జూన్‌ 12న విజయోత్సవ ర్యాలీలు

టీడీపీ నాయకులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.;

Update: 2025-06-07 11:41 GMT

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్‌ 12న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులతో సీఎం చంద్రబాబు శనివారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయోత్సవ ర్యాలీల గురించి చంద్రబాబు వారితో చర్చించారు. జూన్‌ 12తో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన నేపథ్యంలో ప్రతి నియోజక వర్గంలో కూడా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించారు.

అదే రోజు కూటమి పక్ష నాయకులతోను, ఉన్నత అధికారులతో ఏడాది కాలం పాలన మీద సమీక్ష సమావేశం ఉంటుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రజా ప్రతినిధులందరి మీద వారి పనితీరుకు సంబంధించి స్పెషల్‌ సర్వేలు చేయిస్తున్నానని, వారి వ్యవహార శైలి మీద ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నానని, తేడాలొస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మెరుగైన పనితీరును కనబరిచిన వాళ్లకు మరింత ప్రోత్సాహం ఉంటుందని, మెరుగైన అవకాశాలు ఉంటాయని సూచించారు. లోపాలు ఉంటే మాత్రం వారిపైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి చెందిన మెజారిటీ ప్రజాప్రతినిధులు మెరుగైన పనితీరును కనబరుస్తున్నారని, తద్వారా ప్రజలకు చేరువయ్యారని, కొందరి పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని, వీరి వల్ల ప్రభుత్వానికి, పార్టీకి నష్టం వాటిల్లుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారు వారి వ్యవహార శైలిని మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రతి ఎమ్మెల్యే, ఎంపీతోను త్వరలో వ్యక్తిగతంగా సమావేశం నిర్వహిస్తానని, దీనిని దృష్టిలో పెట్టుకోవాలని హెచ్చరించారు.

వన్‌టైమ్‌ మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీలుగా మిగిలి పోకుండా పని తీరును మెరుగు పరుచుకోవాలని సూచించారు. ప్రజలు ప్రతి అంశాన్ని గమనిస్తుంటారని, దానిని దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించాలని శ్రేణులకు దిశానిర్థేశం చేశారు. జూన్‌ 12న కానీ జూన్‌ 14లోగా కానీ తల్లికి వందనంకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఇదే నెలలోనే అన్నదాత సుఖీభవకు, ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలకు శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు. 2027 నాటికి పోలవం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.

Tags:    

Similar News