Chittoor Mango | తిరుపతిలో మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయండి

జిల్లాలో రైతుల కష్టాలు తీర్చాలని కేంద్ర వ్యవసాయ మంత్రికి తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి విన్నవించారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-06-28 05:50 GMT

మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు.

చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్రంలో మామిడి రైతుల కష్టాలను వివరిస్తూ, రాసిన లేఖను తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి మీడియాకు విడుదల చేశారు. దేశంలోనే అత్యధికంగా 12.35 లక్షల ఎకరాల్లో మామిడి సాగు జరిగే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోందన్నారు. ఇది దేశ మామిడి సాగు విస్తీర్ణంలో 16.5 శాతం వాటాను కలిగి ఉందని, అయితే విస్తీర్ణంలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉండడం సాగు పరంగా పలు మౌలిక సమస్యలను సూచిస్తోందని పేర్కొన్నారు.

చిత్తూరు రైతులకు తీరని కష్టం
చిత్తూరు జిల్లాలో విస్తృతంగా సాగు అయ్యే తోతాపురి మామిడి ధరలు భారీగా క్షీణించడంతో రైతులు నష్టపోతున్నారని ఎంపీ గురుమూర్తి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మామిడి మద్దతు ధర కిలోకు రూ.12 ఉన్నప్పటికీ రైతులు కిలో కేవలం రూపాయి నుంచి నాలుగు రూపాయలకు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని, ఇది పంట పెట్టుబడులు కూడా దక్కని దుస్థితి అని వివరించారు. మామిడి కోత కూలీల కోసం చేసిన ఖర్చులు కూడా అందకుండా పోవడంతో చెట్లపైనే మామిడిని వదిలేసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి ధర పతనంతో ఉత్పన్నమైన పలు కారణాల వలన చిత్తూరు-తిరుపతి ప్రాంతంలో ఉన్న 52 మామిడి ప్రాసెసింగ్ యూనిట్లలో 28 యూనిట్లు మూతపడినట్లు లేఖలో వివరించారు.
లాభాలు కూడా లేవు..
దేశ మామిడి ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ 20% వాటా కలిగి ఉన్నా, రైతులు ఆ తాయిలో లాబాలను అందుకోలేకపోతున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తోతాపురి మామిడిని ₹12 మద్దతు ధరకు కొనుగోలు చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని, కేంద్ర వ్యవసాయ ధరల సంఘం, సిసిఇఎ ( CCEA ) సమన్వయంతో ప్రత్యేక పథకం తీసుకురావాలని కోరారు.
మ్యాంగో బోర్డు అవసరం
ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం తిరుపతిలో "నేషనల్ మ్యాంగో బోర్డు" ఏర్పాటు చేయాలని, ఇది ధరల స్థిరీకరణ, మార్కెట్ అభివృద్ధి, ఎగుమతుల ప్రోత్సాహం, రైతు సమాఖ్యలకు మద్దతు వంటి కార్యకలాపాలు నిర్వహించగలదని సూచించారు. అలాగే చిత్తూరు జిల్లాలో "జాతీయ మామిడి పరిశోధనా కేంద్రం" ఏర్పాటు చేసి పంట దిగుబడి మెరుగుదల, తెగులు నివారణ, వాతావరణ అనుకూల సాగు పద్ధతులపై పరిశోధనలు చేయాలని కోరారు. ఈ ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న రైతు ఆదాయం రెట్టింపు, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలకు అనుగుణంగా ఉంటాయని ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు.

Similar News