TTD AD Building | ట్రిపుల్ సెంచురీకి చేరిన చిరు వ్యాపారుల నిరసన
తిరుపతిలోని టీటీడీ ప్రధాన పరిపానా భవనం వద్ద 30 కుటుంబాలు దీక్షలు చేస్తున్నాయి. శ్రీవారిమెట్టు వద్ద చిన్న వ్యాపారాలకు అనుమతించాలని కోరుతున్నాయి.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-06-15 14:04 GMT
తిరుపతి చరిత్రలో నిరసన దీక్షలు రికార్డు సృష్టించాయి. శ్రీవారిమెట్టు మార్గంలో చిన్న వ్యాపారానికి అనుమతించాలని 30 కుటుంబాలు 300 రోజులుగా దీక్షలు చేస్తున్నాయి. టీటీడీ అధికారుల నుంచి స్పందన లేకపోవడంపై సీఐటీయూ సారధ్యంలో ఈ దీక్షలు సాగుతున్నాయి. ఎన్నికలకు ముందు టీటీడీ ఫారెస్టు కాంట్రాక్టు కార్మికులు మూడున్నర సంవత్సరాలు దీక్షలు సాగించారు. ఎన్నికల నామ సంవత్సరంలో వారి సమస్యలు తీరాయి.
శ్రీవారిమెట్ట మార్గంలో చిన్న తట్టలపై వ్యాపారులు జీవించే పేద కుటుంబాలు తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams TTD ) పరిపాలనా భవనం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ దీక్షలు చేస్తున్నాయి. ఏడాది నుంచి టీటీడీ ప్రధాన కార్యాలయం వెలుపల రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై టెంటు వేసుకున్నారు. దుమ్ము, ధూళి రోడ్డుపై వెళ్లే వాహనాల రోద ఒక పక్క. ఎండ, వానకు కూడా లేవకుండా, శిబిరంలో బృందాల వారీగా కూర్చుని చిన్న వ్యాపారులు దీక్షలు సాగిస్తున్నారు. వారందరికీ శ్రీవారిమెట్టు మార్గంలో చిన్న తట్టలపై చిరుతిండి విక్రయించి జీవించే వారు. ఏడాది కిందట వారిని శ్రీవారిమెట్టు మార్గం వద్దకు అనుమతించడం లేదు.
శ్రీవారిమెట్టు చిరు వ్యాపారులకు మద్దతుగా సీఐటీయూ రంగంలోకి దిగింది. టీటీడీ ప్రధాన భవనం వెలుపల రోడ్డుపక్కనే దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. నిత్యం ఇదే మార్గంలో ప్రయాణించే టీటీడీ ఈఓ, జేఈఓ, అదనపు ఈఓ తోపాటు చైర్మన్ పాలక మండలి సభ్యులు కూడా స్పందించడం లేదని శ్రీవారి చిరువ్యాపారుల సంఘం గౌరవాధ్యక్షుడు కందారపు మురళీ నిరసన వ్యక్తం చేశారు.
శ్రీవారిమెట్టు మార్గంలో అక్కడక్కడా 30 మంది చిన్న తట్టలపై వ్యాపారాలతో జీవనం సాగిస్తూ వచ్చారు. ఉదయం ఆ మార్గంలోకి వెళ్లే చిన్న వ్యాపారులు సాయంత్రం నాలుగు గంటలకు కిందికి దిగివచ్చేసే వారు. శ్రీవారిమెట్టు ప్రారంభంలో ఉన్న దుకాణదారుల వ్యాపారానికి ఇబ్బంది లేకుండా మెట్ల మార్గంలో బొరుగులు, చిన్నపాటి చల్లనిపానీయం ప్యాకెట్లు, లెమన్ జూస్, మజ్జిగ వంటి పదార్థాలు విక్రయించే వారు.
"యాత్రికుల రద్దీని బట్టి రోజుకు రూ. 300 నుంచి 500 వరకు వ్యాపారం జరిగేది" అని పెంచలయ్య అనే యువవ్యాపారి చెప్పారు. అక్కడి దుకాణదారులతో ఎలాంటి అభ్యంతరాలు ఏమాత్రం లేవని ఆయన చెప్పారు.
అలిపిరి మార్గంలో పులిదాడితో...
2023 ఆగష్టు 13 అలిపిరి కాలినడక మార్గంలో ఏడో మైలు దాటిన తరువాత నృసింహస్వామి ఆలయం సమీపంలో చిరుతపులి దాడి చేసి నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత (6) బాలికను చంపేసింది. ఈ సంఘటన నేపథ్యంలో శ్రీవారిమెట్టు మార్గంలో తట్టలపై వ్యాపారం చేస్తున్న 30 కుటుంబాలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి వారిని శ్రీవారిమెట్టు మార్గంలోకి అనుమతించడం లేదు. ఎన్నికలకు ముందు చిరు వ్యాపారులను కొన్ని రోజులు అనుమతించారు. చిరుత సంచారం నేపథ్యంలో తట్టల ఏర్పాటుకు అనుమతించని కారణంగా సీఐటీయూ సారధ్యంలో నిరసన బాటపట్టారు.
అఖిలపక్షం మద్దతు
పిల్లలతో కలిసి నిరసనలో పాల్గొన్న చిన్న వ్యాపారులు
టీటీడీ ప్రధాన పరిపాలన భవనం వద్ద చేపట్టిన దీక్షలు ఆదివారంతో 300 రోజులకు చేరాయి. దీంతో సీపీఎంతో పాటు అన్ని పార్టీల నేతలు శ్రీవారిమెట్టు చిరు వ్యాపారులకు మద్దతుగా బైఠాయించారు. వారి కుటుంబీకులతో పాటు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, అధ్యక్షులు జి. బాలసుబ్రమణ్యం, కార్యదర్శులు ఎస్. జయ చంద్ర, పి. మునిరాజలతోపాటు వ్యాపారులు, వారి కుటుంబ సభ్యులు సామూహికంగా నిరాహార దీక్షలో పాల్గొన్నారు.
"ఇన్ని వందల రోజులుగా దీక్షలు చేస్తున్నా సామాన్యుని గోస పట్టించుకోరా!" అని కందారపు మురళీ నిలదీశారు. కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
" మొదటి బోర్డు సమావేశంలోనే సమస్యపై చర్చించి, పరిష్కరించామని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు చెప్పి, ఏడాది కాస్తున్నా, ఫలితం లేదు" అని మురళీ గుర్తు చేశారు.
టీటీడీ ఇఓ, అడిషనల్ ఇఓకు ఎన్నిసార్లు విన్నవించినా, ఫలితం కనిపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేదకుటుంబాలతో కలిసి నిరవధిక దీక్షకు దిగకతప్పదని ఆయన హెచ్చరించారు. శ్రీవారిమెట్టు చిరు వ్యాపారుల దీక్షలకు సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, రిపబ్లికన్ పార్టీ దక్షిణ భారత అధ్యక్షులు పూతలపట్టు అంజయ్య, కాంగ్రెస్ పార్టీ నేత మాంగాటి గోపాలరెడ్డి, సిపిఐ నేత ఎన్ డీ. రవి, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు నీరుగట్టు నగేష్, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ నేత డీఎంసీ భాస్కర్ మద్దతుగా ప్రసంగించారు.
చిరు వ్యాపార సంఘం అధ్యక్షులు చిట్టిబాబు అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి మధు, యుగంధర్, ప్రకాష్ రామ్మూర్తి, శేఖర్, నరసింహ, మల్లి, మల్లికార్జున్, రాంబాబు, చిరంజీవి, శివ, గణేష్, రాజశేఖర్ పాల్గొన్నారు.
తిరుపతి చరిత్రలో ఎప్పుడూ లేనంతగా 300 రోజులుగా సాగుతున్న దీక్షలు ఓ ఎత్తు. అంతకుముందు. టీటీడీ ఫారెస్టు కాంట్రాక్టు కార్మికులు కూడా సీఐటీయూ ఆధ్వర్యంలో మూడున్నర సంవత్సరాలు పాటు దీక్షలు సాగించారు. ఎన్నికలనామ సంవత్సరం కావడంతో ౨౦౨౪ చివరిలో వారి సమస్య పరిష్కారానికి మార్గం దొరికింది