Tirumala Laddu | సిట్ అదుపులో.. టీటీడీ మాజీ చైర్మన్ పీఏ

తిరుపతిలో ఉదయం నుంచి విచారణ చేస్తున్నారు. తరువాత మరో ఇద్దరు కీలక నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-06-04 08:47 GMT

తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారనే కేసులో దర్యాప్తు నత్తనడకనే సాగుతోంది. తాజాగా టీటీడీ మాజీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అప్పన్నను సిట్ ( Special Investigation Team SIT) అదుపులోకి తీసుకుంది. అలిపిరికి సమీపంలోని తాత్కాలిక సిట్ కార్యాలయంలో అప్పన్నను విచారణ చేస్తున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో నెయ్యి సరఫరా చేసిన నలుగురు డెయిరీల నిర్వాహకులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారి నుంచి లభించిన ఆధారాల నేపథ్యంలో టీటీడీలో కీలక బాధ్యతలు నిర్వహించిన వైసీపీ నేతలను కూడా విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక టీడీఎల్పీ సమావేశంలో గత ఏడాది జూన్ లో సీఎం ఎన్. చంద్రబాబు మాట్లాడుతూ,
"తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో గొడ్డు కొవ్వు వంటి పదార్థాలు కలిపారు" అని చేసిన వ్యాఖ్యానాలతో కలకలం చెలరేగింది.
ఈ పరిణామంపై కల్తీ నెయ్యి వాడారా? ఆ నెయ్యి ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? అనే అంశాలపై దర్యాప్తు చేయడానికి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సారధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. వీరి దర్యాప్తు ప్రాధమిక స్థాయిలో ఉండగానే, ఈ అంశం సుప్రీం కోర్టుకు చేరింది.
సీబీఐ, రాష్ట్ర పోలీసు అధికారులతో కూడిన బృందంతో సుప్రీం కోర్టు సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.ద దీంతొ సీబీఐ హైదరాబాద్ డివిజన్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు, విశాఖ ఎస్పీ మురళీరాంబతో పాటు ఏపీ నుంచి డీఐజీ గోపీనాథ్ జెట్టి, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారి సత్యకుమార్ పాండా ఆధ్వర్యంలో విచారణకు రంగంలోకి దిగారు.
నలుగురి అరెస్టు
కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు చేసిన అధికారులు తమిళనాడులోని ఏఆర్ డెయిరీ, ఉత్తర ప్రదేశ్ లోని పరాగ్ డెయిరీ, ప్రీమియర్ అగ్రిఫుడ్స్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంస్థల కీలక వ్యక్తులను అరెస్టు చేశారు.
వారిని విచారణ చేసిన సమయంలో అసలు ఆ సంస్థలకు పాలసేకరణ సామర్థ్యం లేకపోవడం, వివిధ మార్గాల్లో సేకరించిన పాలతో నెయ్యి తయారీలో జరిగిన అక్రమాలను సిట్ అధికారులు గుర్తించారు. దీంతో ఆ నలుగురు ప్రతినిధిలను అరెస్టు చేయడం ద్వారా చార్జిషీట్ దాఖలు చేశారు.
ఇక మాజీల వంతు
తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో సిట్ దర్యాప్తు బృందం క్షేత్ర స్థాయి నుంచి మూలాలు ఛేదించుకుంటూ వచ్చింది. అక్కడ లభించిన ఆధారాలతో కేసు దర్యాప్తు నత్తనడకన సాగుతున్నప్పటికీ, కీలకమైన వ్యక్తుల ప్రమేయంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు ఈ బృందంలోని సభ్యుడు ఒకరు చెప్పారు.
2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైసీపీ కాలంలోనే టీటీడీలో జరిగిన అక్రమాలపై టీడీపీ కూటమి ఫోకస్ పెట్టింది. దీంతో నెయ్యి సరఫరా చేసిన సంస్థలు, బాధ్యులను అరెస్టు చేసిన సీబీఐ సిట్ వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజ్యసభ సభ్యుడు వైవీ. సుబ్బారెడ్డి, ఆ తరువాత తిరుపతి మాజీ ఎమ్మెల్యే బి. కరుణాకరరెడ్డి టీటీడీ చైర్మన్లుగా పనిచేశారు. అదనపు ఈఓగా బాధ్యతలు చేపట్టిన ఏవీ. ధర్మారెడ్డి పాలనలో కల్తీ నెయ్యి వ్యవహారం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
పీఏ విచారణ
టీటీడీ మాజీ చైర్మన్, ప్రస్తుత వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి. సుబ్బారెడ్డిపై సీబీఐ సిట్ దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఆయనకు పీఏగా పనిచేసిన అప్పన్నను సిట్ అదుపులోకి తీసుకున్నది. ఆయనను అలిపిరికి సమీపంలోని సిట్ తాత్కాలిక కార్యాలయంలో ఉదయం నుంచి విచారణ చేస్తున్నట్లు తెలిసింది. అప్పన్న ఢిల్లీ స్థాయిలో వ్యవహారాలను చక్కదిద్దడం, వైవీ. సుబ్బారెడ్డి ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షించారని సిట్ సందేహిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వైవి. సుబ్బారెడ్డిని పిలవడానికి ముందు ఆయన పీఏ అప్పన్నను అదుపులోకి తీసుకున్నారని కనిపిస్తోంది.
త్వరలో వారికీ నోటీసులు
కల్తీ నెయ్యి కొనుగోలు చేసిన వ్యవహారంలో టీటీడీలో పనిచేసిన కీలక నేతలు, అధికారులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ కోవలో టీటీడీ మాజీ చైర్మన్ వైవి. సుబ్బారెడ్డి, మాజీ ఈఓ ఏవీ. ధర్మారెడ్డి, ఆ తరువాత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News