ఏపీలో విమానాశ్రయాల గురించి ఎంత మందికి ఏమి తెలుసు?
ఆంధ్రప్రదేశ్లో విమానాశ్రయాల అభివృద్ధి, కొత్త విమాన ప్రాజెక్టుల సంగతి ఏమిటి?;
కొత్తగా నిర్మించబోయే విమానాశ్రయ ప్రాజెక్టులు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తారు. వారి నేతృత్వంలోనే పనులు మొదలు పెట్టేందుకు నిర్ణయించారు. కొన్ని పనులు జరుగుతుండగా, కొన్ని పనులు మొదలయ్యే దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల గురించి తెలుసుకుందాం.
కన్సల్ టెంట్లు ఎందుకోసం?
కన్సల్టెంట్లు టెక్నో-ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీ (TEFS), డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR), పర్యావరణ ప్రభావ అధ్యయనాలు (EIA) రన్వే డిజైన్, టెర్మినల్ ప్లానింగ్ వంటి సాంకేతిక అంశాలపై నిపుణత్వం అందిస్తారు.
విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అనుమతులు, పర్యావరణ క్లియరెన్స్లను పొందడంలో కన్సల్టెంట్లు సహాయపడతారు.
మాస్టర్ ప్లాన్, ల్యాండ్ యూజ్ ప్లానింగ్, కెపాసిటీ అసెస్మెంట్ వంటి అంశాలలో సమర్థవంతమైన సలహాలు అందిస్తారు.
డెవలపర్లు అంటే ఎవరు?
డెవలపర్లు విమానాశ్రయ నిర్మాణం, ఆపరేషన్ నిర్వహణ బాధ్యతలను తీసుకుంటారు. ఉదాహరణకు భోగాపురం విమానాశ్రయాన్ని GMR గ్రూప్ అభివృద్ధి చేస్తోంది
ఆంధ్రప్రదేశ్లో చాలా విమానాశ్రయాలు PPP మోడల్లో అభివృద్ధి చేయబడుతున్నాయి. ఇందులో డెవలపర్లు ఆర్థిక పెట్టుబడులు, నిర్మాణం నిర్వహణలో పాల్గొంటారు.
ప్రభుత్వ ఆర్థిక భారాన్ని తగ్గించడానికి డెవలపర్లు డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (DBFOT) ఫ్రేమ్వర్క్లో పనిచేస్తారు.
టెక్నికల్ ఎవాల్యుషన్ కమిటీ పునర్నియామకం ఎందుకు?
12 మంది సభ్యులతో కూడిన టెక్నికల్ ఎవాల్యుషన్ కమిటీ బిడ్లను సాంకేతికంగా, ఆర్థికంగా చట్టపరంగా పరిశీలించి, అత్యంత సమర్థవంతమైన కన్సల్టెంట్లు, డెవలపర్లను ఎంపిక చేయడానికి ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సాంకేతిక నైపుణ్యం, అనుభవం, ఆర్థిక సామర్థ్యం, ప్రాజెక్ట్ డెలివరీ సామర్థ్యాలను అంచనా వేస్తుంది.
ఆంధ్రప్రదేశ్లో కొత్త విమానాశ్రయ ప్రాజెక్టుల సంఖ్య పెరగడంతో, బిడ్లను సమర్థవంతంగా పరిశీలించడానికి కమిటీని పునర్వ్యవస్థీకరించి, నిపుణులను నియమించడం అవసరమైందని ప్రభుత్వం చెబుతోంది.
కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లు, బిడ్లు వేగంగా పరిశీలించడానికి, కమిటీని మళ్లీ ఏర్పాటు చేసి, ప్రక్రియను వేగవంతం చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
భోగాపురం ఎయిర్ పోర్టు గ్రాఫిక్ చిత్రం
ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్న విమానాశ్రయ ప్రాజెక్టుల ఏమిటి?
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 7 కొత్త విమానాశ్రయాలతో పాటు, ఇప్పటికే ఉన్న 7 విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APADCL) ఆధ్వర్యంలో చేపట్టారు.
కొత్త విమానాశ్రయాలు (గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టులు)
1. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (విజయనగరం జిల్లా)
ఈ విమానాశ్రయం విశాఖపట్నం నుంచి 45 కి.మీ. దూరంలో ఉంది. దీనిని GMR విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తోంది. 2023 మేలో నిర్మాణం ప్రారంభమైంది. 2025 డిసెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.
మొదటి దశలో ఏటా 6 మిలియన్ ప్రయాణికులను నిర్వహించగలదు. తర్వాత 12 మిలియన్, 18 మిలియన్లకు విస్తరణ చేస్తుంది.
ఫీచర్లు: 3,800 మీటర్ల రన్వే, MRO సౌకర్యం, ఏవియేషన్ అకాడమీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్.
2. కుప్పం విమానాశ్రయం (చిత్తూరు జిల్లా)
1,502 ఎకరాలలో నిర్మాణం జరుగుతుంది. దేశీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేస్తున్నారు. రూ.100 కోట్ల పెట్టుబడితో నిర్మాణం జరుగుతోంది.
ప్రయోజనం: శ్రీ సిటీ SEZ, చిత్తూరు జిల్లా పరిశ్రమలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.
3. ఓర్వకల్ విమానాశ్రయం (కర్నూలు జిల్లా)
దేశీయ విమానాశ్రయంగా పనిచేస్తుంది. ఫ్లైయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (FTO) అభివృద్ధి కోసం పనులు జరుగుతున్నాయి.
సామర్థ్యం: ప్రస్తుతం రన్వే ఎండ్ సేఫ్టీ ఏరియా, టాక్సీవే నిర్మాణం జరుగుతోంది.
4. దగడర్తి విమానాశ్రయం (నెల్లూరు జిల్లా)
1,352 ఎకరాలలో నిర్మాణం జరుగుతోంది. రూ.368 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి. 1,800 మీటర్ల రన్వే ఉంటుంది. 2022 ఆగస్టులో పనులు ప్రారంభమయ్యాయి.
ప్రయోజనం: విజయవాడ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కు సేవలందిస్తుంది.
5. అమరావతి విమానాశ్రయం
రాజధాని ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేయనున్నారు. TEFR కోసం, కన్సల్టెంట్ ఎంపిక కోసం టెండర్లు ఆహ్వానించారు. సుమారు 5వేల ఎకరాల్లో ఈ విమానాశ్రయం నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రయోజనం: IT పరిశ్రమలకు ఆకర్షణీయంగా ఉంటుంది.
6. శ్రీకాకుళం విమానాశ్రయం
1,384 ఎకరాలలో నిర్మాణం జరుగ నుంది. ప్రీ-ఫీజిబిలిటీ స్టడీ కోసం టెండర్లు పిలిచారు.
ప్రయోజనం: ఉత్తర ఆంధ్ర ప్రాంతంలో కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.
7. తాడేపల్లిగూడెం విమానాశ్రయం (వెస్ట్ గోదావరి జిల్లా)
1,123 ఎకరాలలో నిర్మాణం జరగనుంది. ఫీజిబిలిటీ స్టడీ జరుగుతోంది.
ఇతర ప్రాజెక్టులు
ఒంగోలు విమానాశ్రయం (ప్రకాశం జిల్లా): 658 ఎకరాలలో నిర్మాణం, ప్రీ-ఫీజిబిలిటీ స్టడీ జరుగుతోంది.
తుని-అన్నవరం విమానాశ్రయం (కాకినాడ జిల్లా): 788 ఎకరాలలో నిర్మాణం, ప్రాంతీయ పరిశ్రమలకు సేవలందిస్తుంది.
నాగార్జున సాగర్ విమానాశ్రయం (పల్నాడు జిల్లా): 1,671 ఎకరాలలో నిర్మాణం జరగనుంది. అటవీ క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తోంది.
ఇప్పటికే ఉన్న విమానాశ్రయాలు
1. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం
2. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం
3. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం
4. రాజమండ్రి విమానాశ్రయం
5. కడప విమానాశ్రయం
6. కర్నూలు విమానాశ్రయం
7. పుట్టపర్తి విమానాశ్రయం
మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఏమి చెబుతున్నారంటే...
రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రోడ్లు, రైళ్లు, ఎయిర్ పోర్టులు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్ అనుసంధానంతో పాటు వాటి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు కలిపి మొత్తంగా 20 కి తగ్గకుండా... అదే సమయంలో ఖచ్చితంగా 14 ఎయిర్ పోర్టులు ఉండే విధంగా భవిష్యత్తు కార్యాచరణతో ముందుకు సాగాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికతో అడుగులు వేస్తున్నామన్నారు.
ఏడాదిగా ప్రతిదీ పరిశీలనలోనే...
ఆంధ్రప్రదేశ్లో 7 కొత్త గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు, ఇప్పటికే ఉన్న విమానాశ్రయాల విస్తరణ పనులు రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్గా మార్చడానికి దోహదపడతాయని ప్రభుత్వం చెబుతోంది. కన్సల్టెంట్లు, డెవలపర్ల ఎంపిక, 12 మంది టెక్నికల్ ఎవాల్యుషన్ కమిటీ ద్వారా బిడ్ల పరిశీలన రాష్ట్రంలో పారదర్శకత, సాంకేతిక సామర్థ్యం, ఆర్థిక సమర్థతను నిర్ధారిస్తుందని ప్రభుత్వం చెబుతున్న మాట.
రాష్ట్రానికి ఇన్ని విమానాశ్రయాలు అవసరమా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వనరులకు అనుగుణంగా విమానాశ్రయాలు సరిపోతాయని, ప్రస్తుతం పీపీపీ పద్ధతిలో చేపడుతున్న విమానాశ్రయాల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండే అవకాశం లేదని సీనియర్ జర్నలిస్ట్ డొక్క రాజగోపాల్ వ్యాఖ్యానించారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం గన్నవరంలో ఉన్న విమానాశ్రయం పరిస్థితి ఆ తరువాత రోజుల్లో ఏమవుతుంది? వేల కోట్లు ఖర్చుపెట్టి అంతర్జాతీయ విమానాశ్రయంగా తయారు చేశారు. విజయవాడను ఆనుకుని 18 కిలో మీటర్ల దూరంలో ఉంది. అటువంటప్పుడు కొత్తగా చేపడుతున్న విమాన ప్రాజెక్టుల వల్ల పెద్దగా ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు ఉండే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.