ఏపీలో కేంద్రమంత్రి ఏరియల్ సర్వే.. తర్వాత అక్కడే..

ఆంధ్రప్రదేశ్‌ను వరదలు ముంచెత్తిన క్రమంలో రాష్ట్రంలోని పరిస్థితులను పరిశీలించడానికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చారు. రాష్ట్రంలో వరదల వల్ల కలిగిన ప్రాణ, ఆస్తి నష్టాలతో పాటు వరద తీవ్రతకు సంబంధించి కూడా ఆయన పలు అంశాలను పరిశీలించారు.

Update: 2024-09-05 12:04 GMT

ఆంధ్రప్రదేశ్‌ను వరదలు ముంచెత్తిన క్రమంలో రాష్ట్రంలోని పరిస్థితులను పరిశీలించడానికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చారు. రాష్ట్రంలో వరదల వల్ల కలిగిన ప్రాణ, ఆస్తి నష్టాలతో పాటు వరద తీవ్రతకు సంబంధించి కూడా ఆయన పలు అంశాలను పరిశీలించారు. ఈ మేరకు ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. వెంటనే అక్కడి నుంచే ఏరియల్ సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా బుడమేరు, క్యాచ్‌మెంట్ ఏరియాలను కేంద్రమంత్రి చౌహాన్ పరిశీలించారు. ఏరియల్ సర్వే ముగిసిన అనంతరం పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా వరదల ప్రభావం, ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఆయన మంత్రి నారా లోకేష్‌తో చర్చించారు.

వివరించిన లోకేష్..

జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ, కండ్రిక, అజిత్ సింగ్ నగర్ సహా పలు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి ఏరియల్ సర్వే నిర్వహించారు. అక్కడి నుంచి సరాసరపి సీఎం నివాసంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. వరదల పరిస్థితిపై మంత్రి నారా లోకేష్‌తో సమీక్షించారు. ఇందులో భాగంగా వరదల వల్ల కలిగి నష్టాన్ని లోకేష్ వివరించారు. అక్కడి నుంచి వెంటనే రోడ్డు మార్గంలో ప్రకాశం బ్యారేజీకి చేరుకున్నారు కేంద్ర మంత్రి శివరాజ్. బ్యారేజీకి జరిగిన డ్యామేజ్‌ని పరిశీలించారు. అక్కడి నుంచి జక్కంపుడి మిల్క్ ఫ్యాక్టరీ ప్రాంతాన్ని కూడా సందర్శించనున్నారు. అక్కడి నుంచి నేరుగా విజయవాడ కలెక్టరేట్‌కు చేరుకున్నారు.

 

కలెక్టరేట్‌లో నిర్వహించిన వరదల ఎగ్జిబిషన్‌ను చౌహాన్ తిలకించారు. వరద నష్టంపై ఐఏఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బుడమేరుకు పడ్డ గండ్లు, ప్రకాశం బ్యారేజీకి జరిగిన నష్టం గురించి పలు ప్రశ్నలు అడిగారు కేంద్రమంత్రి. ఆయన ప్రశ్నలకు ఉన్నతాధికారులు బదులిచ్చారు. బుడమేరు గంట్లను పూడ్చే పనులను శరవేగంగా చేస్తున్నట్లు చెప్పారు.

ఏపీ నుంచి నేరుగా అక్కడికే..

ఏపీ పర్యటన ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. తెలంగాణకు వెళ్లనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేసిన క్రమంలో తెలంగాణలో జరిగిన వరదల నష్టాన్ని కూడా శివరాజ్ సింగ్ చౌహన్.. పరిశీలించనున్నారు. వీటిపై అక్కడి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ సూచనల మేరకు ఈరోజు ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి.. రేపు తెలంగాణకు బయలుదేరనున్నారు. తన తెలంగాణ పర్యటనలో భాగంగా ఆయన ఖల్లం సహా పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రైతులతో మాట్లాడి వారికి జరిగిన నష్టంపై ఆరా తీయనున్నారు.

Tags:    

Similar News