జగన్ గురించి అమిత్ షాతో ఏమి మాట్లాడారో
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో లోకేష్ భేటీ అయ్యారు.;
By : The Federal
Update: 2025-06-18 09:43 GMT
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవహారాలపై మంత్రి నారా లోకేష్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏమి చర్చించి ఉంటారనేది ఆసక్తకరంగా మారింది. దాదాపు 25 నిముషాల నుంచి అర్థగంట సేపు వీరి భేటీలో ఖచ్చితంగా జగన్ గురించి, లిక్కర్ స్కామ్ గురించి అమిత్ షాతో మంత్రి నారా లోకేష్ చర్చించి ఉంటారనే టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ బుధవారం తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర సహకారంతో అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను లోకేష్ వివరించారు. ఈనెల 21న విశాఖలో ప్రధాని మోదీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమానికి చేపట్టిన ఏర్పాట్లు గురించి కూడా అమిత్ షాతో చర్చించారు.
రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిని వివరిస్తూ కొత్తప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన యువగళం పుస్తకాన్ని అమిత్ షాకు అందజేశారు. సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల్లో చైతన్యాన్ని నింపిన లోకేష్ ను అమిత్ షా ప్రత్యేకంగా అభినందించారు. చంద్రబాబు సుదీర్ఘ పాలన అనుభవం ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి బాటలో నడిపిస్తుందని, ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారుకు కేంద్ర సహకారం కొనసాగుతుందని లోకేష్కు అమిత్ షా భరోసా ఇచ్చినట్లు టీడీపీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.