సీఎం హెలిక్యాప్టర్‌కి ఏమైంది..ఎందుకు ఆందోళనలు

సమగ్రమైన నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్‌ చీఫ్‌కు డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా ఆదేశాలు జారీ చేశారు.;

Update: 2025-06-16 12:37 GMT

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెగ్యులర్‌గా ఉపయోగించే హెలికాప్టర్‌ తాజాగా హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ హెలికాప్టర్‌ తరచుగా టెక్నికల్‌ సమస్యలు తలెత్తుతుండటమే దీనికి కారణంగా మారింది. సాక్షాత్తు సీఎం ఉపయోగించే హెలికాప్టర్‌లో తరచుగా సమస్యలు తలెత్తుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎందుకు ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో అనే దానిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ను ఆదేశించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల జిల్లాల పర్యటనలు ఎక్కువయ్యాయి. అలా జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడల్లా జీఎంఆర్‌ సంస్థకు చెందిన హెలికాప్టర్‌ను సీఎం చంద్రబాబు ఉపయోగిస్తుంటారు, రెగ్యులర్‌గా దీనిలోనే ప్రయాణిస్తుంటారు. రాష్ట్రం నలుమూలలకు వెళ్లి వస్తుంటారు. అయితే ఇటీవల గత కొంత కాలంగా ఈ హెలికాప్టర్‌లో టెక్నికల్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ టూర్‌లో ఉన్న కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ కార్యక్రమాలకు కూడా ఇదే హెలికాప్టర్‌ను ఉపయోగించాలని నిర్ణయించారు.

అమరావతి నుంచి తిరుపతికి దీనిలోనే వెళ్లారు. అక్కడ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత అక్కడ నుంచి నెల్లూరు కృష్ణపట్నం పోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. ఆ మేరకు షెడ్యూల్‌ కూడా ఖరారు చేశారు. అయితే అసలు సమస్య ఇక్కడే బయట పడింది. కృష్ణపట్నం వెళ్లేందుకు పీయూష్‌ గోయల్‌ ఈ హెలికాప్టర్‌ను ఎక్కారు. స్పాట్‌లో టెక్నికల్‌ సమస్యలు ఉత్పన్నం కావడంతో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ఏకంగా తన కృష్ణపట్నం టూర్‌ను రద్దు చేసుకోవలసి వచ్చింది.
ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మరో వైపు ఇటీవల విమానం, హెలికాప్టర్‌ల ప్రమాదాలు చోటు చేసుకోవడంతో అధికారులు ఆందోళనలకు గురయ్యారు.  ఎందుకు ఈ హెలికాప్టర్‌లో తరుచుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయనే దానిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ హెలికాప్టర్‌ను ఉపయోగించవచ్చా? లేక పక్కన పెట్టాలా? అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. అన్ని అంశాల మీద స్టడీ చేసి సమగ్రమైన నివేదికను అందజేయాలని ఇంటెలిజెన్స్‌ చీఫ్‌కు ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.
Tags:    

Similar News