విశాఖపట్నం ఇంటర్నేషనల్‌ యోగా డే డిక్లరేషన్‌!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దీనిపై ప్రణాళిక రూపొందిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు.;

Update: 2025-06-16 14:09 GMT
విశాఖలో యోగా డేపై సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు

వైజాగ్‌లో ఈనెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నం ఇంటర్నేషనల్‌ యోగా డే అనే డిక్లరేషన్‌ను ప్రకటిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఈ డిక్లరేషన్‌ అనంతరం యోగాపై జాతీయ స్థాయిలో ఏం చేయాలో ప్రధాని మోదీని అడుగుతామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రణాళిక రూపొందిస్తామని, ఆపై ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తామని చెప్పారు. సోమవారం విశాఖ వచ్చిన ఆయన యోగా డే ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే?


సమీక్షలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు

‘పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు విశాఖ ఎంతో అనుకూలం. దేశంలోనే ది బెస్ట్‌ సిటీ. అలాంటి నగరంలో యోగా డే నిర్వహించడం మనందరి అదృష్టం. భవిష్యత్తులో అందరి జీవితాల్లో యోగా అంతర్భాంగం కావాలి. అంతా టెక్నాలజీలో బిజీ అయిపోయాం. సెల్‌ఫోన్‌ లేకుండా ఉండలేకపోతున్నాం. ప్రివెంటివ్‌ హెల్త్‌కి యోగా ప్రత్యామ్నాయం.
యోగా డేపై నెల రోజులు ప్రోగ్రాం ఇచ్చాం. క్రమశిక్షణతో రాష్ట్రం అంతా అమలు చేస్తున్నాం. దేశమంతా లక్ష లొకేషన్లలో యోగా చేç స్తే.. ఒక్క ఏపీలోనే రెండు కోట్ల మంది లక్ష ప్రాంతాల్లో భాగస్వాములవుతున్నారు. విశాఖలో జరిగే యోగా డేకు ఐదు లక్షల మంది పాల్గొంటున్నారు. దీనిని రికార్డు చేయడానికి గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు వస్తున్నారు. అన్ని రికార్డులను విశాఖ యోగా డే బద్దలు కొడుతుంది. ఈ యోగా డేలో పాల్గొన్న వారికి గిన్నిస్‌ బుక్‌ సర్టిఫెకెట్‌ ఇస్తాం. యోగా డే నిర్వహించే శనివారం (21న) సెలవు దినంగా ప్రకటిస్తున్నాం.

సమీక్షలో పాల్గొన్న అధికారులు

 యోగా డే ఏర్పాట్లు భేష్‌..

విశాఖలో అంతర్జాతీయ యోగా డే ఏర్పాట్లు భేషుగ్గా ఉన్నాయి. ఈ నెల రోజుల్లో మూడు లక్షల మందికి పైగా యోగాపై ప్రాక్టీసు చేసిన వారు ఈ ఈవెంట్‌లో పాల్గొంటున్నారు. ప్రతి వంద మందికో టాయిలెట్‌ అందుబాటులో ఉంటుంది. నావికాదళం 11 యుద్ధనౌకలను యోగా కోసం సిద్ధం చేసింది. వాటిలో నావికాదళ సిబ్బంది ఆ రోజు యోగాసనాలు చేస్తారు. పాడేరు నుంచి 25 వేల మంది గిరిజన విద్యార్థులు హాజరవుతున్నారు. యోగా డే నాడు వర్షం వస్తే ప్రత్యామ్నాయంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం గ్రౌండ్‌కు వేదికను మారుస్తాం. మొత్తం 326 కంపార్టుమెంట్లను ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కో దాంటో వెయ్యి మందికి వీలు కల్పిస్తాం. గ్రామ/వార్డు సచివాలయాలకు మ్యాపింగ్‌ చేసి వచ్చే వారికి సీటు నెంబర్లు కేటాయిస్తున్నాం. ఇప్పటివరకు ప్రాక్టీసు చేసిన వారికే యోగా డేలో ప్రవేశానికి అనుమతిస్తున్నాం. 3.50 లక్షల మందికి మ్యాట్‌లు తెప్పించాం. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అంతా కలిసి ఈ ఈవెంట్‌ను బెస్ట్‌ ఈవెంట్‌గా చేయాలని కోరుతున్నాను. భవిష్యత్తు కోసం చేసే మంచి ఈవెంట్‌. పురాతన యోగా వారసత్వ సంపదను భావితరాలకు అప్పగించే బాధ్యత మనది.
యోగా ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకుంటే ఆస్పత్రి ఖర్చులు తగ్గుతాయి. రోజులో యోగాకు గంట కేటాయిస్తే ఇంట్లో వారికి, సమాజానికి భారం కాము. యోగా ఒక వర్గానికే కాదు.. అన్ని వర్గాల వారికి మేలు చేస్తుంది. ఇందులో మహిళలూ భాగస్వామ్యం కావాలి. నేను ఇంతవరకు చేసిన ఈవెంట్లలో గ్రేటెస్ట్‌ ఈవెంట్‌ ఇది. ప్రధాని మోదీ మనకు మంచి అవకాశాన్ని ఇచ్చారు.
ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత..
మా ప్రభుత్వం ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. యోగా డేను తీసుకుని భవిష్యత్తులో ఎలా భాగస్వామ్యం కావాలో చర్చిస్తాం. ఇది ఈవెంట్‌కే పరిమితం కాకుండా కొనసాగించడానికి ఏం చేయాలో వర్కవుట్‌ చేస్తాం. హెల్త్‌లో వినూత్న కార్యక్రమాలు తేవాలనుకుంటున్నాం. ప్రివెంటివ్‌ హెల్త్‌లో యోగా ముఖ్యం. ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తయారు చేస్తాం. మందుల ఖర్చు ఎలా తగ్గించాలన్న దానిపై పని చేయడానికి బిల్‌గేట్స్‌ ఫౌండేషన్‌ ముందుకొచ్చింది. ఏపీలో నాలెడ్జ్‌ టెక్నాలజీని తీసుకొచ్చి అమలు చేస్తాం. తొలుత 6 నెలల్లో చిత్తూరు జిల్లాలో 2 ఏళ్లలో రాష్ట్రం మొత్తం అమలు చేయాలని అనుకుంటున్నాం. ఆదాయం పెరగాలి. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి. ఆరోగ్యం కోసం వేల కోట్లు ఖర్చు చేస్తాం. అమరావతిలో సత్యనారాయణరాజు 750 పడకలతో యోగా నేచురోపతి యోగా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నాం. డీమ్డ్‌ యూనివర్సిటీగా చేసే యోచన చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాకు వివరించారు.
అధికారులతో సీఎం సమీక్ష..
అంతకుముందు సీఎం చంద్రబాబు యోగా డేపై అధికారులతో సమీక్ష జరిపారు. ప్రధాని నరేంద్రమోదీ సూచనతో నిర్వహిస్తున్న ఈ యోగా డేను విజయవంతానికి అధికారులు కృషి చేయాలని కోరారు. యోగా డే నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని, ఇందులో పాల్గొనే వారికి అన్ని రకాలుగా గైడ్‌ చేయాలని, ఉదయం ఆరు గంటలకల్లా వారి స్థానాలకు తీసుకెళ్లేలా చూడాలని స్పష్టం చేశారు. వీరు తిరిగి వారి స్వస్థలాలకు వెళ్లే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు కూడా ఈ బృహత్కార్యంలో భాగస్వాములు కావాలని కోరారు.
Tags:    

Similar News