కన్నీళ్లు తెప్పిస్తున్న వీరజవాన్ మురళీ నాయక్ పాట
ఇండియా–పాకిస్తాన్ యుద్ధంలో భారత దేశ ప్రజల కోసం ప్రాణాలర్పించి అమరుడయ్యారు మురళీ నాయక్.;
By : Vijayakumar Garika
Update: 2025-05-11 09:47 GMT
పాకిస్తాన్ సైనిక కాల్పుల్లో నేలకొరిగిన భారత వీర జవాన్, తెలుగు జాతి ముద్దు బిడ్డ మురళీ నాయక్ పాట కన్నీరు తెప్పిస్తోంది. పాడింది నాలుగు లైన్లే అయినా గుండె తరుక్కు పోయేలా ఉంది. దేశం కోసం మురళీ నాయక్ అమరుడై అతని తల్లిదండ్రులకు ఎంత కడుపు కోత మిగిల్చాడో వింటుంటే హృదయం ద్రవించి వేస్తోంది. ఈ పాట విన్న వారు కన్నీరు పెట్టకుండా ఉండలేరు. తెలంగాణ యాసలో ఉన్న ఈ పాట హృదయాలను కదిలించేది ఉంది. ఈ పాట విన్న మురళీ నాయక్ తల్లి జ్యోతి తల్లడిల్లి పోయింది. తండ్రి శ్రీరాం నాయక్ గుండెలు పగిలేలా విలపించారు. వీర జవాన్ అంతిమ యాత్రకు ముందు ఓ సింగర్ పాడిన ఈ పాట అందరినీ కన్నీరు పెట్టించింది.
‘ఎల్లిపొయ్యావా మురళీ నాయకన్నా
మళ్లెన్నాడు వస్తావన్నో మనసున్నా మాయన్నా
నువ్వులేక మీ అమ్మా నేడు సిన్నబోయనన్నా
భారత దేశం నీకై నేడు వెతుకుతున్నదన్నా
వెళ్లిపొయ్యావా అన్నా ముర్లన్నా
మళ్లెన్నాడొస్తావో మా లంబడోళ్ల బిడ్డవు నీవన్నా
భారత దేశం కోసం నీవు జవానువయ్యీనావా
పాకిస్తాన్ కోసం నీవు తుపాకీ పట్టీనావా
ప్రజల గుండెల్లో నేడు నీవు నిద్దురోబొయ్యావా
మళ్లీ జన్మంటూ ఉంటే నీకు మురళీ నాయక్గా పుట్టున్నా
మీ యమ్మ కడుపులో పుట్టున్నా ’
పేదోళ్ల కడుపులో పుట్టి.. ఎర్ర బస్సెక్కి.. చదువు నేర్చుకొని.. నాన్న నీకడుపున నేనొక్కడ్నే పుట్టినా. ఊపిరి ఉన్నంత వరకు దేశం కోసం ఒక్క రోజైనా పోరాడుతా. నా పాడి మీద మన భారత దేశం జెండా ఎగిరితే చాలు నాన్నా అని అమర జవాన్ మురళీ నాయక్ చెప్పిన మాటలు నేడు నిజం చేసుకున్నారు వీర జవాన్ మురళీ నాయక్. ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని తెలుగు బిడ్డలతో పాటు దేశం యావత్తు ప్రశాంతంగా నిద్రబోతున్నారంటే ఇలాంటి అమర జవాన్ మురళీ నాయక్ వంటి వీర జవాన్ల ప్రాణాల త్యాగమే. జోహార్ మురళీ నాయక్ అంటూ ఘనంగా నివాళులు అర్పించారు.