TTD | అప్పలాయగుంట వెంకన్న అభయదాత ఎలా అయ్యారు?
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల, అప్పలాయగుంట క్షేత్రాల మధ్య ప్రత్యేకత ఉంది.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-06-07 06:42 GMT
తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట వద్ద ఉన్న ప్రసన్న శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ ఆలయానికి ప్రత్యేకత ఉంది.
తిరుమల శ్రీవారి మూలవిరాట్టు, అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరుడి విగ్రహానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అదే ఇక్కడ ప్రత్యేకత. తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడి విగ్రహం ఎడమ కటిహస్తం నడుము వద్ద ఒంపు తిరిగి ఉంటుంది. కుడి చెయ్యి కిందికి చాచి ఉంటుంది. అందుకే ఈయనను వడ్డికాసుల వాడిగా కూడా వర్ణిస్తారు.
తిరుపతికి సమీపంలోని అప్పలయగుంటలో ప్రసన్న వెంకటేశ్వరుడి పేరుకు తగినట్లే దర్శనం ఇస్తుంటారు. కుడిచేయి అభయం ఇస్తున్నట్లు ఆశీర్వదిస్తుంటారు. అందుకే ప్రసన్న వెంకటేశ్వరుడు కొలువైన ఈ ప్రాంతాన్ని అప్పలయగుంటగా ప్రసిద్ధి. చిన్న గ్రామంలోని ఈ ఆలయం తిరుపతికి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఆలయ విశిష్టత
అప్పలాయగుంట శ్రీ వేంకటేశ్వరాలయానికి చారిత్రక నేపథ్యం ఉంది. తిరుమల శ్రీవేంకటేశ్వరాలయానికి చుట్టు ఉన్న ఏడు పురాతన శ్రీవేంకటేశ్వరాలయాలలో ఇది ఒకటి. ఇది అప్పలాయగుంటలో వెలసిన దేవాలయం.
శ్రీ వేంకటేశ్వరుడు నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహమాడి తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళ్తూ అప్పలాయగుంటలో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయ హస్తంతో ఆశీర్వదించారట. ఆయన ఇక్కడి ఈ ఆలయంలో కొలువు దీరాడు. తర్వాత ఇక్కడి నుంచి కాలినడకన తొండవాడలోని అగస్తేశ్వరుని దర్శించి తర్వాత సమీపంలోనే ఉన్న శ్రీనివాస మంగాపురంలో ఆరునెలలు ఉండి, అక్కడి నుంచి శ్రీవారిమెట్టు ద్వారా (నూరు మెట్ల దారి) తిరుమల చేరాడనేది స్థల పురాణం
పేరువెనుక చరిత్ర
ఈ ప్రదేశంలో అప్పలయ్య అనే వ్యక్తి యాత్రికులు, గ్రామస్తుల కోసం ఒక గుంత తవ్వించాడని చెబుతారు. అదే కాలక్రమంలో కోనేరుగా మారి, అప్పటి నుంచి ఈ ప్రదేశం అప్పలయ్యగుంటగా పిలుస్తూ, కాలక్రమంలో అది అప్పలగుంటగా మారిందనేది చరిత్ర. అప్పలయ్య ఆ గుంత తవ్వే సమయంలో పనిచేసినవారికి కూలి అప్పు లేకుండా ఏరోజుకు ఆరోజే ఇచ్చేవాడని, అందుకనే ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చిందని అదనంగా ప్రచారంలో ఉంది.
ఆలయ ప్రత్యేకతలు
ఈ ఆలయానికి దక్షిణం వైపున ఎత్తైన కొండ, చుట్టూ పంటపొలాలు కనిపిస్తాయి. వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారం దాటగానే ధ్వజస్తంభం, దాని వెనుక అంతరాళం ఎదురుగా గర్భగుడిలో శ్రీవారి దివ్య మంగళ రూపం కనుల విందు చేస్తుంది. శ్రీ వారి ఆలయం ముందు చిన్న కోనేరు, దానికి ముందు ప్రధాన ఆలయానికి ఎదురుగా చిన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది.
పూజా విశేషాలు
ప్రతి నిత్యం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామివారికి మంగళ వాయిద్యాలతో పూజాభిషేకాలు నిర్వహించి, తర్వాత శ్రీవారికి అభిషేక పూజలు చేస్తుంటారు. ఆ తరువాత భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు తక్కువ. ఆలయం ప్రశాంత వాతావరణంలో ఉంటుంది.
క్షేత్రానికి వెళ్ళే మార్గాలు
అప్పలాయ గుంట తిరుపతికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి ఆర్టీసీ బస్టాండు నుంచి ప్రతి గంటకు బస్సులు ఉంటాయి. తిరుపతి నుంచి పరిసర ప్రాంతాలలోని ఆలయ సందర్శన బస్సులు కూడా ఇక్కడి వస్తుంటాయి. తిరుపతికి వచ్చిన వారు తప్పక చూడవలసిన ఆలయమిది.
ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 7.30 నుంచి 8.00 గంటల మధ్య మిథున లగ్నంలో వైఖానసాగమోక్తంగా ధ్వజారోహణ ఘట్టం జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.
తిరుచ్చి ఉత్సవం
అంతకుముందు ఉదయం 5.30 నుంచి 6.00 గంటల వరకు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. అంతకుముందు భేరితాడనం, భేరిపూజ, ధ్వజపటం, నవసంధి, శ్రీవారి మాడవీధి ఉత్సవం, ఆస్థానం నిర్వహించారు. మిథున లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి నూతన వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. ఎన్ని దానాలు చేసినా ధ్వజారోహణకార్యంలో గరుడారోహణం వీక్షించిన భక్తులు పునీతులు అవుతారని పురాణాలు చెబుతున్నాయి. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. సమాజశ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుంది.
టిటిడి పటిష్ట ఏర్పాట్లు
బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున టిటిడి పటిష్ట ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు భక్తులకు అన్నదానం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల నేపథ్యంలో ఆలయం తోపాటు గ్రామంలో ఆకర్షణీయంగా విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలు చేశారు. క్షేత్ర మహిమను తెలిపేలా ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేశారు. ఎస్వీ మ్యూజిక్ కళాశాల, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో స్వామివారి ఆలయ ప్రాంగణంలో ధార్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
అనంతరం ఉదయం 9.30 నుంచి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేపట్టారు.
సాయంత్రం: 5.30 నుంచి రాత్రి 6.30 గంటల వరకు ఊంజల్సేవ ఘనంగా జరుగుతుంది.
రాత్రి: బ్రహ్మోత్సవాల్లో మొదటిదైన పెద్దశేష వాహనసేవ రాత్రి 7.00 నుంmr 8.00 గంటల వరకు వైభవంగా జరుగనుంది.
ఆకట్టుకుంటున పుష్పాలంకరణ
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుత్ దీపాలంకరణలు రూపొందించారు. భక్తులకు వేసవిలో ఇబ్బంది లేకుండా చలువ పందిళ్లు, తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రథమ చికిత్స కేంద్రం, ఆయుర్వేద వైద్యశాల తదితర కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలను టిటిడి డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివకుమార్, ఏవీఎస్వో సతీష్ కుమార్ అధికారులు పర్యవేక్షించారు.