అత్యంత అట్టహాసంగా నిర్వహించ తలపెట్టిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ముందే విశాఖ ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుపోతోంది. ఈ ట్రాఫిక్ చిక్కుముడిని ఎలా అధిగమించాలోనంటూ ఇటు అధికార యంత్రాంగం.. అటు పోలీసు యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. శనివారం విశాఖ వేదికగా ఇంటర్నేషనల్ యోగా డేకు సర్వం సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో వైజాగ్ సాగరతీరం వెంబడి భీమిలి వరకు 26 కి.మీల మేర ఐదు లక్షల మందితో యోగాసనాలు చేయించడం, దానిని గిన్నిస్ బుక్లోకి ఎక్కించడం రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నెల రోజుల నుంచి అధికారులంతా అదే పనిగా అధికారులంతా బిజీబిజీగా ఉన్నారు.
యోగా డేకి నాలుగు రోజులు ముందే విశాఖ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ, జాతీయ రహదారిపైన పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడడం పోలీసులను కలవరపెడుతోంది. 21వ తేదీ నాడు ట్రాఫిక్ నియంత్రణే అసలైన అగ్ని పరీక్షగా మారనుంది. మరో రెండ్రోజుల్లో విశాఖలో యోగా డే నిర్వహణలో భాగంగా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ క్రమబద్థీకరణ చర్యలు చేపట్టారు. ఆంక్షలూ విధించారు. ఇందులోభాగంగా రెండు రోజుల క్రితమే బీచ్ రోడ్డును మూసివేశారు. అంతేకాదు.. బీచ్ వైపు వెళ్లే ప్రధాన రహదారులను కూడా బంద్ చేశారు. దీంతో బీచ్ రోడ్డు వైపు వెళ్లాల్సిన వాహనాలు నగరంలోని ఇతర రోడ్లతో పాటు జాతీయ రహదారిపైకి క్యూ కడుతున్నాయి.
ఫలితంగా యోగా డేకి నాలుగు రోజులు ముందే విశాఖలో ట్రాఫిక్ ఇక్కట్లు మొదలయ్యాయి. నగర వీధులే కాదు.. నేషనల్ హైవేపై కూడా పలుచోట్ల వాహనాలు ట్రాఫిక్ జామ్లో గంటల తరబడి చిక్కుకుపోయాయి. నేషనల్ హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాటిని క్లియర్ చేయడానికి పోలీసుల తల ప్రాణం తోకకు వచ్చింది. యోగా డే ఇంకా నాలుగు రోజులుండగానే నగరం అష్టదిగ్బంధంలో చిక్కుకు పోతే లక్షలాది మంది, వేలాది వాహనాల రాకతో 21వ తేదీ పరిస్థితి ఇంకెంత క్లిష్టంగా ఉంటుందోనని నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. బుధవారం నగరంలో అనూహ్యంగా తలెత్తిన ట్రాఫిక్ జామ్తో నగర పోలీసు అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రధాన జంక్షన్లలో పోలీసులను నియమించి ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తున్నారు.
ఇప్పటికే ఎక్కడి వారక్కడే..
శనివారం నాటి యోగాంధ్రను దృష్టిలో ఉంచుకుని పోలీసులు బీచ్ రోడ్డును మూడు రోజుల క్రితమే తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అటువైపు ఆటోలు, కార్లు తదితర వాహనాలను అనుమతించడం లేదు. దీంతో సాగరతీరానికి ఆనుకుని/సమీపంలో ఉన్న మహారాణిపేట, సిరిపురం, పాండురంగాపురం, దస్పల్లా హిల్స్, పెదవాల్తేరు, లాసన్స్బే కాలనీ, ఎంవీపీ కాలనీ, అప్పుఘర్, సాగర్నగర్ తదితర ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి అవస్థలు పడుతున్నారు. ఆంక్షల నడుమ అరకొర బైకులను మాత్రమే రోడ్లపైకి అనుమతిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప కార్లు, జీపులు, ఆటోలను అటు వైపు రానీయడం/వెళ్లనీయడం లేదు. దీంతో నగరంలో చాలా ప్రాంతాల ప్రజలు ఎక్కడి వారు అక్కడే ఉండిపోతున్నారు. మరోవైపు శుక్రవారం నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను నగరంలోకి రాకుండా ఆంక్షలు విధించారు.
లక్షల్లో జనం.. వేలల్లో వాహనాలు..
విశాఖలో జరిగే∙యోగాసనాల్లో పాల్గొనేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సుమారు ఐదు లక్షల మంది రానున్నారు. వారిని నగరానికి తీసుకుని రావడానికి, యోగా డే వేడుకలు ముగిశాక తిరిగి వారి స్వస్థలాలకు పంపేందుకు వేల సంఖ్యలో బస్సులు, కార్లు, ఇతర వాహనాలు విశాఖ రానున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం 7,295 బస్సుల్లో యోగాసనాలు చేసే వారిని తరలించనున్నారు. అంటే శుక్రవారం రాత్రి నుంచే ఈ బస్సుల రాక మొదలవుతుంది. యోగా డే పూర్తయ్యాక వేలాదిగా బస్సులు బయల్దేరతాయి. దీంతో నగరంతో పాటు హైవేపై ఎన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది.
వాహనాల దారి మళ్లింపు ఇలా..
ఈనెల 21న జరిగే ఇంటర్నేషనల్ యోగా డేలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఒకరోజు ముందే విశాఖ చేరుకుంటున్నారు. శుక్రవారం (20) సాయంత్రం భువనేశ్వర్ నుంచి ఆయన ప్రత్యేక విమానంలో విశాఖ వస్తారు. ఆ రోజు రాత్రి వైజాగ్లోనే (తూర్పు నావికాదళం గెస్ట్ హౌస్లో) బస చేస్తారు. 21 ఉదయం 8 గంటలకల్లా యోగాసనాలను ముగించుకుని మధ్యాహ్నం వరకు విశాఖలోనే ఉంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆరోజు సాయంత్రం వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను కొనసాగించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి తగరపువలస హైవే జంక్షన్ నుంచి భీమిలి వైపు భారీ వాహనాలను నిషేధించారు. ఆనందపురం ఫ్లైఓవర్ నుంచి విశాఖ నగరంలోకి వాహనాలను, అనకాపల్లి నుంచి లంకెలపాలెం, పరవాడ, దేశపాత్రునిపాలెంల నుంచి భారీ వాహనాలను అనుమతించరు. ఈ వాహనదారులు సబ్బవరం–పెందుర్తి– ఆనందపురం హైవేపే వెళ్లాల్సి ఉంటుంది. అలాగే పెందుర్తి నుంచి నగరంలోకి వాహనాలు రావడానికి వీల్లేదు. ఇక నగర పరిధిలోని మద్దిలపాలెం ఇంజినీరింగ్ కాలేజీ ఆర్ట్స్ కాలేజీ నుంచి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ వైపు వీఐపీ వాహనాలు తప్ప ఇతర వాహనాలను, పాదచారులను సైతం అనుమతించరు.