిటి?
జిల్లాలో సాగులోని 1.10 లక్షల హెక్టార్ల నుంచి సుమారు ఎనిమిది లక్షల టన్నుల మామిడి కాయల దిగుబడి వస్తోంది. వాటిలో జిల్లాలోని చిత్తూరు, పలమనేరు, పాకాల సమీపంలోని దామనచర్ల ప్రయివేటు మార్కెట్ నుంచే కాకుండా, తిరుపతి మార్కెట్ యార్డు నుంచి కూడా దేశంలోని ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల నుంచి కూడా వ్యాపారులు ఈ ప్రాంతానికి వచ్చి మార్కెట్ యార్డులు లేదా నేరుగా తోటల వద్దకు వెళ్లి మామిడి కాయలు కొనుగోలు చేస్తుంటారు. ఇది ఏటా సరికే వ్యవహారమే. దిగుబడి తక్కువగా ఉండడం, మార్కెట్ లో ధరలు తక్కువ అయితే మామిడి రైతులకు నష్టాలు తప్పవు. ఈ లోటు పూడ్చుకోవడానికి జిల్లాలోని మామిడి గుజ్జు పరిశ్రమలకు విక్రయించడమే మార్గం. దీని వల్ల రైతులకు కాస్త ఉపశమనం లభిస్తుంది. అయితే, ఇదే అదునుగా రంగప్రవేశం చేసే కొందరు రైతు సంఘాల నేతలు అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇక్కడే సమస్య ఏర్పడింది.
దీనివల్ల ఏమి జరిగింది?
చిత్తూరు గంటల వ్యవధిలో చేరుకునేంత దగ్గరలో తమిళనాడు, కర్ణాటక సమీప ప్రాంతాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే తోతాపురి రకం జిల్లాలోకి రాకుండా నిఘా పెంచాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు.
"గుడిపాల మండలం తమిళనాడుకు సరిహద్దుగా ఉండడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే తోతాపురి మామిడి రకాన్ని జిల్లాలోకి రానికుండా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోండి" అని ఆదేశించారు.
"తోతాపురి మామిడి ధర నిలకడగా ఉంటుంది. రైతులు ఆందోళన చెందకుండా పక్వానికి వచ్చిన కాయల్ని మాత్రమే కోసి ప్రాసెసింగ్ కంపెనీలకు తరలించాలి" అని రైతులకు కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు.
రైతులు ప్రాసెసింగ్ కంపెనీలకు మామిడిని తరలించే సందర్భంలో వారి పేరు నమోదు చేసుకోవాలని, ప్రభుత్వం అందించే రాయితీ కోసం రైతులు ప్రాసెసింగ్ కంపెనీల వద్ద ఉన్న ఆర్ఎస్కె ఇన్చార్జిల దగ్గర పేరు నమోదు కావాలన్నారు. దీంతో పాటు రైతుల ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్ బుక్ జిరాక్స్ ఈక్రాప్ బుకింగ్ అక్నాలెడ్జ్మెంట్ తప్పనిసరిగా తీసుకురావాలన్నారు.
వైషమ్యాలు పెంచదా..?
మామిడి కాయల సీజన్ ఏడాదికి ఒకసారి మాత్రమే మూడు నెలల పాటు ఉంటుంది. స్థానిక రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేసే పరిశ్రమలు ఇతర ప్రాంతాల వారిని కూడా సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. చిత్తూరు జిల్లా యంత్రాంగం తీసుకున్న నిర్ణయం వల్ల మూడు రాష్ట్రాల మధ్య వైషమ్యాలకు బీజం పడే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది
"ఆసియాలో తమిళనాడులోని కోయంబేడు మార్కెట్, టమాటా వ్యాపారానికి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, ఆ తరువాత కర్ణాటకలోని కోలార్ టమాట మార్కెట్ రెండో స్థానంలో ఉంది. ఈ మూడు మార్కెట్లు రాష్ట్రంలో ప్రధానంగా రాయలసీమ రైతులకు విడదీయని అనుబంధం ఉందనే విషయాన్ని గమనించాలి" అని మార్కెట్ వ్యాపారులు కూడా గుర్తు చేశారు. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చే దిగుబడిలో 90 శాతం తీసుకోవడం లేదని గుజ్జు పరిశ్రమల యజమానులు చెబుతున్నారు.
కర్ణాటక రాష్ట్రం కోలార్ లోని మూడు పరిశ్రమలు, తుముకూరు వద్ద మరో గుజ్జు పరిశ్రమ తెరవని కారణంగానే ఆ ప్రాంత రైతులు చిత్తూరు పక్కకు చూస్తున్నారని చెప్పారు. ధర లేకుండానే కర్ణాటకలో పరిశ్రమలకు కాయలు అప్పగిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఆ పరిస్థితి లేదని కూడా అంటున్నారు.
పరిశ్రమల పరిస్థితి ఏమిటి?
జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమలు 47 ఉన్నాయి. వాటిలో 15, నుంచి 16 పరిశ్రమలే ఈ సీజన్ లో తెరిచారు. మరో ఏడు యూనిట్లు పూర్తిగా మూసి వేశారు.
"ఏటా పరిశ్రమ తిరిగి ప్రారంభించాలంటే రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
బ్యాంకులో రుణాలు తీసుకుంటే, మినహా పెట్టుబడి సాధ్యం కాదు. యూరోపియన్ దేశాల్లో యుద్ధం వల్ల 2023, 2024 సీజన్ లో ఉత్పత్తి చేసిన మామిడి గుజ్జు గోదాముల నుంచి దాటని పరిస్థితి ఏర్పడింది. రుణాలు చెల్లించమని బ్యాంకుల నుంచి ఒత్తిళ్లు ఉన్నాయి" అని పరిశ్రమల యజమానులు వివరించారు.
మద్దతు ధర రూ. 12
చిత్తూరు జిల్లా తవణంపల్లె  మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద రైతులు, యజమానులతో మాట్లాడుతున్న కలెక్టర్ సుమిత్ కుమార్
రైతులకు మేలు చేయడానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కిలో మామిడికి రూ. 12 మద్దతు ధర ప్రకటించారు. ఈ మామిడి సీజన్ లో రానున్న 15 రోజులు కీలకం అని కూడా అధికారులను హెచ్చరించారు. పొరుగు రాష్ట్రాల నుంచి మామిడి కాయలు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు గుజ్జు పరిశ్రమల వద్ద కాయల కొనుగోలుకు అధికారులకు కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు.
1. తోతాపురి మామిడి మద్దతు ధర బోర్డు ప్రదర్శించాలి. ( ప్రాసెసింగ్ కంపెనీలు 8 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.4 ఇస్తుంది)
2. ప్రాసెసింగ్ కంపెనీల వద్ద మామిడి సరఫరా చేసే విషయంలో ఇతర రాష్ట్రాల నుంచి తోతాపురి మామిడి రకాన్ని పూర్తిగా రాకుండా చర్యలు చేపట్టాలి.
3. ప్రాసెసింగ్ కంపెనీలు, ఎఫ్ బి ఓ లు, ర్యాంపులు, ట్రేడర్ల వద్ద తోతాపురి మామిడి అమ్మిన వారికి మద్దతు ధర అందేలా చర్యలు చేపట్టాలి.
4. షిఫ్ట్ లు వారీగా ప్రతి ప్రాసెసింగ్ కంపెనీ వద్ద ఇద్దరి ఇన్చార్జుల నియామకం. ఒకరు కచ్చితంగా ఆర్ ఎస్ కే ఇంచార్జ్ ఉండాలి.
5. ప్రాసెసింగ్ కంపెనీ వద్ద తోతాపూరి రకమా? కాదా? పరిశీలించాలి.
6. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విధుల్లో ఉండాలవి.
7. ప్రాసెసింగ్ కంపెనీ వద్ద రైతు గ్రామం, మండలం, వాహనం నెంబరు, క్వాంటిటీ, ఆధార్ నెంబర్, బ్యాంకు ఖాతా వివరాలు, ఫోన్ నంబర్లను ప్రొఫార్మాలో పూరించాలని, ఇదే వివరాలు ప్రాసెసింగ్ కంపెనీ కూడా నమోదు చేయాలి.
8. మధ్యాహ్నం తరువాత మరో ఇద్దరు షిఫ్టు డ్యూటీకి రావాలి. ఉదయం నుంచి ఎలా పనిచేశారో అవే విధులు నిర్వహించాలి.
పాత గుజ్జు పదిలం

చిత్తూరు జిల్లాలో 2023 నుంచి ఉత్పత్తి చేసిన మామిడి గుజ్జు నిలువలు ఇంకా అలాగే ఉన్నాయి. ఈ నిలువలు ఎగుమతి జరిగి ఉంటే, జిల్లాలోని రైతులకు మరింత మేలు జరగడానికి ఆస్కారం ఉండేది. ఈ విషయంపై పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం. మురళీమోహన్ విఫలయత్నం చేశారు.
సీజన్ ప్రాంరంభానికి ముందే నిలువ ఉన్న మామిడి గుజ్జ విక్రయాలు పూర్తయితే, రైతుల నుంచి ఆశించిన మేరకు మధ్దతు ధరకు మామిడి కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంటుందని ఆయన భావించారు.
"నిలువ ఉన్న 200 వేల టన్నుల్లో కొంత కొనుగోలు చేసి, యాత్రికులకు వితరణ చేయండి" అని ఎమ్మెల్యే మురళీమోహన్ సూచిస్తూ, టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడుకు సుమారు ఐదు నెలల కిందటే ఓ వినతిపత్రం సమర్పించారు. అయినా ప్రయోజనం లేదు. యూరోపియన్ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో ఎగుమతి, కొనుగోళ్లకు ఆటంకం ఏర్పడింది.
"గత రెండేళ్లతో పోలిస్తే, ప్రస్తుతం మా వద్ద 1.75 లక్షల టన్నుల గుజ్జు మిగిలి ఉంది. 50 వేల టన్నులకు ఆరు నెలల కాలపరిమితితో అగ్రిమెంట్ జరిగింది. అది పూర్తిగా తరలిస్తే, కానీ యజమానులకు ఉపశమనం లభించదు" అని గుజ్జు పరిశ్రమ యజమానులు గుర్తు చేస్తున్నారు.
సీజన్ ప్రారంభంలోనే తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తో కలిసి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ ఎం. మురళీమోహన్, మామిడి గుజ్జ పరిశ్రమల ప్రతినిధులు, రైతు సంఘాల నేతలతో సమీక్ష నిర్వహించారు. మామిడికి గిట్టుబాటు ధరపై సుదీర్ఘంగా చర్చించారు. కిలో మామిడికి రూ.12 గిట్టుధరను ప్రతిపాదించారు. దీనిపై అనేక ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి.
ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ధర నిర్ణయించారు. అయితే, కిలో రూ.6 చెల్లించడానికి పల్ఫ్ ఫ్యాక్టరీ యజమానులు సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో పొరుగు రాష్ట్రాల దిగుబడి కొనుగోలు చేయకూదదనే ఆంక్షలు ఏ పరిణామాలకు దారితీస్తాయనేది వేచి చూడాలి.

Similar News