తిరుమల: మరింత అలర్ట్ గా ఉండాలంటున్న డీజీపీ
యాత్రికుల రక్షణ, ఆలయ భద్రతకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించాలని డీజీపీ ఆదేశించారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-05-30 09:26 GMT
దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తిరుమలలో భద్రతలో మరింత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ హరిష్ కుమార్ గుప్తా ఆదేశించారు. పోలీస్ శాఖలోని కీలక విభాగాల అధిపతులు, టీటీడీ ఈఓ జె. శ్యామలరావు, సీవీఎస్ఓతో తిరుమల అన్నమయ్య భవన్ లో శుక్రవారం ఉన్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర పోలీస్ విభాగంలోని కీలక అధికారులతో ఈ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమీక్షలో అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) సుధాకర్ రెడ్డి, అడిషనల్ డీజీ (ఇంటలిజెన్స్) మహేష్ చంద్ర లద్దా, అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ శేముషి, ఐఎస్ డబ్ల్యూ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, డీఎఫ్ఓ వివేక్ ఆనంద్, వివిధ భద్రతా బలగాల అధికారులు హాజరయ్యారు.
ఈ సమీక్షలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడారు.
"తిరుమల క్షేత్రం, యాత్రికులకు ఎలాంటి ముప్పు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి" అని ఆదేశించారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (Standard Operating Procedure -SOP ) రూపొందించాలని ఆయన సూచించారు. ఈ విధానం ద్వారా సమర్థవంతంగా సమాచారం అందుకోవడం, సమయానుకూలంగా వేగంగా స్పందిచడానికి సాధ్యం అవుతుంది. ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేయాలని డీజీపీ హరిష్ కుమార్ గుప్తా బాధ్యతలు గుర్తు చేశారు.
పాకిస్తాన్ ఉగ్రమూకల నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఆపరేషన్ సింధూర్ తో భారతసైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. దేశంలో స్లీపర్ సెల్స్ కదలికలపై కేంద్రం హోం శాఖ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. భద్రతా దళాలను ప్రధానంగా దేశ భద్రతకు సంబంధించిన కీలక సంస్థలు, ప్రధాన ఆలయాల వద్ద భద్రత మరింత కట్టుదిట్టం చేసే దిశగా పోలీస్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.
ఐదంచెల భద్రత
తిరుమల సాధారణంగా హై సెక్యూరిటీ జోన్ లో ఉంది. ఐదంచెల భద్రతా వ్యవస్థ 24/7 అప్రమత్తంగా ఉంటుంది. ఇందులో రిజర్వు బెటాలియన్, ఏపీఎస్పీదళాలు టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ (టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్), ఆ తరువాత ఎలాంటి పరిస్థితిని అయినా సరే ధీటుగా ఎదుర్కొని, క్షణాల్లో అదుపుచేసే శక్తిసామర్థ్యాలు ఉన్న అక్టోపస్ ( Octopus) దళాలు మెరుపుదాడులు చేయడానికి తిరుమలలో సంసిద్ధంగా ఉంటాయి. అయితే..
సమావేశం ప్రారంభంలో తిరుపతి ఎస్పీ, టీటీడీ ఇన్చార్జ్ సీవీఎస్వో హర్షవర్ధన్ రాజు భద్రతా అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తిరుమల భద్రతకు తీసుకుంటున్న చర్యలు, ఏర్పాట్లపై ఆయన డీజీపీ గుప్తాకు వివరించారు.
మెరుగైన భద్రత అవసరం
తిరుమల అన్నమయ్య భవన్ లో జరిగిన ఉన్నతస్థాయి భద్రతా సమీక్షలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, అంతర్జాతీయంగా తిరుమలకు ఉన్న ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని మెరుగైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడం అవసరమని గుర్తు చేశారు. ఏపీఎస్పీ, డీఏఆర్, ఎస్పీఎఫ్, హోంగార్డు, సివిల్ పోలీసు, టీటీడీ సెక్యూరిటీతోపాటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. వివిధ సెక్యూరిటీ ఏజెన్సీలకు స్థిరమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించడానికి శ్రద్ధ చూపాలని డీజీపీ గుప్తా ఆదేశించారు.
అలిపిరిపై దృష్టి
తిరుమలకు వెళ్లడానికి ప్రధాన ద్వారంగా ఉన్న అలిపిరి వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరాన్ని డీజీపీ గుప్తా గుర్తు చేశారు. నిషేధిత వస్తువులు, అసాంఘిక శక్తులను అక్కడే కట్టడి చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ, బహుళస్థాయి వాహన తనిఖీ వ్యవస్థ, డిఫెన్స్ ఏజెన్సీలతో కలిసి సెన్సార్ ప్లే సిస్టమ్, ఆధునిక భద్రతా పరికరాలు, సైబర్ భద్రత వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై కూడా డీజీపీ గుప్తా ప్రత్యేక సూచనలు చేశారు.
ఈ సమావేశంలో మాట్లాడిన టీటీడీ ఈఓ జె. శ్యామలరావు భద్రతపై అనుబంధ ఏజెన్సీలతో ఒక సమన్వయ వ్యవస్థ అవసరమని అభిప్రాయ పడ్డారు. తిరుమలలో సైబర్ భద్రతా వ్యవస్థను మరింతగా బలోపేతం చేయాలన్నారు. టీటీడీ అదనపు ఈఓ సిహెచ్. వెంకయ్య చౌదరి, టీటీడీ నిఘా, భద్రత అధికారులు, వివిధ విభాగాల టీటీడీ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.