TIRUPATI | మోహినీగా మురిపించిన గోవిందరాజస్వామి
తిరుపతిలో శ్రీగోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి,.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-06-06 12:16 GMT
టీటీడీ ఆధ్వర్యంలో ఏడాది పొడవునా ఉత్సవాలకు కొదవలేదు. నిత్యం వేదమంత్రాలు ఘోషిస్తుంటాయి. అందులో భాగంగానే
తిరుపతిలో శ్రీగోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదవ రోజైన శుక్రవారం ఉదయం గోవిందరాజస్వామివారు పల్లకీపై మోహినీ అవతారంలో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం రాత్రి పల్లకిపై ఆశీనుడైన గోవిందరాజస్వామి మాడవీధుల్లో ఊరేగుతూ, దర్శనం ఇస్తున్నారు.
అలరిస్తున్న కళారూపాలు
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు శ్రీగోవిందరాజస్వామివారి వాహన సేవల ముందు ప్రదర్శనలు కనువిందు చేస్తున్నాయి. భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, కేరళ కళాకారుల డ్రమ్స్, మంగళవాయిద్యాల నడుమ పల్లకీ ఉత్సవం సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
మోహినీ అవతారం ఎందుకంటే..
మోహినీ అవతార వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణించారు. సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించారు. అందులో హేయమైన విషంతోపాటు ఉపాదేయమైన అమృతం, ఎన్నో మేలి వస్తువులు ఉద్భవించాయి. వివిధ దేవతలు వాటిని స్వీకరించారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభించింది. దానిని పంచుకోవడంలో కలహం తప్పలేదు. ఆ కలహాన్ని నివారించి అసురులను వంచించి సురులకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంతో సాక్షాత్కరించాడు. అసురులు సమ్మోహకమైన ఆమె క్రీగంటి చూపులకు పరవశులైపోయారు. తత్ఫలితంగా వారు వంచింపబడడం, దేవతలు అనుగ్రహింపబడడం జరిగింది.
అనంతరం ఉదయం 10 నుంచి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్ళతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమాలను టిటిడి డిప్యూటీ ఈఓ విఆర్.శాంతి, ఏఈవో మునికృష్ణారెడ్డి, ఆలయ అధికారులు పర్యవేక్షించారు.