శ్రీవారి దర్శనం టికెట్లు ప్రతి నెలా జారీ?

'డయల్ యువర్ ఈఓ'లో వెల్లడి.

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-10-03 08:25 GMT

శ్రీవారి దర్శనం టికెట్ల కోటా పెంచలేం.. ఆన్ లైన్ గడవుపై సమీక్ష

తిరుమల శ్రీవారి దర్శనానికి అమలు చేస్తున్న టికెట్ల కోటా పెంచడ సాధ్యం కాదని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. అంగప్రదక్షిణ, ప్రత్యేక దర్శనం కోటా టికెట్ల జారీ విధానం సమీక్షిస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం మూడు నెలలకు ఒకసారి ఇచ్చే గడువును నెలకు కుదించాలని యాత్రికులు సూచన చేశారు. రానున్న టీటీడీ పాలక మండలిలో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని యాత్రికుల సూచనలపై ఈఓ సింఘాల్ స్పందించారు.


తిరుమల అన్నమయ్య భవన్ లో శుక్రవారం ఉదయం డయల్ యువర్ ఈఓ కార్యక్రమం ద్వారా సలహాలు, సూచనలు స్వీకరించారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ,
"తిరుమల నుంచి ఐదు సంవత్సరాల తరువాత ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశం దక్కింది. నిర్ణీత గంటల్లో సామాన్య యాత్రికులకు మంచి దర్శనం కల్పించడానికి సమాలోచనలు సాగుతున్నాయి. మా ప్రాధాన్యత కూడా అదే" అని ఈఓ అనిల్ కుమార్ సంఘాల్ చెప్పారు. శుక్రవారం ఉదయం గంటపాటు నిర్వహించిన డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో 23 మంది యాత్రికులు ఫోన్ ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడించారు.

"అంగప్రదక్షిణ టోకెన్లు, శీఘ్రదర్శనం, 300 ఆన్ లైన్ కోటా టికెట్ల జారీ గడువు నెలకు కుదించే విషయంలో రానున్న టీటీడీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం" అని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సమయంలో కూడా గ్యాలరీల్లోని యాత్రికుల అనేక మంది కూడా ఈ విషయాలు ప్రస్తావించారని ఆయన గుర్తు చేశారు.
పాత పద్ధతి పునరుద్ధరించండి
"అంగప్రదక్షిణ టోకెన్లు ఆఫ్ లైన్ లో ఇవ్వండి. వృద్ధులు, వికలాంగులు, దీర్ఘాకాలిక రోగాలతో ఉన్న వారికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వండి" అని చాలా మంత్రి ఫోన్ లో అభ్యర్థించారు. జీవిత చరమాంకంలో ఉన్న వారికి కూడా మూడు నెలల వరకు వేచి ఉండడం కూడా కష్టమే" అనే విషయాన్ని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ కు గుర్తు చేశారు. దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం తీసుకుంటున్నవారి కోసం పాతపద్ధతిలోనే ఆలయం వద్ద నేరుగా పంపించడానికి వీలుగా పాత పద్ధతిని పునరుద్ధరించాలని కూడా సూచించారు.
దీనికి స్పందించిన ఈఓ అనిల్ కుమార్ సింఘాల్..
"రోజులో ఉన్న గంటలు తక్కువ. సామాన్య యాత్రికులకు సమయం ఇస్తున్నాం. ఆలయ పరిధికి తగినట్లు యాత్రికులను అనుమతించాలి. పాతపద్ధతి పునరుద్ధరించడం కష్టం అవుతుంది. దీనిపై పాలక మండలిలో చర్చించే ప్రయత్నం చేస్తా " అని ఈఓ సింఘాల్ సమాధానం చెప్పారు.
"దివ్యదర్శనం టోకెన్లు ప్రస్తుతం భూదేవి కాంప్లెక్స్ వద్ద జారీ చేస్తున్నారు. అలిపిరి వద్ద ఇవ్వడానికి పరిశీలన జరుగుతోంది" అని కూడా సింఘాల్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు హాజరయ్యారు.

యాత్రికుల సూచనలు.. ఈఓ స్పందన

1. ప్రత్యేక దర్శనం కోటా మూడు నెలలకు ఒకసారి కాకుండా, ప్రతినెలా జారీ చేయండి

శ్రీనివాస్, కడప.

ఈఓ: ఈ సూచన పరిశీలిస్తాం. అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తాం.

2. శ్రీవారిసేవ కోసం నవంబర్ 16కు రావాలని దరఖాస్తు చేశా. ముందు రోజే రమ్మని సందేశం వచ్చింది.

శంకరయ్య హైదరాబాద్.

ఈఓ: ఫరవాలేదు రండి. మీకు సేవ భాగ్యం కల్పిస్తారు. (శ్రీవారిసేవ ఇన్చార్జి, చీఫ్ పీఆర్ఓతో మాట్లాడిన ఈఓ ఈ సూచన చేశారు)

3. రిటైర్డ్ ఉద్యోగులకు ప్రత్యేక దర్శనం అవకాశం ఇవ్వండి

నాగమల్లేశ్వరరావు, పల్నాడు

ఈఓ: ప్రస్తుతం ఆ అవకాశం లేదు. ఇప్పటికే రూ.300/- ఎస్ఈడి టికెట్లు ఆన్ లైన్ లో, తిరుపతిలో కరెంటు బుకింగ్ ఎస్ఎస్ డి టికెట్లు జారీ చేస్తున్నాం. శ్రీవారి దర్శనానికి వీటిని పొందవచ్చు.

4 లడ్డు ప్రసాద సేవ తిరిగి ప్రవేశపెట్టండి.

శ్రీ శ్రీనివాస్ - మెట్టపల్లి

ఈవో: కొన్ని కారణాల వల్ల లడ్డు ప్రసాద సేవ ఆపివేశాం.

5. అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో నడిచి వచ్చే భక్తులకు నిరంతరాయంగా దర్శనం టోకెన్లు మంజూరు చేయండి.

శ్రీ వీరబాబు - కాకినాడ

ఈవో: ప్రతిరోజు 16 నుండి 24 వేల వరకు ఎస్ ఎస్ డి టోకెన్లు జారీ చేస్తున్నాం.

6. వెండి వాకిలి నుండి బంగారు వాకిలి వరకు భక్తులను మధ్య తోపులాట ఎక్కువగా ఉంది. అక్కడ విధుల్లో ఉన్నవారు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు.

శ్రీ నాగేశ్వరరావు - తిరుపూర్

ఈవో : వెండి వాకిలి నుండి బంగారు వాకిలి వరకు భక్తులతో ఏ విధంగా ప్రవర్తించాలి అనే దానిపై శ్రీవారి సేవకులు, సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాం. శ్రీవారి దర్శనానికి 20 గంటలకు పైగా భక్తులు వేచి ఉంటారు. కావున ఒక్క నిమిషం పాటైనా స్వామి వారిని చూడాలనుకుంటారు. క్యూలైన్లు సాఫీగా ఉండేలా చర్యలు చేపడతాం.

7. రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు కలిగిన భక్తులు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నప్పుడు వేడిగా ఉన్న అన్నప్రసాదాలు ఇచ్చిన వెంటనే గేట్లు తెరవడం వలన అన్నప్రసాదాలు వృధా అవుతున్నాయి. అదేవిధంగా తిరుమల సంప్రదాయానికి విరుద్ధంగా మహిళలు పూలు పెట్టుకు వస్తున్నారు, అవగాహన కల్పించండి.

వసుంధర, హైదరాబాద్.

ఈవో : అన్నప్రసాదాలు వృధా కాకుండా చర్యలు తీసుకుంటాం. తిరుమల క్షేత్ర సాంప్రదాయం పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం.

8. లక్కీ డిప్ ద్వారా శ్రీవారి సేవలు పొందాం. తిరుమలలో వసతిని ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాం. గదులు పొందేందుకు నిర్ణీత సమయం కంటే రెండు గంటలు అధిక సమయం ఇవ్వండి.

కృష్ణ చైతన్య - ఖమ్మం

ఈవో : పరిశీలిస్తాం.

9. సెప్టెంబర్ 16 నుండి 30వ తేదీ వరకు సీనియర్ శ్రీవారి సేవకులుగా సేవలు అందించాం. హరినామ సంకీర్తన వద్ద అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది పోలీస్ వారి కుటుంబ సభ్యులను అనుమతించారు, మాకు గేట్ తీయలేదు.

గీతా కుమారి - పశ్చిమగోదావరి

ఈవో : 3500 మంది శ్రీవారి సేవకులు బ్రహ్మోత్సవాలలో అత్యద్భుతంగా భక్తులకు సేవలు అందించారు. ప్రత్యేకంగా గరుడసేవనాడు అందించిన సేవలకు భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది వల్ల ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకుంటాం.

10: అంగప్రదక్షిణ టోకెన్లు ఆన్లైన్లో ప్రతినెలా ఇవ్వాలి. ఒకసారి పొందితే ఆరు నెలల వరకు పొందేందుకు అవకాశం లేదు, కావున ప్రతినెల అవకాశం కల్పించండి.

శ్రీ హరికృష్ణ - ఖమ్మం మాధురి - హైదరాబాద్

ఈవో : చాలామంది భక్తులు అంగప్రదక్షిణ టికెట్ల జారీపై తనను సంప్రదించారని, టిటిడి బోర్డు మీటింగ్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.

11. వయోవృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రతి నెల టోకెన్లు జారీచేయండి. మూడు నెలలకు ముందు బుక్ చేసుకుంటే వారు అనారోగ్య కారణాల వలన రాలేకపోతున్నారు.

అలేఖ్య హైదరాబాద్

ఈవో : ఎక్కువ మంది భక్తులకు మేలు చేయాలనేదే ముఖ్య ఉద్దేశం. మీరు చెప్పిన అంశాన్ని పరిశీలిస్తాం.

12. వయోవృద్ధులకు, దివ్యాంగులకు ఇదివరకు తిరుమలలో ప్రతిరోజు కేటాయించే విధంగా దర్శన టోకెన్లు కేటాయించండి. ఆన్లైన్లో మూడు నెలలకు ముందు కాకుండా 15 రోజులకు ముందు విడుదల చేయండి.

అరుంధతి - హైదరాబాద్ సుబ్బలక్ష్మి - హైదరాబాద్

ఈవో: పరిశీలిస్తాం.

13. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కొందరు దళారులు టిటిడి ఉద్యోగులు దర్శనం ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నారు దర్శనం ఇప్పించకపోగా, తిరిగి డబ్బులు ఇవ్వలేదు.

హరి ప్రసాద్ తిరుపతి,

ఈవో: ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా టిటిడి ఉద్యోగులు, దళారులపై కఠిన చర్యలు తీసుకుంటాం.

ఆ సంఘటనకు బాధపడుతున్నా..

14. గత నె ల26న దర్శనానికి వచ్చా. రద్దీ లేదు. కాని తోసివేశారు. దర్శనం దక్కలేదు. టీటీడీ సిబ్బంది తీరు దారుణంగా ఉంది. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈఓ కు మెయిల్ కూడా చేశా.

కృష్ణ, బెంగళూరు, ఢిఫెన్స్ అధికారి

ఈఓ: ఈ సంఘటనకు నేను చింతిస్తున్నా. ఉద్యోగులు పద్ధతి మార్చుకోవడానికి శిక్షణ ఇస్తున్నాం. మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.

15. మా ఊర్లో శ్రీవాణి ట్రస్టు ద్వారా ఆలయ నిర్మాణానికి దరఖాస్తు చేశాం. పరిశీలించారు. అంచనాలు కూడా తయారు చేశారు. ఆ తరువాత ఎలాంటి స్పందన లేదు. సప్తగిరి మాసపత్రిక కోసం చందాన కూడా కట్టాను. అయినా అందడం లేదు.

శ్రీకాంత్, మంచిర్యాల

ఈఓ: ఈ విషయం ఇంజినీరింగ్ అధికారులు నోట్ చేసుకున్నారు. మీకు సమాధానం ఇస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్ఓ కే.వి. మురళీకృష్ణ, సిఈ సత్యనారాయణతో పాటు టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News