అమరావతిలో మరో నిర్మాణం
అమరావతిలో L&T స్కిల్ ట్రైనింగ్ కేంద్రం నిర్మాణానికి ఆ సంస్థ ముందడుగు వేసింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి మరో మైలురాయి పడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లార్సెన్ & టొబ్రో (L&T) నెక్కల్లు సమీపంలో కన్స్ట్రక్షన్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (CSTІ) నిర్మాణానికి భూమి పూజలు నిర్వహించింది. కాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ (CRDA) కేటాయించిన 4 ఎకరాల భూమిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. L&T విజయవాడ క్లస్టర్ ప్రాజెక్ట్ మేనేజర్ వడ్డే వెంకటరెడ్డి, క్లస్టర్ హెడ్ (అకౌంట్స్ & అడ్మినిస్ట్రేషన్) గాదె రామకృష్ణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ L. ప్రభాకరన్లు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కేంద్రం ద్వారా రాష్ట్ర యువతకు అత్యాధునిక నైపుణ్య శిక్షణ అందుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
L&Tకు నిర్మాణ రంగంలో 80 సంవత్సరాల అనుభవం ఉంది. 1995లో చెన్నైలో మొదటి CSTІని ప్రారంభించిన ఈ సంస్థ, ఇప్పటికే దేశవ్యాప్తంగా 10కి పైగా కేంద్రాలు నడుపుతోంది. హైదరాబాద్, బెంగళూరు, కంచీపురం, అహ్మెదాబాద్, ఢిల్లీ, రాయ్గఢ్, పిఖువా, కోల్కతా, కటక్లలో ఇప్పటికే ఈ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఈ కేంద్రాల ద్వారా 3 లక్షల మందికి పైగా యువతకు శిక్షణ అందించి. 90% ప్లేస్మెంట్ రేట్తో ఉద్యోగాలు కల్పించారు. అమరావతి CSTІ కూడా ఇలాంటి మోడల్ను అనుసరిస్తుందని L&T అధికారులు చెబుతున్నారు.
రూ. 369 కోట్ల వ్యయంతో అత్యున్నత సాంకేటిక ప్రమాణాలతో ఈ కేంద్ర నిర్మాణం చేపట్టనున్నారు. VR/AR సిమ్యులేటర్లు, ఆధునిక ల్యాబ్లు, BIM (బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్) టూల్స్తో ట్రైనింగ్ సెంటర్లను అందుబాటులోకి తేనున్నారు. 18-35 సంవత్సరాల మధ్య యువత 3-6 నెలల కోర్సులు అందిస్తారు. ఫార్మ్వర్క్ కార్పెంట్రీ, బార్ బెండింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, మెషనరీ, సైట్ సూపర్వైజర్ వంటి కోర్సులు ఉంటాయి. శిక్షణ ఉచితంగా, స్టైపెండ్, లాడ్జింగ్, మెస్ సౌకర్యాలతో పాటు శిక్షణ అందించాలని భావిస్తున్నారు. 2026 ఫిబ్రవరి నుంచి శిక్షణ ప్రారంభం కానుందని ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రభాకరన్ తెలిపారు.
ఈ CSTІ ద్వారా అమరావతి రాజధాని పారిశ్రామిక అభివృద్ధికి గణనీయమైన ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం 1,000 మందికి పైగా యువతకు శిక్షణ అందించి, L&Tతో పాటు ఇతర కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించాలని ఆలోచనలు చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా, మధ్యప్రదేశ్, బిహార్, ఒడిషా వంటి రాష్ట్రాల యువతకు కూడా గ్లోబల్ జాబ్ అవకాశాలు అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'స్వర్ణాంధ్ర 2047' విజన్కు అనుగుణంగా, రానున్న 15 ఏళ్లలో 1 కోటి మంది యువతకు స్కిల్ ట్రైనింగ్ అందించి, రాష్ట్రాన్ని గ్లోబల్ వర్క్ఫోర్స్ హబ్గా మార్చాలనే లక్ష్యంతో L&T ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోంది. అమరావతి మాస్టర్ ప్లాన్లో భాగంగా రాజధానిలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వరా శిక్షణ పొందిన వారిని అమరావతిలో జరుగుతున్న నిర్మాణాల పనుల నిమిత్తం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.