TIRUMALA | శ్రీవారి సేవ, సనాతనధర్మం ఎలా వ్యాప్తి చేద్దాం...
విభిన్న అంశాల అజెండాతో టిటిడి బోర్డు మంగళవారం అత్యవసరంగా సమావేశమైంది.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-06-17 06:48 GMT
శ్రీవారి వైభవం, సనాతనధర్మం మరింత విస్తృతం చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati devasthanam TTD ) సంకల్పించింది. ఈ రెండు ప్రధాన అంశాలుగా టీటీడీ పాలక మండలి మంగళవారం అత్యవసరంగా సమావేశమైంది. తిరుమల అన్నమయ్య భవన్లో మంగళవారం ఉదయం టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. సాధారణంగా టిటిడి బోర్డు చేపట్టే చర్చనీయ అంశాలకు విభిన్నంగా అజెండాను ఎంచుకుంది.
తిరుమలలో ప్రతినెల టిటిడి బోర్డు మీటింగు జరుగుతుంది. అందులో యాత్రికుల సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అంశాలను అజెండాగా తీసుకుంటారు. ఈరోజు ఉదయం ప్రారంభమైన టిటిడి బోర్డు అత్యవసర సమావేశంలో తిరుమల శ్రీవారి వైభవాన్ని మరింత విస్తృతం చేయడానికి అనుసరించాల్సిన విధానాలను ఇందులో చర్చించనున్నారు. ఇదే విధంగా సనాతనం ధర్మం మరింత గా ప్రచారం చేపట్టడానికి ఈ సమావేశంలో చర్చించనున్నారు.
టిడిపి కూటమి ఏర్పడిన తర్వాత టిటిడి మొదటి చైర్మన్ గా బిఆర్ నాయుడు, అంతకుముందే ఈవోగా బాధ్యతలు చేపట్టిన జే శ్యామల రావు, అదన ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి ఎవరి సలహాలో వారు తిరుమలలో సంస్కరణల అమలుపై దృష్టిపెట్టారు. అందులో ప్రధానంగా లడ్డు ప్రసాదం తయారీలో నాణ్యత, తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో అన్న ప్రసాదాల తయారీలో కూడా నాణ్యమయిన సరుకులు వినియోగించడానికి దృష్టి సారించారు.
తిరుమలలో మంగళవారం ఉదయం ప్రారంభమైన టిటిడి అత్యవసర బోర్డు మీటింగ్ కు అందుబాటులోని సభ్యులతో పాటు ఈఓ, అదనపు ఈఓ, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్, జేఈవో హాజరయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు..
తిరుమలలో మరింతగా సంస్కరణలు తీసుకురావడానికి చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా తిరుమలలో సామాన్య యాత్రికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై కూడా చర్చించనున్నారు.
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం మరింత నాణ్యంగా తయారు చేయడానికి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాన్ని కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో గతంతో పోలిస్తే పరిస్థితి చక్కదిద్దామని అనేకసార్లు టీటీడీ చైర్మన్ వీఆర్ నాయుడుతోపాటు ఈవో శ్యామలరావు కూడా ప్రకటించారు. తరచూ వారిద్దరూ, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ఆకస్మిక తనిఖీలతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అన్నదాన సత్రంలో నాణ్యమైన పదార్థాలు వాడడం ద్వారా ఇంకా మెరుగుపరచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని అంశంపై కూడా ఈ సమావేశంలో సమీక్షిస్తున్నట్లు సమాచారం అందింది.
యాత్రికుల సేవలో
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే యాత్రికులకు మంచి దర్శనం కల్పించడానికి ఇంకా ఎలాంటి పద్ధతులు అనుసరించాలి అనే విషయంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. వేసవి సెలవులు ప్రధానంగా శుక్రవారం శ్రీవారికి అభిషేక సేవ ఉన్నప్పటికీ సాధారణ రోజుల కంటే అదనంగా పదివేల మంది యాత్రికులకు స్వామివారి దర్శనం కల్పించడంలో సఫలం అయినట్లు టీటీడీ అధికారులు, పాలకమండలి ప్రకటించింది. ఈ ఒరవడిని కొనసాగిస్తూ, ఇప్పటికే యాత్రికుని నుంచి ఫీడ్ బ్యాక్ మేనేజ్మెంట్ సిస్టం టిటిడి ఇటీవల ప్రవేశపెట్టింది. దీని ద్వారా అందిన సలహాలు సూచనలను ఈ సమావేశంలో సమీక్షించి, భవిష్యత్తులో ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలని అంశంపై ప్రత్యేకంగా దృష్టి నిలిపినట్లు తెలుస్తోంది.
టీటీడీ ఆలయాలు, అంతర్జాతీయంగా సేవలను వినియోగించుకోవడం కోసం సూచనలు చేయాలని టిటిడి గతంలో నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చేసే సూచనల ద్వారా శ్రీవారి సేవలో ఇలాంటి కార్యక్రమాలు అమలు చేయాలని విధానాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాసంస్థలు, ఐటీ, ఇతర సేవా కార్యక్రమాలపై అంతర్జాతీయంగా సేవకుల సహకారం చేసుకునేందుకు గతంలోనే టీటీడీ జూమ్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించింది. అంతర్జాతీయంగా వివిధ దేశాల నుంచి స్వచ్ఛంద సేవ అందించడానికి ముందుకు వచ్చిన వారి సూచనలు కూడా ఇందులో సమీక్షించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది