రైతు రాజుగా మారాలి
ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో సీఎం చంద్రబాబు రైతులతో మాట్లాడారు.;
రైతు రాజుగా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్ని కాష్టాలు ఉన్నా.. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలనేది తన ఆకాంక్షని, సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసినందుకు సంతోషంగా ఉందీ అంటూ సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో శనివారం ‘అన్నదాతసుఖీభవ’ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు చెక్కులు అందజేశారు. పొలాల వద్దే ఏర్పాటు చేసిన వేదిక నుంచి రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు వెల్లడించిన పలు సమస్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు.
తక్షణమే రైతుల సమస్యలను పరిష్కరించాలని పక్కనే ఉన్న అధికారులను ఆదేశించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ 2019లో ప్రజలు చేసిన చారిత్రాత్మక తప్పితం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, ప్రజల భవిష్యత్ అనేది అంధకారంలోకి వెళ్లిందని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పవన్ కల్యాణ్ ఆలోచనలు చేశారని.. అందులో భాగంగానే రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తులు పెట్టుకున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం వితంతు పెన్షన్లను రద్దు చేసిందని, కానీ డెవలప్ చేయడం తెలిసిన పార్టీ టీడీపీ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తమ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వితంతు పెన్షన్లను మళ్లీ తీసుకొచ్చినట్లు చెప్పారు. ఆగస్టు 15 నుంచి స్త్రీశక్తి పథకంను అమల్లోకి తెస్తున్నట్లు చెప్పారు. ఉచిత ఆర్టీసీ ప్రయాణం ద్వారా సుమారు 2.62 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందుతారని పేర్కొన్నారు.