ఈ ఏడాది వేసవి సమ్థింగ్ స్పెషల్ అనిపించుకుంటోంది. గతంలో ఎన్నడూ లేనన్ని ప్రత్యేకతలను మూటగట్టుకుంటోంది. ఎండల్లో హాయ్ హాయ్.. అనే పరిస్థితి ఏర్పడింది. ఎప్పడూ ఏప్రిల్లో విజృంభించే వేసవి ఛాయలు ఈసారి ఫిబ్రవరి ఆఖరి నుంచే మొదలయ్యాయి. మే నెలలో మలమల మాడ్చాల్సిన మండుటెండలు మనసు మార్చుకుని వర్షాలను కురిపిస్తున్నాయి. దీంతో భయపెట్టే తీవ్ర వడగాడ్పుల జాడే లేకుండా పోయాయి. ఇక జూన్ ఆరంభంలో తాకాల్సిన నైరుతి రుతుపవనాలు ఎనిమిది రోజులు ముందుగానే కేరళలోకి ప్రవేశించాయి. అన్నిటికీ మించి రోళ్లు పగిలిపోయేలాంటి ఎండలు కాస్తాయని చెప్పుకునే రోహిణి కార్తెలో చల్లచల్లని కూల్ కూల్గా వాతావరణం మారిపోయింది. ఎందుకిలా?
వేసవిలో విశాఖలో కురుస్తున్న వర్షం
గత శీతాకాలం కూడా చలి ప్రభావం లేకుండా సాదాసీదాగానే ముగిసింది. ఒక్క రోజు కూడా కోల్డ్ వేవ్ డే (అతి శీతల రోజు) నమోదు కాలేదు. పైగా హిందూ మహా సముద్ర జలాలు ఈ సంవత్సరం ఒకింత ముందుగానే వేడెక్కడం మొదలయ్యాయి. ఫిబ్రవరి ఆఖరు నుంచి ఎండల ప్రభావం చూపడంతో వేడెక్కాయి. మలేసియా మీదుగా వీచే ఈస్టర్లీ వేవ్స్ (తూర్పు గాలులు) చురుకుదనం సంతరించుకున్నాయి. ఫలితంగా నైరుతి రుతుపవనాలు తొలుత అండమాన్ సముద్రంలోకి పది రోజులు ముందుగానే ప్రవేశించాయి. క్రమంగా వేగం పుంజుకుని అవి ఎనిమిది రోజుల ముందే (జూన్ 1కి బదులు మే 24నే) కేరళను తాకాయి. అదే సమయంలో అరేబియా సముద్రం, బంగాళాఖాతాల్లో తీరం వెంబడి ద్రోణులు ఏర్పడి ఆకాశం మేఘావృతం కావడంతో పాటు వానలకు కారణమయ్యాయి. ఈ అనూహ్య వాతావరణ పరిస్థితుల నడుమ నిప్పులు కురిపించే అగ్ని కార్తె వచ్చి చల్లగానే వెళ్లిపోయింది తప్ప ఉష్ణ తీవ్రతను పెంచలేదు. ఇక వేసవి మొత్తమ్మీద అత్యంత ఉష్ణాన్ని వెదజల్లి బెంబేలెత్తించే రోహిణి కార్తె ఆదివారం నుంచి మొదలైంది. అయితే ఈసారి వచ్చిన రోహిణి కార్తె మునుపెన్నడూ లేనివిధంగా వేడికి బదులు చల్లదనాన్ని పరుస్తోంది. సాధారణంగా రోహిణి కార్తె ప్రభావం చూపే 15 రోజులూ ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగానే నమోదవుతుంటాయి. కానీ వచ్చే వారం పది రోజులూ ద్రోణి, అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తూ పగటి ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 3–5 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజాగా ప్రకటించింది. అంటే రోళ్లు పగిలేలా కాసే ఎండలు ఈ వేసవిలో లేనట్టేనని తేటతెల్లమైంది.
వేసవిలో విశాఖలో కురుస్తున్న వర్షం
44 డిగ్రీలకు మించనే లేదు..
ఈ ఏడాది వేసవి మొత్తమ్మీద ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా 44 డిగ్రీలకు (నంద్యాల జిల్లా గోనవరంలో) మించి ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. అది కూడా ఏప్రిల్ నెలలోనే. ఈసారి మే నెలలో 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని వాతావరణ నిపుణులు తొలుత అంచనా వేశారు. కానీ మారిన వాతావరణ పరిస్థితుల్లో అందుకు భిన్నంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఐఎండీ గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు వేసవి సీజనులో అత్యధికంగా గన్నవరం (విజయవాడ ఎయిర్పోర్టు)లో 2002 మే 11న 48.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. కాగా 2023లో 22, 2024లో 27 తీవ్ర వడగాడ్పుల రోజులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క రోజు కూడా తీవ్ర వడగాడ్పులు వీయలేదు. అలాగే వడదెబ్బకు ఏపీలో 2023లో 45 మంది, 2024లో 50 మందికి పైగా మరణించారు. ఈ వేసవిలో మాత్రం ఒక్క వడదెబ్బ మరణం కూడా సంభవించలేదు.
మే నెలలో మేఘావృతమైన విజయవాడ నగరం
యాభై ఏళ్లలో ఎప్పడూ లేదు..
గతంలో నైరుతి రుతుపవనాలు నిర్ణీత సమయంకంటే కొన్ని రోజులు ముందుగానే కేరళను తాకినా కొద్దిరోజులు చల్లగాను, రోహిణి కార్తెల వేళ ఉష్ణతీవ్రత చూపించిందని వాతావరణ నిపుణులు గుర్తు చేస్తున్నారు. కానీ ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా మే మాసమంతా వర్షాలు, మబ్బులతో చల్లదనాన్ని పరచిందని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో చెప్పారు. ‘గడచిన యాభై ఏళ్లలో తానెప్పుడూ ఇలాంటి కూల్ సమ్మర్ను చూడలేదు. ఎప్పుడైనా మే నెలలో తుపాన్లు ఏర్పడితే ఐదారు రోజులు చల్లదనమే తప్ప ఇంతలా ఎప్పుడూ లేదు. 2009లో నైరుతి రుతుపవనాలు తొమ్మిది రోజులు ముందుగా ఆన్సెట్ అయినా ఆ తర్వాత కూడా కొన్నాళ్లు ఆ నెలలో వడగాడ్పలు వీచాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు ఆగ్నేయం నుంచి గాలులు వీస్తుండడం, ఉత్తరాది నుంచి వేడి గాలులకు బదులు చల్లగాలులు వస్తుండడం చల్లదనానికి కారణమవుతోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి ఈ ఏడాది సెప్టెంబరుకు ముందే తుపాన్లు ఏర్పడే అవకాశం ఉంది. రుతుపవనాలు ముందుగా ప్రవేశిస్తే మంచి వర్షాలు కురవడానికి అనుకూల పరిస్థితులుంటాయి’ అని మురళీకృష్ణ వివరించారు.