తోతాపూరి మామిడి కొనుగోలుకు టోకెన్ల జారీ..

గుజ్జు పరిశ్రమల వద్ద కిలో రూ.12కు కొనుగోలుకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ చెప్పారు. రైతుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు ఇన్ చార్జి కలెక్టర్ వెల్లడించారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-06-17 14:35 GMT

జిల్లాలోని తోతాపూరి మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎవరు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హామీ ఇచ్చారు. అధికారులతో మంగళవారం సాయంత్రం ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సమస్యలు ఎదురైతే, సహాయం అందించడానికి వీలుగా హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసినట్లు ఇన్చార్జి కలెక్టర్ విద్యాధరి మీడియాకు చెప్పారు. 

హెల్ప్ లైన్ నంబర్లు:  08572-242777, 9491077325  సమస్య ఉంటే ఈ నంబర్లకు కాల్ చేయాలని ఇన్చార్జి కలెక్టర్ విద్యాధరి సూచించారు. ఇదిలావుండగా, 

సెలవులో ఉన్నప్పటికీ కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులతో మంగళవారం సాయంత్రం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 

"వాతావరణ పరిస్థితులు, రైతులు తీసుకున్న జాగ్రత్తలు వల్లే మామిడి దిగుబడి పెరిగింది" అని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, యుక్రేయన్ యుద్ధం వలన మామిడి పల్ఫ్ ఎగుమతి అనేది చాలావరకు తగ్గిందని అన్నారు.  తమిళనాడు కర్ణాటకలో క్రిష్ణగిరి మార్కెట్ నుంచి మార్కెట్ గుజ్జు పరిశ్రమల నుంచి పార్లే ,కోకోకోలా, పెప్సీ కంపెనీ వాళ్లు ఎక్కువగా కొనుగోలు చేశారని తెలిపారు. దాని కారణంగా గత రెండు సీజన్ లోను గుజ్జు నిల్వలు  ఉండిపోయాయని తెలిపారు.

మామిడి గుజ్జు పరిశ్రమలకు చేరిన కాయలు

జిల్లాలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, గుజ్జు పరిశ్రమలు ,రైతులు, రైతు సంఘాల నేతలతో సమీక్షించిన తరువాత సమస్య వివరించడంతోె సీఎం ఎన్. చంద్రబాబు ఆదేశాలతో మద్దతు ధర కిలోకి 12 రూపాయలుగా నిర్ణయించినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ చెప్పారు. మామిడి పక్వానికి వచ్చిన తరువాత కోయాలని రైతులకు సూచించారు.

హెల్ప్ లైన్ ఏర్పాటు

గుజ్జు పరిశ్రమల వద్ద ఎలాంటి సమస్య లేకుండా, రైతుల కోసం హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ జి. విద్యాధరి మంగళవారం సాయంత్రం మీడియాకు చెప్పారు. మామిడి కాయల కొనుగోలు వ్యవహారాల పర్యవేక్షణకు జిల్లా సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఇంచార్జ్ కలెక్టర్ జి. విద్యాధరి వెల్లడించారు. జిల్లాలోని మామిడి రైతులకు ఎలాంటి సందేహాలు ఉన్నా08572-242777, 9491077325 హెల్ప్ లైన్ కు సంప్రదించాలని కోరారు.

"జిల్లాలో సుమారు 98 వేల ఎకరాల్లో దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి పండిస్తున్నారు. పంట దిగుబడి క్రమంగా పెరుగుతోంది" అని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ జి. విద్యాధరి వెల్లడించారు.

జిల్లాలో 35 ప్రొసెసింగ్ యూనిట్లలో 27 మాత్రమే మామిడి పండ్ల ప్రొసెసింగ్ చేస్తున్నాయి. గుజ్జు పరిశ్రమల ద్వారా రోజూ దాదాపు 7 వేల మెట్రిక్ టన్నుల మామిడి ప్రొసెసింగ్ జరుగుతున్నదని ఆమె వివరించారు. 2023లో కూడా అధిక దిగుబడి వచ్చిందని, ఆ సమయంలో గుజ్జు పరిశ్రమలు అధిక మొత్తంలో మామిడి పండ్ల ప్రొసెసింగ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అందులో దాదాపు 40 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఇంకా పరిశ్రమల వద్ద మిగిలి ఉందన్నారు. దీంతోనే ఈ ఏడాది గుజ్జు పరిశ్రమల నుంచి డిమాండ్ తక్కువగా ఉండడం, మామిడి ధర తక్కువ కావడానికి కారణాలుగా వివరించారు.

 

మద్దతు ధర

రైతులు నష్టపోకూడదనే తోతాపురి మామిడి కిలో రూ.12గా ధర నిర్ణయించి, జూన్ 6న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిందన్నారు. ఇందులో గుజ్జు పరిశ్రమలు రూ.8, రాష్ట్ర ప్రభుత్వం రూ.4 కలిపి రైతుల ఖాతాకు నేరుగా జమ చేస్తుందని తెలిపారు. జిల్లాలోని 38 ర్యాంపులు, రెండు మండీల వద్ద విక్రయించే రైతులకు కూడా ప్రభుత్వం రూ.4 మద్ధతు ధర అందిస్తుందన్నారు. ప్రొసెసింగ్ యూనిట్లు జూన్ 7 నుంచి గుజ్జు తయారీ ప్రారంభించాయని, అప్పటి నుండి రైతులు, కొనుగోలుదారులు, ప్రొసెసింగ్ యూనిట్లతో జిల్లా యంత్రాంగం సమీక్షిస్తున్నదని చెప్పారు. మామిడి ధర కిలో రూ.6కు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎనిమిది రోజుల నుంచి తోతాపూరి మామిడికాయలు 38 వేల టన్నులు ఫ్యాక్టరీలకు సరఫరా చేశారన్నారు.

బృందాల ఏర్పాటు

మామిడి కాయల కొనుగోలు ప్రక్రియ పర్యవేక్షణకు ప్రొసెసింగ్ యూనిట్, మండీలు, ర్యాంప్ వద్ద హార్టీకల్చర్, అగ్రి కల్చర్ అసిస్టెంట్, విఆర్ఓతో కూడిన రెండు బృందాలను ఏర్పాటు చేశామని ఇంచార్జ్ కలెక్టర్ జి. విద్యాధరి వివరించారు. మండలాలకు మండల స్థాయి ఇంచార్జ్ లను నియమించామన్నారు. ప్రొసెసింగ్ యూనిట్లు ఎక్కువగా ఉన్న పూతలపట్టు, తవణంపల్లి, గుడిపాల మండలాలకు జిల్లా స్థాయి అధికారులను ఇంచార్జ్ లుగా నియమించినట్లు వివరించారు.

Similar News