వైసీపీకి, వైఎస్‌ఆర్‌ విగ్రహాలకు ఏంటి సంబంధం

నందిగామలో తిరిగి వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయకుంటే ఉద్యమిస్తామని వైఎస్‌ షర్మిల కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.;

Update: 2025-08-08 12:56 GMT

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని కూల్చడంపై ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి వైసీపీపై కోపాన్ని వైఎస్‌ఆర్‌ విగ్రహాల మీద చూపిస్తారా ? అసలు వైసీపీకి వైఎస్‌ఆర్‌కి ఏం సంబంధం ? మహానేత పేరు పెట్టినంత మాత్రాన వైఎస్‌ఆర్‌ ఏమైనా వారి సొత్తా.. లేక పేటెంట్‌ రైటా? వైఎస్‌ఆర్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి. చివరి క్షణం దాకా తన జీవితాన్ని ప్రజల కోసమే త్యాగం చేసిన ప్రజా నాయకుడు. తెలుగు ప్రజల గుండెల్లో ఆయనది చెరగని ముద్ర. సంక్షేమ పథకాల అమలులో ఈ దేశానికి దిశా – నిర్దేశం వైఎస్‌ఆర్‌. ప్రజా క్షేమమే పరమావధిగా చివరి దాకా పరితపించిన గొప్ప వ్యక్తి. ఇంతటి ప్రజాభిమానం కలిగిన నాయకుడికి నీచ రాజకీయాలు చేసే వారితో కలిపి ఆపాదిస్తారా ? ఆయన విగ్రహాల మీద కక్ష రాజకీయాలు చేస్తారా ? ఇదెక్కడి దిక్కుమాలిన చర్య ?

నందిగామ గాంధీ సెంటర్‌ లో మహానేత వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గం. ఈ చర్యను ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కూటమి ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం. ఉమ్మడి రాష్ట్రంలో మహానేత మరణం తర్వాత గాంధీ సెంటర్‌ వద్ద నాటి ప్రభుత్వం అక్కడ వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. వైఎస్‌ఆర్‌ విగ్రహం చుట్టూ వైసీపీ అక్రమంగా వేసుకున్న సెట్టింగులు తొలగించుకోండి. మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇదే సాకుగా చూపి వైఎస్‌ఆర్‌ విగ్రహాల మీద చేయి వేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం. వైసీపీకి, వైఎస్‌ఆర్‌ విగ్రహాలకు సంబంధం లేదు. తొలగించిన చోట వెంటనే వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయండి. లేకుంటే ఉద్యమం తప్పదని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. అంటూ సోషల్‌ మీడియా వేదికగా వైఎస్‌ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Tags:    

Similar News