తిరుమల:శాటిలైట్ ఆధారంగా యాత్రికుల గణన..
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 24న సీఎం పట్టువస్త్రాల సమర్పణ: టీటీడీ చైర్మన్.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-09-16 12:35 GMT
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు జరుగనున్నాయి. ఈ ఏడాది శాటిలైట్ ఆధారంగా మొదటిసారి యాత్రికుల సంఖ్యను లెక్కించడానికి ఇస్రో సహకారం తీసుకున్నారు. ఆ మేరకు భక్తులకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్. నాయుడు చెప్పారు. శ్రీవారికి ఈనెల 24వ తేదీ సీఎం నారా చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పిస్తారని, ఆ రోజు రాత్రి జరిగే శ్రీవారి పెదశేష వాహన సేవలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని ఆయన వెల్లడించారు.
తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ పాలక మండలి భేటీ
తిరుమల అన్నమయ్య భవన్ లో మంగళవారం మధ్యాహ్నం టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు అధ్యక్షతన టిటిడి పాలక మండలి సమావేశం జరిగింది. అనంతరం ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరితో కలిసి చైర్మన్ నాయుడు మీడియాకు వివరించారు.
బోర్డు నిర్ణయాలు ఇవి..
బోర్డు నిర్ణయాలు వివరిస్తున్న టీటీడీ చైర్మన్ బీఆర్.నాయుడు, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్
ఈ నెల 23వ తేదీ సాయంత్రం 7 గంటలకు అంకురార్పణతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.సెప్టెంబర్ 24వ తేదీ సాయంత్రం 5.43 గంటల నుంచి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగుతుంది.
బ్రహ్మోత్సవాలలో భాగంగా సెప్టెంబర్ 24వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎం నారా చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నాం. అదే రోజు రాత్రి 9 గంటలకు శ్రీవారు పెద్దశేష వాహనంలో ముఖ్యమంత్రివర్యులు పాల్గొంటారు.
తిరుమలలో ప్రారంభోత్సవాలు
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే సీఎం నారా చంద్రబాబు 24వ తేదీ రాత్రి తిరుమలలోనే బస చేస్తారు. మరుసటి రోజు సెప్టెంబరు 25వ తేదీ యాత్రికుల సదుపాయం కోసం నిర్మాణం పూర్తి చేసిన పిఏసి- 5 (ublic Amenities Complex) తోపాటు, శ్రీవెంకటాద్రి నిలయాన్ని ప్రారంభిస్తారు. 2026వ సంవత్సరం టీటీడీ క్యాలెండర్లు, డైరీలను సీఎం నారా చంద్రబాబు ఆవిష్కరిస్తారు.
ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు ఇస్రో సహకారంతో శాటిలైట్ ఆధారంగా భక్తుల సంఖ్యను గణన చేసేందుకు చర్యలు తీసుకున్నారు.
విశేష అలంకరణ
తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా పుష్పాలంకరణ చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు తెలిపారు.
"తిరుమలలో దేవతామూర్తుల ఆర్చిలు, ఎల్ఇడి తోరణాలు, అన్ని ప్రధాన కూడళ్ళలో పెద్ద ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నాం" అని బీఆర్. నాయుడు చెప్పారు.
ప్రత్యేక దర్శనాల రద్దు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సల సందర్భంగా ఈ నెల 23వ తేదీ నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు కొన్ని దర్శనాలు టీటీడీ పాలక మండలి రద్దు చేసింది.
"దివ్యాంగులు, వయోవృద్ధులు, ఎన్ఆర్ఐ, చిన్నపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేశాం. బ్రేక్ దర్శనాలు కేవలం ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశాం" అని టీటీడీ చైర్మన్ నాయుడు వెల్లడించారు.
లడ్డూ ప్రసాదాల నిలువ
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులకు లడ్డూ ప్రసాదాలకు కొరత లేకుండా టీటీడీ చర్యలు తీసుకుంది. అందులో భాగంగా బ్రహ్మోత్సవాల వేళ రోజూ ఎనిమిది లక్షల లడ్డూ ప్రసాదాలు అందుబాటులో ఉంచడానికి ఏర్పాటు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. ఈ నెల 28న గరుడసేవ జరుగుతుందని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు చెప్పారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా
"ఈ నెల 27వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 29వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు తిరుమలకు ద్విచక్ర వాహనాలు అనుమతించం. అలిపిరి, శ్రీవారిమెట్టు నడకదారులు 28వ తేదీన రౌండ్ ద క్లాక్ తెరిచే ఉంటాయి" అని చైర్మన్ నాయుడు వివరించారు.
తిరుమలలో భద్రతా చర్యలు
బ్రహ్మెత్సవాల నేపథ్యంలో తిరుమలలో పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు వెల్లడించారు. తిరుమలలోని రద్ధీ ప్రాంతాల్లో అదనపు సిసి కెమెరాల ఏర్పాటు.
బ్రహ్మోత్సవాలలో చిన్న పిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగింగ్. నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు చర్యలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు స్వామివారి వాహనసేవలను వీక్షించేలా హెచ్డీ క్యాలిటీతో నాణ్యంగా ప్రత్యక్ష ప్రసారం. గరుడసేవ రోజు రాత్రి నాలుగు లక్షల మజ్జిగ ప్యాకెట్లు భక్తులకు అందించేందుకు చర్యలు.
ఆలయాల నిర్మాణం
1. టీటీడీ శ్రీవాణి ట్రస్టు నిధులతో కర్ణాటక రాష్ట్రం బెలగావిలోని కొలికోప్ప గ్రామంలో ఏడు ఎకరాలలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయం నిర్మించేందుకు టీటీడీ పాలక మండటి ఆమోదించింది.
2. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం అనంతవరం గ్రామంలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రూ. 7.20 కోట్లతో రాజగోపురం, ముఖ మండపం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ఆభరణాలు, అదేవిధంగా ఆలయంలో తాగు నీటి సౌకర్యం, ఆర్చి, మరుగుదొడ్లు, తదితర అభివృద్ధి కార్యక్రమాలు దశలవారిగా చేపట్టేందుకు నిర్ణయం.
3. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలోని శ్రీపట్టాభిరామస్వామివారి ఆలయ పుష్కరిణి, కల్యాణ వేదిక మండపం, రాజగోపురం, ఆర్చి, కల్యాణ మండపం తదితర అభివృద్ధి పనులకు రూ.5.73 కోట్లు, తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి పుష్కరిణి పునః నిర్మాణానికి రూ.1.50 కోట్లతో పనులు చేపట్టేందుకు నిర్ణయం.
4. హైదరాబాద్కు చెందిన శ్రీ బద్రి వెంకటరెడ్డి, శ్రీ బద్రి విష్ణువర్ధన్ రెడ్డిలు గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం కాజా గ్రామంలో సర్వే నంబరు 141-2లో రూ.89.54 లక్షల విలువ చేసే 0.74 సెంట్ల స్థలాన్ని దాతలు టీటీడీకి విరాళంగా అందించారు. సదరు భూమిని స్వీకరించేందుకు ఆమోదం.
వెయ్యి ఆలయాల నిర్మాణం
శ్రీవేంకటేశ్వరస్వామి వైభవాన్ని మరింత విస్తృతం చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన వెల్లడించారు. సీఎం నారా చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్రంలోని వెయ్యి దళితవాడల్లో మొదటి దశలో శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎం.ఎస్.రాజు, పనబాక లక్ష్మి, నర్సిరెడ్డి, సదాశివరావు, జానకి దేవి, జంగా కృష్ణమూర్తి, శాంతా రామ్, సుచిత్ర ఎల్లా, రంగశ్రీ ఇతర బోర్డు సభ్యులు పాల్గొన్నారు.