Tirupati Police | 'క్యూ ఆర్ కోడ్' తో యాత్రికులకు పోలీస్ సెక్యూరిటీ
తిరుపతి పోలీసులు రాష్ట్రంలో మొదటిసారి ఆటోలకు డిజిటల్ నంబర్లు కేటాయించారు. క్యూ ఆర్ కోడ్ తప్పనిసరి చేశారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-06-16 13:35 GMT
తిరుపతి నగరం, ప్రధానంగా యాత్రికుల భద్రత కోసం ఫోకస్ పెట్టారు. అందుబాటులోని సాంకేతిక పరిజ్ణానం సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో మొదటిసారి ఆటోలకు డిజిటల్ నంబర్లు కేటాయించే కార్యక్రమానికి సోమవారం శ్రీకారం చుట్టారు. క్యూ ఆర్ కోడ్ ( Q R Code stickers ) అమర్చారు. ఇప్పటికే తిరుపతి నగరంపై సీపీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.
ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక నగరం తిరుపతి. దేశ, విదేశాల నుంచి రోజూ లక్ష మంది యాత్రికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన నగరంలో యాత్రికుల భద్రతపై పోలీసులు ఫోకస్ పెట్టారు. వాహనాలకు డిజిటల్ నంబర్లు అమర్చారు. దీనికోసం ప్రత్యేకంగా క్యూ ఆర్ కోడ్ స్టిక్కర్లు తయారు చేయించిన తిరుపతి ఎస్పీ హర్ణవర్థనరాజు సోమవారం ఈరోజు తిరుపతి ఏ ఆర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద ఆటో డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎస్పీ హర్ణవర్థనరాజు మాట్లాడారు.
"ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా తాము ప్రయాణిస్తున్న ఆటోల పూర్తి వివరాలను ప్రయాణికులకు అందుబాటులో ఉంచడమే ప్రధాన లక్షం" అని ఎస్పీ హర్షవర్ధనరాజు చెప్పారు.
"యాత్రికులు గమ్యస్థానాలకు చేరడానికి భరోసా కల్పించడమే ఈ డిజిటల్ నెంబర్లు కేటాయించిన ముఖ్య ఉద్దేశం. ఇందులో డ్రైవర్, అద్దె ఆటో అయితే యజమాని పూర్తి వివరములతో A4 సైజ్ Display board QR Code తో కూడిన 2 sticker's ను ఇచ్చామని ఎస్పీ హర్షవర్ణనరాజు తెలిపారు.
ప్రయాణికులు ఆలోటో వెళ్లే సమయంలో ఆటో డ్రైవర్ పూర్తి సమాచారంతో కూడిన QR కోడ్ ఉంటుంది. ఆ కోడ్ స్కాన్ చేసి, ఇబ్బందులు ఎదురైనా, లేదా ప్రమాదం జరిగినా వెంటనే పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం అందించే విధంగా సాంకేతిక అంశాలతో తయారు చేయించినట్లు ఆయన వివరించారు.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే..
ఆండ్రాయిడ్ ఫోన్ లో ఆటోకు అమర్చిన క్యూ ఆర్ కోడ్ ను గూగుల్ లెన్స్ ద్వారా స్కాన్ చేయడానే options కనిపిస్తాయి.
1. ఆటో డ్రైవర్, ఓనర్ పూర్తి విరాలు ప్రింట్ తీసుకోవచ్చు
2. ఆటోలో ప్రయాణించే సమయంలో తమ కుటుంబ సభ్యులకు QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఏ వాహనంలో ప్రయాణిస్తున్నామో WhatsApp ద్వారా షేర్ చేయవచ్చు
3. ప్రయాణికులు ఒక చోట నుంచి గమ్యస్థానానికి సంబంధించిన లొకేషన్ అత్యవసర సమయంలో Track లోకేషన్ ఎంచుకోవడమే ఆలస్యం. వెనువెంటనే ఆ సమాచారం పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందుతుంది. ఇప్పటికే ఈ సాంకేతిక వ్యవస్థను కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు.
4. ప్రయాణ సమయంలో ఆటో డ్రైవర్ ప్రవర్తన, తీరుపై కూడా అభిప్రాయం, రేటింగ్ ఇచ్చే సదుపాయం ఈ క్యూఆర్ కోడ్ లో ఉంటుంది.
చోరీ జరిగితే...
1. ఆటోలో ప్రయాణించే సమయంలో విలువైన వస్తువులు మరిచిపోయాని దిగులు అవసరం లేదు. ఆటో డ్రైవర్ ఏదైనా ఇబ్బంది పెట్టినా, పోలీస్ కంట్రోల్ రూమ్ వాట్సప్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు.
2. ఆటోల ప్రయాణం చేసేటప్పుడు అత్యవసర సాయం అవసరమైతు 112 కు కాల్ చేయవచ్చు.
3. ఆటోలో ప్రయాణించే సమయంలో ప్రయాణికుడు ఏ అవసరమై క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడమే ఆలస్యం. సమీపంలోని పోలీస్ స్టేషన్ తోపాటు పోలీస్ అధికారుల నంబర్లు కనిపిస్తాయి. వెంటనే వారికి కాల్ చేస్తే సాయం అందిస్తారు.
ఆటో డ్రైవర్లు ఏమి చేయాలంటే..
తిరుపతి, పరిసర ప్రాంతాల్లో ఆటోలు నడిపే డ్రైవర్లు పోలీస్ నిబంధనలు పాటించాలని ఎస్పీ హర్షవర్ధనరాజు సూచించారు. ఆటోలకు డిజిటల్ నంబర్ల కోసం డ్రైవర్ లేదా ఓనర్ వాహనం వివరాలతో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలన్నారు. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ సైజు ఫొటోలు ట్రాఫిక్ పోలీసులకు అందించాలి. ఆ వివరాలను పోలీసు ప్రత్యేకమైన వెబ్ సైట్ లో పొందుపరస్తారు. ఆ వివరాలతో కూడిన ఒక QR Code ను రూపొందించి ప్రత్యేకమైన డిజిటల్ నెంబర్ కలిగిన స్టిక్కర్ ను ఆటో డ్రైవర్/ఓనర్ కు ఇస్తామని ఎస్పీ వివరించారు.
అదనపు ఎస్పీలు కె. రవిమనోహరాచారి (శాంతి భద్రతలు) నాగభూషణరావు (క్రైమ్), డీఎస్పీలు రామకృష్ణాచారి (ట్రాఫిక్) శ్యాంసుందర్ (క్రైమ్స్) భక్తవత్సలం(తిరుపతి టౌన్), చంద్రశేఖర్ (ఏఆర్) సీఐలు సంజీవకుమార్, సుబ్బారెడ్డి (ట్రాఫిక్) పాల్గొన్నారు.
ఎన్ని వేల ఆటోలంటే..
తిరుపతి నగరంలో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయింది. వాహనాల సంఖ్య కూడా రెట్టింపు అయింది. అందులో ప్రధానంగా నగరంలో మాత్రమే ఐదు వేల ఆటోలు ఉన్నట్లు ఆర్టీఏ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. పొరుగు ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి, పోలీస్ స్టిక్కర్ లేకుండా తిరిగే వాహనాలకు లెక్కలేదు. ఇది ఇలా ఉంటే, రేణిగుంట, చంద్రగిరి, రామచంద్రాపురం, తిరుచానూరు నుంచి నగరంలోకి వచ్చే ఆటోలతో కలిపితే దాదాపు ఏడు వేల వరకు ఉంటాయనేది ట్రాఫిక్ పోలీసుల అంచనా.
"ప్రస్తుతం తిరుపతి నగరంలోని ఆటోలకు మాత్రమే డిజిటల్ నంబర్ల అమరుస్తున్నాం. క్యూ ఆర్ కోడ్ స్టిక్కర్లు అమర్చడానికి ఆటో డ్రైవర్లు రికార్డులు అందివ్వాలి" అని ట్రాఫిక్ సీఐ పీసీవి.సుబ్బారెడ్డి కోరారు. ప్రస్తుతానికి పట్టణానికి మాత్రమే దీనిని అమలు చేస్తున్నాం. భవిష్యత్తులో ఇది శివారు పట్టణాలు, మండలాలకు కూడా పోలీస్ శాఖ విస్తరిస్తుందని సీఐ సుబ్బారెడ్డి అంటున్నారు.