తిరుపతి: గోవిందుడి బ్రహ్మోత్సవ వైభవం
గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ధ్వజపటం ఎగురవేయడం ద్వారా ఈ కార్యక్రమాలు ప్రారంభించారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-06-02 04:31 GMT
తిరుపతి ఒకప్పుడు గోవిందరాజపట్నం. జగద్గురు రామానుజాచార్యులు 24.02.1130లో తిరుపతికి శంకుస్థాపన చేసినట్లు శాసన ఆధారాలు ఉన్నాయి. 900 శతాబ్దాల చరిత్రకు చెరగని గుర్తుగా ఉన్న గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం ( Tiruamala Tirupati Devasthanam TTD) ఆధీనంలోని ఆలయాల్లో ఏడాది పొడవునా, ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు సాగుతూ ఉంటాయి.
తిరుపతిలో శ్రీగోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల లు సోమవారం ఉదయం 07.02 - 07.20 గంటల మధ్య మిథున లగ్నంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ గరుడచిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీవారి ఆస్థానం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాలు వేదపండితులు నిర్వహిస్తుండగా, పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి పర్యవేక్షించారు.
అంతకుముందు శ్రీగోవిందరాజస్వామివారు, ధ్వజపటం, చక్రత్తాళ్వార్, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడవీధుల్లో విహరించారు. ఈ ఊరేగింపు ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి. అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తు హోమం, గరుడలింగ హోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షా బంధనం చేపట్టారు. మిథున లగ్నంలో శ్రీగోవిందరాజస్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఎన్ని దానాలు చేసినా ధ్వజారోహణకార్యంలో గరుడారోహణం చేసిన పుణ్యంతో సాటిరాదని పురాణాలు చెబుతున్నాయి. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడమే గరుడపటాన్ని ఎగురవేయడం.
"ఇది సమాజశ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుంది" అని వేదపండితులు విశ్లేషించారు.
బ్రహ్మోత్సవాలకు టిటిడి ఏర్పాట్లు
శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా టిటిడి ఏర్పాట్లు చేపట్టింది. మూలవిరాట్ తోపాటు వాహనసేవలను భక్తులు సంతృప్తిగా దర్శించుకునేందుకు వీలుగా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టారు. ప్రధానంగా జూన్ ఆరో తేదీన గరుడ వాహనం, జూన్ 9న రథోత్సవం, జూన్ 10న చక్రస్నానం జరుగనున్నాయి. వాహనసేవల సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులతో సమన్వయం చేసుకునేలా చర్యలు చేపట్టారు. వాహనసేవలను భక్తులు తిలకించేందుకు వీలుగా రైల్వేస్టేషన్, విష్ణునివాసం, గోవిందరాజస్వామి పుష్కరిణి ప్రాంతాల్లో డిజిటల్ స్క్రీన్లు (ఎల్ఈడి)లు ఏర్పాటు చేశారు. ఆలయం, పరిసర ప్రాంతాలను విద్యుద్దీపాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. క్యూల క్రమబద్ధీకరణ కోసం తగినంత మంది శ్రీవారి సేవకులను కేటాయించారు. భక్తులకు అన్నప్రసాదాలు, వాహన సేవల్లో మజ్జిగ, తాగునీరు పంపిణీకి ఏర్పాట్లు చేశారు. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో వాహనసేవల ముందు ఆకట్టుకునేలా నిపుణులైన కళాకారులతో భజనలు, కోలాటాలు, ఇతర సాంస్క తిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ఉత్సవాల్లో మొదటిరోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కల్యాణమండపంలో స్నపనతిరుమంజనం వేడుకగా జరుగనుంది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్లరసాలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేస్తారు.
సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ, రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహన సేవ జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు రాత్రి 07 గంటల నుండి 9.00 గంటల వరకు పెద్దశేషవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు.
పెద్ద శేష వాహనం విశిష్టత
పెద్ద శేషుడు ఏడుకొండలకు, ఏడులోకాలకు సంకేతంగా ఏడుపడగలు గల ఆదిశేషుడు. వాహనరూపంలో శ్రీగోవిందరాజ స్వామిని స్తుతిస్తూ, స్వామికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి 'శేషశాయి' అనే పేరును సార్థకం చేస్తున్నాడు. శ్రీవారికి విశ్రాంతికీ, సుఖనిద్రకూ కారణమవుతున్నాడు. తనను, శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలే నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు ప్రబోధిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో విఆర్. శాంతి , ఏఈవో కె.మునికృష్ణారెడ్డి , శ్రీవారి సేవకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.