ఏపీలో సంచలనంగా మారిన రిమాండ్‌ రిపోర్టు

ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల అరెస్టులు వైఎస్‌ఆర్‌కాంగ్రె పార్టీ వర్గాల్లో కలకలం రేపింది.;

Update: 2025-05-17 11:21 GMT

ఆంధ్రప్రదేశ్‌ లిక్కర్‌ స్కామ్‌లో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్‌ అధికారి ధనుంజయరెడ్డి, ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డిల రిమాండ్‌ రిమాండ్‌ తాజాగా సంచలనంగా మారింది. లిక్కర్‌ స్కామ్‌కు, వీరిద్దరికి మధ్య ఉన్న పాత్రకు సంబందించిన కీలక విషయాలకు సంబంధించిన రిమాండ్‌ రిపోర్టు తాజాగా ప్రకంపనులు సృష్టిస్తోంది. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు, లిక్కర్‌ స్కామ్‌లో పాత్రకు సంబంధించిన కీలక అంశాలను సిట్‌ అధికారులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

ఇతరులతో కలిసి ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలు లిక్కర్‌ సిండికేట్‌గా ఏర్పడ్డారు. ఈ సిండికేట్‌లో పలువురు ఉన్నత అధికారులతో పాటు, వ్యాపారులు, రాజకీయ నాయకులు, వారి బంధువులు కూడా ఉన్నట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. లిక్కర్‌ స్కామ్‌లో ఏ1 నిందితుడుగా ఉన్న రాజ్‌ కసిరెడ్డికి వీరిద్దరు సన్నిహితులు. మద్యం తయారీ, సరఫరాల వంటి వ్యవహారాల్లో అందిన ముడుపులను వీరిద్దరు వేరే వారికి బదిలీ చేయడంలో కీలకంగా వ్యవహరించారు.
సరఫరాకు సంబంధించి.. ఆర్డర్‌ ఆఫ్‌ సప్లై వంటి పలు కీలక నిర్ణయాలలో కూడా ఇదే స్కామ్‌లో ఉన్న ఇతర నిందితులతో కలిసి మాజీ ఐఏఎస్‌ అధికారి ధనుంజయరెడ్డి చాలా కీలకంగా వ్యవహరించి చక్రం తిప్పారు. డిస్టలరీస్‌ కంపెనీల నుంచి లిక్కర్‌ సరఫరా చేసిన సంస్థల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు వసూలు చేయడంతో పాటు అలా వసూలు చేసిన ముడుపులను ఇతర నిందితులతో పాటు అనేక మందికి బదిలీ చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఇదే మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న సన్నిహితుల నుంచి ముడుపులు వసూలు చేసి వాటిని ఎవరికి చేర్చారనే దానిని గుర్తించాల్సి ఉంది.
లిక్కర్‌ సిండికేట్లుగా ఏర్పడిన సభ్యుల సమావేశాల్లో వీరు పాల్గొని సంస్థల నుంచి ముడుపులు సకాలంలో, సక్రమంగా అందే విధంగా ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలు చూశారని సిట్‌ అధికారులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ సీక్రెట్‌ సమావేశాలలో లిక్కర్‌ స్కామ్‌లో నిందితులు ఏ1 గా ఉన్న కసిరెడ్డి, ఏ2 వాసుదేవరెడ్డి, ఏ4 ఎంపీ మిథున్‌రెడ్డి, ఏ5 మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఏ3 సత్యప్రసాద్‌లతో కలిసి ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలు సమావేశాల్లో పాల్గొన్నారని రిమాండ్‌ రిపోర్టులో సిట్‌ పేర్కొన్నట్లు సమాచారం.
అంతేకాకుండా వీరిద్దరు ఏ1రాజ్‌ కసిరెడ్డి ఆఫీసుకు తరుచుగా వెళ్తూ ముడుపల వసూళ్లు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని మోనటరింగ్‌ చేసేవారని, అలా వసూలు చేసిన ముడుపులను పెట్టుబడులు పెట్టిడం, ఆస్తులు కొనుగోలు చేయడం, కార్లు కొనుగోలు చేసిన వివరాలు కూడా ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు తెలుసని, వీటికి సంబంధించిన వివరాలను వీరి వద్ద నుంచి వెలికి తీయాల్సి ఉందని కూడా రిపోర్టులో వెల్లడించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వారిద్దరిని ఏడు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలి అని కోర్టును కోరినట్లు కూడా రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. శుక్రవారం అరెస్టు చేసిన సిట్‌ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను శనివారం వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు.
Tags:    

Similar News