విశాఖ సాగరతీరంలో ముందస్తు యోగాసనాలు
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి వచ్చినప్పుడు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విశాఖ నగరంలో నిర్వహించాలని సూచించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. యోగాంధ్ర పేరిట విశాఖ సాగరతీరం నుంచి భీమిలి తీరం వరకు 26 కిలోమీటర్ల మేర ఐదు లక్షల మందితో యోగసనాలు నిర్వహించాలని నిర్ణయించింది. నెల రోజుల నుంచి జిల్లా యంత్రాంగమంతా యోగాంధ్ర కార్యకలాపాల్లోనే మునిగి తేలుతోంది. మరోవైపు రాష్ట్రంలోని వివిధ స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల విద్యార్థినీ విద్యార్థులను, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులను, కార్మికులను, ప్రజలను ఇందులో భాగస్వాములను చేస్తోంది. ఇందుకోసం కొన్నాళ్ల నుంచి విశాఖతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో యోగాసనాలపై రిహార్సల్స్ చేస్తున్నారు.
ఇక యోగా డే కోసం అవసరమైన ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు మొత్తం 247 కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆర్కే బీచ్లోని కాళీమాత ఆలయం నుంచి పార్క్ హోటల్ వరకు రెండు కిలోమీటర్ల మేర ప్రధాన వేదికకు ఎంపిక చేశారు. ఈ రెండు కిలోమీటర్ల దూరంలోనూ ఒక్కో కంపార్ట్మెంట్లో వెయ్యి మంది ఉండేలా 12 కంపార్ట్మెంట్లు, బీచ్రోడ్డులో మరో 15 వేల మంది యోగాసనాలు చేసేలా అదనపు కంపార్ట్మెంట్లను సిద్ధం చేస్తున్నారు. సి–1 నుంచి సి–6 కంపార్ట్మెంట్ వరకు తొమ్మిది వేల మంది నేవీ, కోస్ట్గార్డు సిబ్బంది, ఇంటర్నేషనల్ యోగా స్టూడెంట్స్, యోగా అసోసియేషన సభ్యులు, వివిధ స్థాయిల్లో యోగా పోటీల విజేతలకు కేటాయించారు. సి–7 నుంచి 12 వరకు సమీపంలో నివాసితులకు పరిమితం చేయనున్నారు. ఒకవేళ ఆ రోజు వర్షం పడితే ఇబ్బంది తలెత్తకుండా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ప్రధాన కార్యక్రమం కొనసాగించనున్నారు. ఇందుకోసం అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. యోగాసనాల్లో పాల్గొనే వారికి మంచినీరు, ఆహారం, టీ షర్టులు, యోగా మ్యాట్లను పంపిణీ చేయనున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్, 1200 సీసీ కెమెరాలను సిద్ధం చేస్తున్నారు. 116 అంబులెన్సులను, వైద్య బృందాలను, వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచుతున్నారు. ఒక్కో కంపార్ట్మెంటుకు పది మంది చొప్పున వలంటీర్లు ఉంటారు. ప్రతి రెండు మూడు కంపార్ట్మెంట్లకు 20 పడకల వైద్య శిబిరాన్ని, ప్రధాన వేదిక వద్ద 1400 టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నారు. సాగరతీరంలో వేడుకను నిర్వహిస్తున్నందును గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతున్నారు. పది వేల మందితో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ప్రధానితో పాటు గవర్నర్, సీఎంలు కూడా..
ప్రధానితో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా యోగాసనాలు చేస్తారు. ప్రధాన వేదిక వద్ద ప్రజలతో కలిసి కింది భాగంలోనే ప్రధాని మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లతో పాటు ఇతర ప్రముఖులు ఈ యోగాసనాల్లో పాలుపంచుకుంటారు.
ప్రధాని మోదీ ఒకరోజు ముందుగా అంటే ఈనెల 20న సాయంత్రం భువనేశ్వర్లో బయల్దేరి 6.45 గంటకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రధాని ఒక రోజు ముందే విశాఖ రానున్నందున గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు కూడా 20నే వైజాగ్ వస్తున్నారు.
యోగాసనాలు ఎన్ని గంటలకంటే?
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి యోగాసనాల కోసం వచ్చే వారు విశాఖకు ముందుగానే చేరుకుంటారు. వీరిని 21న ఉదయం 5.40 గంటలకు ముందే ఆయా కంపార్ట్మెంట్లకు చేరుస్తారు. ప్రధాని మోదీ ఉదయం 6.30 గంటలకు తాను బస చేసిన తూర్పు నావికాదళ అతిథి గృహం నుంచి ఆర్కే బీచ్ రోడ్డులోని ప్రధాన వేదిక వద్దకు వస్తారు. అక్కడ యోగాసనాల్లో గంటంపావు సేపు పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 11.50 గంటలకు ఢిల్లీ పయనమవుతారు.
రెండు వేలకు పైగా బస్సులు..
మరోవైపు యోగా డేకు వచ్చే వారి కోసం 2,085 బస్సులను (ఇందులో ఆర్టీసీ బస్సులు 1,300) సమకూర్చారు. ఇంకా అవసరమైనన్ని ఆటోలు, టాటా మేజిక్ వంటి వాహనాలను సిద్ధం చేశారు. వీరు విశాఖ సాగరతీరంలో వారికి నిర్దేశించిన చోటకు చేరుకునేలా ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేస్తున్నారు. వచ్చిన వాహనాల్లోనే వారిని తిరిగి పంపిస్తారు. ఇప్పటికే అంతర్జాతీయ యోగా డే ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు విశాఖ వచ్చి సమీక్షలు నిర్వహించారు.
విశాఖలో సమీక్షకు చంద్రబాబు
యోగా డే కార్యక్రమంపై సమీక్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం మధ్యాహ్నం విశాఖ వచ్చారు. తొలుత ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ నుంచి పార్క్ హోటల్ జంక్షన్ వరకు ప్రధాన వేదిక ప్రాంతాన్ని, ప్రత్యామ్నాయ వేదిక ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ను పరిశీలించారు. ‘ఐదు లక్షల మంది యోగాసనాల్లో పాల్గొనేలా చూడాలి. ఈ నాలుగు రోజులు వార్డు సచివాయాల్లో రిహార్సల్స్ చేయాలి. ఆఖరి రెండు రోజులు మాక్ యోగా నిర్వహించాలి’ అని సీఎం అధికారులను ఆదేశించారు.