TTD | గోవిందుడికి శ్రీవారి అపూర్వ కానుక

గరుడోత్సవం నేపథ్యంలో శుక్రవారం శ్రీగోవిందరాజస్వామి స్వామి వారికి తిరుమల నుంచి విలువైన ఆభరణాలు అందాయి.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-06-06 14:57 GMT
తిరుపతిలో గరుణవాహనంపై ఊరేగుతున్న శ్రీగోవిందరాజస్వామివారు

తిరుపతిలోని శ్రీగోవిందరాజ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల నుంచి అత్యంత విలువైన ఆభరణాలు తీసుకుని వచ్చారు. గోవిందరాజస్వామి వారికి శుక్రవారం సాయంత్రం గరుడోత్సవం నేపథ్యంలో తిరుమల నుంచి శ్రీవారి కానుకగా సుమారు రూ.34.46 లక్షల విలువైన మూడు ఆభరణాలు టిటిడి సమర్పించింది.


ఈ ఆభరణాలను కళాకారుల ప్రదర్శనలతో ఆలయానికి తీసుకుని వచ్చారు. శుక్రవారం రాత్రి గరుడవాహనంపై శ్రీగోవిందరాజస్వామివారు ఊరేగుతుండగా, కళాకారులు నీరాజీనం సమర్పించారు. ఈసారి గోవిందుడి బ్రహ్మోత్సవాల్లో కనుమరుగు అవుతున్న కళారూపాల్లో కీలుగుర్రాల కళాకారులకు కూడా అవకాశం దక్కింది. ఈ కార్యక్రమాలను టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. 


తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి తిరుపతిలో శ్రీగోవిందరాజస్వామివారి స్వయాన అన్న దీంతో గరుడ వాహనంపై గోవిందుడు విహరించే సమయంలో అలంకరించడానికి తిరుమల నుంచి దాదాపు రూ.34.46 లక్షలు విలువ చేసే మూడు ఆభరణాల్లో స్వామివర్ల దీర్ఘ చతురాస్రాకార పతకం ఒకటి, అమ్మవార్ల దీర్ఘ చతురాస్రాకార రెండు పతకాలను శాశ్వత ప్రాతిపదికన టిటిడి బహూకరించింది.

స్థానిక శ్రీఎదురు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి శ్రీవారి ఆభరణాలను ఊరేగింపుగా తిరుమల ఆలయ డిప్యూటీ ఈఓ ఎం.లోకనాథం శ్రీగోవిందరాజ స్వామి ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీ గోవిందరాజస్వామి సకల వైభవంతో శక్తివంతమైన గరుడవాహనంపై, నాలుగు మాడ వీధుల వెంట విహారిస్తూ, ఆనందోత్సాహాల మధ్య తన భక్తులను ఆశీర్వదిస్తారు.

తిరుపతిలో శుక్రవారం సాయంత్రం స్వామివారి కోసం నూతన వస్త్రాలు, తిరువడి ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ ఊరేగింపు తిరుపతిలోని కోమలమ్మ సత్రం నుంచి బజార్ వీధి, సన్నిధి వీధి నుండి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయానికి చేరుకున్నాయి.
ఈ ప్రదర్శన ముందు ఏనుగులు, గుర్రాలు, నృత్య బృందాలు, కోలాటం కళాకారుల ప్రదర్శనలు వాహన ఊరేగింపు శోభను మరింత ఇనుమడింప చేసాయి. ఈ కార్యక్రమాలను టిటిడి ఎఫ్ ఏ అండ్ సిఏవోఓ. బాలాజీ, డిప్యూటీ ఈవో వి.ఆర్.శాంతి, ఏఈవో మునికృష్ణారెడ్డి, తిరుమల ఆలయ బొక్కసం సూపరింటెండెంట్ వి.ఆర్.గురురాజ స్వామి, ఏవీఎవ్వోలు రాజశేఖర్, శ్రీ మోహన్ రెడ్డి, అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.
గరుడవాహనంపై

గోవిందుడు అధిరోహించిన వాహన సేవ ముందు కళాకారుల ప్రదర్శనలు కనువిందు చేశాయి. 


తిరుపతి గోవిందరాజస్వామివారు గరుడవాహనంపై అధిరోహించి, మాడవీధుల్లో ఊరేగారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అడుగడుగునా కర్పూరనీరాజనాలు  అందించారు.

అంతరించి పోతున్న కళల్లో ఒకటిగా ఉన్నకీలుగుర్రాల ప్రదర్శన ఆకట్టుకుంది. 

Similar News